టెంపర్ మూవీకి ఫైనాన్స్ చేస్తే.. బండ్ల గణేష్ చీటింగ్పై పీవీపీ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ బండ్ల గణేశ్, పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) మధ్య ఆర్ధిక వివాదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సినిమా సమయంలో తలెత్తిన సమస్యల కారణంగా వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంలో బెదిరించడం, పోలీస్స్టేషన్లో కేసులు నమోదు చేయడం, బండ్ల గణేష్ను అరెస్ట్ చేయడం వరకూ వెళ్లింది. ఈ సమస్యపై టాలీవుడ్ నిర్మాత, పీవీపీ వెంచర్స్ అధినేత ప్రసాద్ వి. పొట్లూరి ఓ ఇంటర్య్వూలో స్పందించారు. ప్రస్తుతం ఆ వీడియో మరోసారి వైరల్ అవుతుంది.
ముఖ్యంగా 'టెంపర్' సినిమా సమయంలో జరిగిన ఫైనాన్షియల్ లావాదేవీలపై స్పష్టత ఇస్తూ, ఇప్పటివరకు మీడియాలో వచ్చిన కథనాలపై తన వెర్షన్ వెల్లడించారు. ఇంటర్వ్యూలో యాంకర్ "బండ్ల గణేష్ మీ దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని వార్తలు వస్తున్నాయి, ఇందులో నిజం ఉందా?" అని ప్రశ్నించారు. ఇందుకు పీవీపీ సమాధానం ఇస్తూ, "ఈ విషయంలో నేను చెప్పేది గానీ, వాళ్లు చెప్పేది గానీ నమ్మకండి... ఇందులో ఉన్న డాక్యుమెంట్స్ మాత్రమే నిజం చెబుతాయి" అని మొదట క్లారిటీ ఇచ్చారు. 'టెంపర్' సినిమాను తామే నిర్మించామని, దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్ సాంక్షన్ చేసి, అందులో రూ.20-25 కోట్ల వరకు ఫైనాన్స్ చేసినట్లు తెలిపారు.

సినిమా రిలీజ్ సమయానికి రావాల్సిన మొత్తం డబ్బు పూర్తిగా రాకపోయినా, హీరోకు ఇచ్చిన కమిట్మెంట్ను గౌరవిస్తూ సినిమా విడుదలను ఆపలేదని పీవీపీ వెల్లడించారు. 'మేము బాధ్యతగా అన్ని చెల్లింపులు పూర్తి చేసి సినిమా రిలీజ్ చేశాం. ఆ తర్వాత బండ్ల గణేష్ కొంత కొంతగా డబ్బులు చెల్లించినా, మొత్తం బకాయి మాత్రం ఇంకా పూర్తిగా రాలేదు. దాదాపు ఐదేళ్లు గడిచినా బ్యాలెన్స్ మొత్తం క్లియర్ కాలేదు' అని ఆయన వివరించారు.
ఈ నేపథ్యంలో తాము చట్టపరమైన మార్గాన్ని ఎంచుకున్నామని పీవీపీ తెలిపారు. చెక్ బౌన్స్ కేసు నమోదు చేశామని, కానీ ఆ కేసు తమకు అనుకూలంగా రాలేదని చెప్పారు. ప్రస్తుతం సివిల్ కేసు కోర్టులో కొనసాగుతోందని తెలిపారు. "ఆ సమయంలో మేమున్నది ఉన్నట్లే చెప్పాం. కానీ లీగల్ విషయాల్లో కొన్ని టెక్నికల్ అంశాలు మాకు అనుకూలంగా లేకపోవడంతో కేసు ఫేవర్గా రాలేదు'అని పేర్కొన్నారు.
ఇక ఈ వివాదంలో మరో ఆసక్తికర అంశాన్ని కూడా పీవీపీ బయటపెట్టారు. ఒకసారి హోటల్లో బండ్ల గణేష్ కలిసినప్పుడు జరిగిన సంభాషణను వివరిస్తూ "అన్నా మీకు డబ్బులు ఇవ్వాలి... మీరు కనిపించడం లేదు ఎక్కడికి వెళ్లిపోయారు?" అంటూ వెటకారంగా మాట్లాడాడని చెప్పారు. దానికి తాను "మరి క్లోజ్ చేయాలి కదా" అని సమాధానం ఇవ్వగా, బండ్ల గణేష్ "నాతో పెట్టుకుంటే ఎప్పటికీ గెలవలేవు" అంటూ హెచ్చరించినట్లు తెలిపారు.
అయితే తర్వాత పరిస్థితి మారిందని, బండ్ల గణేష్ తన తప్పు తెలుసుకుని కొంత తగ్గి మాట్లాడాడని కూడా పీవీపీ వెల్లడించారు. అయినప్పటికీ, డబ్బుల విషయంలో మాత్రం తాము రాజీ పడబోమని స్పష్టం చేశారు. "ఈరోజు కాకపోయినా రేపైనా మాకు రావాల్సిన డబ్బులు వసూలు చేస్తాం. మా ఆర్థిక వ్యవహారాలు చాలా క్లియర్గా ఉంటాయి. ప్రతి లావాదేవీ బ్యాంక్ రికార్డుల్లో స్పష్టంగా ఉంటుంది" అని అన్నారు. ఇక చివరగా, వ్యక్తిగతంగా తనపై తక్కువ చేసి మాట్లాడటం తనకు నచ్చలేదని పీవీపీ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications




