Jani Master : ఆ అమ్మాయి వెనుక అల్లు అర్జున్ లేడు .. జానీ మాస్టర్ కేసుపై పుష్ప-2 ప్రొడ్యూసర్
మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై అత్యాచారం చేసిన కేసులో టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంచల్గూడ సెంట్రల్ జైల్లో ఉన్న ఆయనను కేసు దర్యాప్తులో భాగంగా కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. జానీ మాస్టర్ కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు వినిపించడంతో అల్లు కాంపౌండ్ ఘాటుగా బదులిచ్చింది. తాజాగా పుష్ప-2 నిర్మాత వై. రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
జానీ మాస్టర్ వ్యవహారం తెలుగు చిత్ర సీమలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, సహచర కొరియోగ్రాఫర్లు ఈ ఇష్యూపై స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని మహిళా నటులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్ బాధితురాలికి అన్ని రకాలుగా సాయం అందిస్తోంది. ఆమెకు ఓ బడా హీరో వ్యక్తిగతంగా అండగా నిలిచారని, ఓ ప్రొడక్షన్ హౌస్లో అవకాశం కల్పించినట్లుగా ఛాంబర్ ప్రతినిధులు తెలిపారు.

అయితే ఆ హీరో అల్లు అర్జునేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో పుకార్లకు చెక్ పెట్టారు అల్లు అర్జున్ పర్సనల్ పీఆర్ శరత్ చంద్ర. ఈ కేసుతో అల్లు అర్జున్కి కానీ, పుష్ప డైరెక్టర్ సుకుమార్కు కానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు. తాజాగా పుష్ప-2 నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన వై. రవిశంకర్ ఈ ఇష్యూపై కీలక వ్యాఖ్యలు చేశారు. రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహా, కమెడియన్ సత్య కీలక పాత్రలు పోషించిన మత్తువదలరా 2 విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సోమవారం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రవిశంకర్ను మీడియా ప్రతినిధులు జానీ మాస్టర్ కేసు, అల్లు అర్జున్ పేరు గురించి ప్రశ్నించారు.
జానీ మాస్టర్కు, ఆ అమ్మాయికి మధ్య పర్సనల్ గొడవని ఆయన తేల్చిచెప్పారు. పుష్ప-2 మూవీకి బాధితురాలు తొలి నుంచి పనిచేస్తున్నారని.. అన్ని పాటలకు ఆమె కొరియోగ్రఫి చేస్తున్నారని రవిశంకర్ వెల్లడించారు. ఇంకా రెండు సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయని , వాటికి కూడా ఆ అమ్మాయే కొరియోగ్రఫి చేస్తారని .. కేసు నేపథ్యంలో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన తెలిపారు. పుష్ప-2 కోసం దర్శకుడు సుకుమార్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని.. దీనికి డ్యాన్స్ కంపోజ్ చేసే బాధ్యత జానీ మాస్టర్కే అప్పగించారని రవిశంకర్ పేర్కొన్నారు. అంతా సిద్ధం చేస్తుండగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని రవిశంకర్ స్పష్టం చేశారు.
జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు, తర్వాత జరుగుతున్న పరిణామాలపై అల్లు అర్జున్కేం తెలియదని ఆయన తేల్చిచెబుతున్నారు. కొరియోగ్రఫి టీమ్ పలకరిస్తే, తిరిగి పలకరించేవారని.. అంతకుమించి బన్నీకి ఏం తెలియదని రవిశంకర్ చెప్పారు. అంతేకాదు.. జానీని పక్కనపెట్టి, ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలని కూడా అల్లు అర్జున్ ఎప్పుడూ అనుకోలేదన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అంతా తెలుసు కాబట్టి జాగ్రత్తగానే వార్తలు వస్తున్నాయి. కానీ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియాలో దీనిపై ఫేక్ న్యూస్ వైరల్ అవుతోందని రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











