పుష్ప 2 నిర్మాత నవీన్ ఎర్నేని మెడకు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు.. కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసే అవకాశం?
తెలంగాణలో సంచలనం రేపుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రముఖ నిర్మాత పేరు బయటకు రావడం మరింత సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ వార్తతో టాలీవుడ్ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అయితే ట్యాపింగ్ వ్యవహారానికి ఈ నిర్మాతకు సంబంధం ప్రత్యక్షంగా లేకపోయినా.. మరో కేసు ఈ వ్యవహారానికి లింక్ ఉండటంతో ఆయనపై కేసు నమోదు చేయడం షాకింగ్ ఘటనగా మారింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
గతంలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేనీపై క్రియా హెల్త్ కేర్ కంపెనీ యజమాని, ఎన్నారై చెన్నుపాటి వేణుమాధవ్ కేసు నమోదు చేశారు. తన కంపెనీ వాటాలను బలవంతంగా మార్పిడి చేయించుకొన్నారని పేర్కొన్నారు. ఈ కేసులో రాధాకిషన్ రావు, ఓ ఇన్స్పెక్టర్, ఎస్పైతోపాటు తన కంపెనీలోని నలుగురు లబ్ది పొందారనే విషయంపై ఫిర్యాదు చేశారు.

వేణుమాధవ్ ఫిర్యాదును ఆధారంగా నవీన్ ఎర్నేనిపై కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు సంస్థ ఎండీ రాజశేఖర్ తలశిల, గోపాలకృష్ణ సూరెడ్డి, రవికుమార్ మందలపు, వీరమాచినేని పూర్ణచందర్రావు పేర్లను కేసులో నిందితులుగా చేర్చారు.
అయితే ఈ కేసులో తాజాగా వేణుమాధవ్ పోలీసులను ఆశ్రయించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం టెలిఫోన్ ట్యాపింగ్ కేసులోని నిందితులు తనను బెదిరించారు. గతంలో కిడ్నాప్ చేసి బలవంతంగా వాటాలు రాయించుకొన్నారు. ఈ వ్యవహారంలో నవీన్ ఎర్నేనీ కూడా ఉన్నారు అని ఫిర్యాదు చేయడంతో ఈ కేసు తీవ్రంగా మారింది.

2018 నుంచి కొనసాగుతున్న వ్యవహారం ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో మరింత జటిలంగా మారబోతున్నదని పోలీసు, సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ అండతో నిర్మాత నవీన్ తన సంస్థను బలవంతంగా లాగేసుకొన్నట్టు తాజా ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నారై వేణుమాధవ్ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నిర్మాత నవీన్ ఎర్నేనిపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో పలు సెక్షన్లపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో నవీన్ పాత్ర ఏమిటనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వేణుమాధవ్ చేసిన ఆరోపణల్లో నిజమెంత? అని దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఆరోపణలు నిజమైతే అరెస్ట్ చేయడానికి కూడా వెనుకాడరనే విషయం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











