కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి.. సినీ పరిశ్రమకు మరో షాక్..
బాలీవుడ్ను వరుస విషాదాలు చుట్టు ముడుతున్నాయి. ఖర్మయోగి, రాజ్ తిలక్ లాంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలను నిర్మించిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ అనిల్ సూరి కరోనావైరస్తో మరణించారు. గురువారం రాత్రి మరణించినప్పటికీ ఈ వార్త ఆలస్యంగా మీడియాకు తెలిసింది. అనిల్ సూరి మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అనిల్ సూరి వయసు 77 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం కలిగి ఉన్నారు.

అనిల్ సూరి మృతి గురించి ఆయన సోదరుడు రాజీవ్ సూరి వెల్లడిస్తూ.. జూన్ 2వ తేదీన జ్వరం వచ్చింది. దాంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. వెంటనే ఆయనను హస్పిటల్కు తరలించాం. తొలుత లీలావతి, ఆ తర్వాత హిందుజా హాస్పిటల్కు తరలిస్తే వారు చికిత్స చేయడానికి నిరాకరించారు అని తెలిపారు. ఆ తర్వాత ఆయనను అడ్వాన్స్డ్ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించి వెంటిలేటర్పై చికిత్స అందించాం. చికిత్స పొందుతూ ఆయన గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మరణించారు అని వెల్లడించారు.
అనిల్ సూరి అంత్యక్రియలను శుక్రవారం ఉదయం ముంబైలోని ఓషియారా క్రిమేషన్లో అతికొద్ది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు.
అనిల్ సూరి మృతిపై నటి మౌసమీ చటర్జీ సంతాపం ప్రకటిస్తూ.. నా ఫేవరేట్ డైరెక్టర్ బసు చటర్జీ, నా సోదరుడు లాంటి అనిల్ ఒకే రోజు కోల్పోయాను అని విషాదంలో మునిగిపోయారు. 1979లో రాజీవ్ సూరి మంజిల్ అనే చిత్రాన్ని అమితాబ్, మౌసమీ చటర్జీతో కలిసి నిర్మించారు. ఆ చిత్రానికి బసు ఛటర్జీ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











