వారందరికీ ధన్యవాదాలు.. భగవంతుని సేవలో దర్శకేంద్రుడు
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టేసుకుంది. విరుగుడు లేని ఈ వైరస్.. మానవాళికి ప్రాణాంతకంగా మారింది. ఇప్పటికే కొన్ని లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కరోనా.. మన దేశంలోనూ కోరలు చాచింది. శర వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ను అడ్డుకునేందుకు గత నెలరోజుల నుంచి లాక్ డౌన్ను పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో దాదాపు 30వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
ఒకలా ఇంతలా కరోనా విజృంభిస్తుంటే.. కట్టడి చేసేందుకు లాక్ డౌన్నూ అంతే పటిష్టంగా అమలు చేస్తున్నారు. కరోనాపై దేశం చేస్తున్న పోరాటంలో ముందుండి పోరాడుతున్నది మాత్రం డాక్టర్లు, పోలీసులు, వైద్య సిబ్బంధి, పారిశుద్ధ్య కార్మికులేనన్నది కాదనలేని వాస్తవం. వీరి సేవలను గుర్తించిన దేశ ప్రజలు సమగ్రతను చాటుతూ కరతాళ ధ్వనులు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సైతం.. కరోనాపై పోరాటం చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. కోవిడ్ 19పై పోరాటం చేయడంలో ముందు నిలబడి తమ ప్రాణాలను సైతం లెక్క చేయని పోలీసులకు, డాక్టర్లకు, రైతులకు, వైద్య సిబ్బంధికి ధన్యవాదాలను తెలిపాడు. అంతేకాకుండా ఈ పోరాటంలో మనమంతా విజయం సాధించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నానని తెలిపాడు. ఈ మేరకు ఇంట్లోని దేవుడి విగ్రహాలను, చిత్రపటాలను శుభ్రం చేసి పూజ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











