టాలీవుడ్లో విషాదం.. ఎన్టీఆర్ విలన్ కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రాహుల్ దేవ్ సోదరుడు, నటుడు ముకుల్ దేవ్ కన్నుమూశారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. తమ్ముడి మరణంతో రాహుల్ దేవ్ కృంగిపోయారు. మే 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో ముకుల్ దేవ్ అంత్యక్రియలు జరుగుతాయని రాహుల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ముకుల్ దేవ్ ప్రస్థానం
17 సెప్టెంబర్ 1970లో న్యూఢిల్లీలో ఓ పంజాబీ కుటుంబంలో జన్మించారు ముకుల్ దేవ్. వీరి కుటుంబం పంజాబ్లోని జలంధర్ సమీపంలోని ఓ గ్రామం నుంచి ఢిల్లీకి వలస వచ్చింది. చిన్నప్పటి నుంచి తన తండ్రి ద్వారా ఆఫ్ఘన్ సంస్కృతి ప్రభావం తనపై పడిందని ముకుల్ దేవ్ తెలిపారు. ముకుల్ తండ్రి హరి దేవ్ ఢిల్లీలో అసిస్టెంట్ పోలీస్ కమీషనర్గా పనిచేశారు. 8వ తరగతి చదువుతున్న సమయంలో దూరదర్శన్ నిర్వహించిన నృత్య ప్రదర్శన కోసం మైఖేల్ జాక్సన్ లాగా నటించినందుకు తొలిసారిగా పారితోషికం అందుకున్నారు ముకుల్ దేవ్. ఆయన సుశిక్షితుడైన పైలట్ కూడా. ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీలో పైలట్ ట్రైనింగ్ తీసుకున్నాడు.

బుల్లితెర నుంచి వెండితెరపైకి
తొలుత బుల్లితెరపై అడుగుపెట్టిన ముకుల్ దేవ్ 1996లో వచ్చిన మంకీన్ అనే సీరియల్లో విజయ్ పాండే అనే పాత్రతో అలరించారు. దూరదర్శన్లో ప్రసారమైన ఏక్ సే బాద్ కర్ ఏక్ అనే మరో కామెడీ సీరియల్ ఆయనకు పేరు తీసుకొచ్చింది. అప్పట్లో ఇండియాలో ఫేమస్ అయిన ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా సీజన్ 1కు హోస్ట్గా ముకుల్ దేవ్ పేరు సంపాదించారు. టెలివిజన్ రంగంలో రాణిస్తున్న సమయంలోనే సినిమాలలో అవకాశాల కోసం కూడా ట్రై చేశారు. బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ నిర్మాణ సంస్థ నిర్మించిన నామ్ క్యా హై సినిమాలో ఆఫర్ దక్కించుకున్నప్పటికీ ఈ సినిమా నిర్మాణం జరుపుకోలేదు.
సుస్మితా సేన్తో కలిసి సినిమాల్లోకి
1996లో మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ డెబ్యూ మూవీ దస్తక్లో ఏసీపీ రోహిత్ మల్హోత్రాగా ముకుల్ దేవ్ అలరించారు. అనంతరం ఖిలా, వాజూద్ వంటి సినిమాలలో నటించారు. 2008లో వీవీ వినాయక్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన కృష్ణ సినిమాలో విలన్ జక్కాగా క్రూరత్వం ప్రదర్శించి తెలుగు వారిని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఏక్ నిరంజన్, సిద్ధం, కేడీ, అదుర్స్, బెజవాడ, మనీ మనీ మోర్ మనీ, నిప్పు, భాయ్ సినిమాలో నటించారు. భాయ్ తర్వాత మరే తెలుగు సినిమాలోనూ ముకుల్ దేవ్ నటించలేదు. దాదాపు మూడు దశాబ్ధాల కెరీర్లో తెలుగు, కన్నడ, పంజాబీ, హిందీ, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లీష్ , మలయాళీ భాషల్లో నటించారు ముకుల్ దేవ్. 2020లో జీ5లో వచ్చిన స్టేట్ ఆఫ్ సీగ్: 26/11 వెబ్ సిరీస్లో నటించారు.
తల్లిదండ్రుల మరణంతో డిప్రెషన్లోకి
తల్లి, దండ్రుల మరణం తర్వాత ఢిల్లీలో ఒంటరిగా ఉంటున్న ముకుల్ దేవ్.. అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మే 23న ఆరోగ్యం విషమించడంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ముకుల్ దేవ్ కన్నుమూశారు. ఆయన మరణ వార్తను ముకుల్ స్నేహితురాలు దీప్షిక నాగ్పాల్ సోషల్ మీడియాలో ప్రకటించారు. తల్లిదండ్రుల మరణం తర్వాత ఇంటికే పరిమితమైన ముకుల్ బయటికి వచ్చేవారు కాదని, ఎవ్వరినీ కలిసేవారు కాదని సన్నిహితులు చెబుతున్నారు. తల్లిదండ్రులు, తాజాగా ముకుల్ దేవ్ మరణంతో అతని సోదరుడు, నటుడు రాహుల్ దేవ్ ఒంటరి అయ్యారు. ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











