సీనియర్ నటుడికి కరోనా.. దయచేసి అలా పోస్టులు పెట్టొద్దు..బాధను అనుభవిస్తూనే మాట్లాడుతున్నా అంటూ!
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు భారీ ఎత్తున నమోదవుతున్నాయి. మొదటి వేవ్ లో ఎక్కడో కరోనాతో చనిపోయారు అని చదివేవారు, కానీ ఇప్పుడు మనకి తెలిసిన వారే మరణిస్తున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సెకండ్ వేవ్ లో కరోనా సినీ సెలబ్రిటీలు కూడా భారీ ఎత్తున కరోనా కేసులు బారిన పడుతున్నారు.. తెలుగు ఇండస్ట్రీకి వస్తే పెద్ద ఎత్తున దర్శక నిర్మాతలు నటీనటులు సహా స్టార్ హీరోలు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ కి చెందిన ఒక సీనియర్ నటుడు, దర్శకుడిగా కొన్ని సినిమాలు చేసిన రాజ్ మాదిరాజు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

అంకుల్ సినిమాతో పరిచయం అయి
టాలీవుడ్ లో 2000 సంవత్సరంలో అంకుల్ అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన రాజ్ మాదిరాజు తరువాతి కాలంలో రిషి అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాకు నంది అవార్డులలో బెస్ట్ స్టోరీ కేటగిరీలో అవార్డు కూడా దక్కింది. ఆ తరువాత ఈ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా దక్కింది. ఆ తర్వాత ఆయన పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి డెబ్యూ సినిమా ఆంధ్ర పోరి అనే సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఆయన నటుడిగా చాలా సినిమాల్లో కనిపించి మెప్పించారు.

నటుడిగా మెప్పించి
రాజ్ మాదిరాజు నటుడిగా చాలా సినిమాల్లో నటించారు. అంకుల్, ఆంధ్ర పోరి, కళ్యాణవైభోగమే, అప్పట్లో ఒకడుండేవాడు, మజ్ను, రాజా మీరు కేక, ఉన్నది ఒకటే జిందగీ, జవాన్, మెంటల్ మదిలో, ఐతే 2.0, బ్రోచేవారెవరురా, ప్రెజర్ కుక్కర్, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. నిజానికి ఆయన ఎక్కువగా తండ్రి పాత్రలలో కనిపిస్తుండేవారు. అయితే తాజాగా ఆయన కరోనా బారిన పడినట్లుగా స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే దాని కంటే ముందు ఇలా చనిపోతున్న వార్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని ఆయన కోరారు..

భార్య క్యాన్సర్ బారిన పడినా
నిజానికి ఆయన భార్య కొన్నాళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ ఉదంతాన్ని కూడా గుర్తు చేస్తూ ఆయన చెప్పుకొచ్చారు. ఆమెకు క్యాన్సరని తెలిసినరోజు తమకు దగ్గరి స్నేహితుడు, ఇరవయ్యేళ్ల పాటు క్యాన్సరుతో ఫైట్ చేసి ఒళ్లంతా అలసిపోయినా ఇంకా కొనసాగిస్తూనే ఉన్న ఒక మనిషి ఆమెతో మాట్లాడారని, ఆ దెబ్బకి ట్రీట్మెంటు జరుగుతూండగానే తన భార్య మరో పేషంటుకి ధైర్యం చెప్పగలిగేంత ధృఢంగా తయారయిందని అన్నారు. పాజిటివిటీ అనగానే మొహం చిట్లించేస్తున్న ముదురు మేధావులకు నేను చెప్పేది ఎక్కకపోవచ్చు.. ఇంకా మారడానికి సెన్సిటివిటీ ఏమూలో మిగిలున్న మామూలు మోర్టల్ స్నేహితులకు చెబుతున్నాను అని ఆయన అన్నారు.

ఆ పోస్టులు ఆపండి
అనారోగ్యంతో ఫైట్ చేయగలిగే మొదటి ఆయుధం 'నేను ఆరోగ్యవంతుణ్ణి కావాల'నే కోరికే..అని పేర్కొన్న ఆయన ఫేస్బుక్కు తెరవగానే మొదటి పదిలో ఏడు RIP పోస్టులే అని.. మీరు నిజంగా బాధపడుతూ ఉండచ్చని అన్నారు. అత్యంత ఆప్తులు చనిపోవడం మీకు తీరని దుఃఖం కలిగించి ఉండవచ్చు.. మీరూ ఓదార్పును ఆశించే ఈ పోస్టు పెడుతూ ఉండవచ్చు.. కానీ కరోనాకు ముందు ఆ పోస్టుకి అర్ధం అంతవరకే.. ఇప్పుడది మీమీద సానుభూతితో ఆగట్లేదు.. చదివే ప్రతి మనిషి ధైర్యాన్నీ ఒక శాతం కృంగదీస్తుందని పేర్కొన్నారు.
నేను అనుభవిస్తూనే మాట్లాడుతున్నా
మరణిస్తున్న వారి సంఖ్య ప్రపంచపు యావరేజి కన్నా మన దేశంలో తక్కువేనని ఆయన పేర్కొన్నారు. మీకు తెలిసి రికవర్ అయ్యి ఇంట్లోనే హోం క్వారంటీనులోనో లేదా హాస్పిటలుకి వెళ్లి అక్కడ కోలుకునో ఇంటికి తిరిగొచ్చిన వాళ్ల కథలు పోస్టు చెయ్యండి.. ధైర్యాన్ని పెంచండి.. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ధైర్యాన్ని పెంచడం.. మనమందరం బాధ్యులమే.. మీకు ధైర్యం కలిగించే వార్తలేవీ కనుచూపు మేరలో కనిపించకపోతే, చుట్టూ అంధకారమే మిగిలుంది, దేవుడిదే భారమని అనుకుంటే.. అప్పుడైనా సరే కనీసం నిశ్శబ్దమనే గోరంత దీపం వెలిగించండని అన్నారు. మతితప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగని పేర్కొన్న ఆయన తనకు సైతం కరోనా సోకిందని క్వారంటీనులో ఉండి నొప్పిని భరిస్తూ బాధను అనుభవిస్తూనే మాట్లాడుతున్నానని అన్నారు. తాను ఇప్పుడు బాగానే ఉన్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











