వాళ్లకు లేని బాధ మీకెందుకు.. అలీ, బ్రహ్మానందంలపై వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ క్లారిటీ
జానపదాలు, పౌరాణికాలు, సాంఘిక చిత్రాలు ఏలుతున్న రోజుల్లో తెలుగునాట కామెడీకి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చారు నటకిరిటీ డాక్టర్ రాజేంద్రప్రసాద్. ఆరోగ్యకరమైన హాస్యంతో ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా ఇంటిల్లిపాది నవ్వుకునే చిత్రాలతో అలరించారు రాజేంద్రుడు. కామెడీతో నవ్విస్తూనే, సెంటిమెంట్తో ఏడిపించి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా తన హవా తగ్గుతున్నదని గ్రహించి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయి... వందలకొద్దీ సినిమాలలో నటించారు. అయితే ఇటీవలి కాలంలో రాజేంద్రప్రసాద్ బహిరంగ వేదికలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. స్టార్ కమెడియన్స్ బ్రహ్మానందం, అలీలపై రాజేంద్రుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై ఆయన ట్రోలింగ్ను సైతం ఎదుర్కొన్నారు. తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు రాజేంద్రప్రసాద్. ఈ వివరాల్లోకి వెళితే...
డిసెంబర్ 19న సకుటుంబానాం
రామ్ కిరణ్ హీరోగా, మేఘా ఆకాష్ హీరోయిన్గా రూపొందించిన చిత్రం సకుటుంబానాం. హెచ్ఎన్జీ సినిమాస్ బ్యానర్పై హెచ్ మహాదేవగౌడ, హెచ్ నాగరత్న నిర్మించగా.. ఉదయ్ శర్మ దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్, శుభలేఖ సుధాకర్, సత్య, బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ సినిమా డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ సందర్భంగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజేంద్రప్రసాద్ను అలీ, బ్రహ్మానందంలపై చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ఆయన తనదైనశైలిలో స్పందించారు.

వాళ్లిద్దరితో 40 ఏళ్ల ఫ్రెండ్షిప్
గుండమ్మకథ సినిమాలో సూర్యకాంతంను రామారావు గారు గుండక్క అని పిలుస్తారు. దానికి సూర్యకాంతం గారు సీరియస్ అవ్వగా.. వరుసలు కలపకపోతే నేను అసలు పనిచేయలేను.. నేను పోతానని ఎన్టీఆర్ అంటాడు. అలా కృష్ణాజిల్లాలో పుట్టి పెరిగి వారి నీయమ్మ ఎంట్రా? అనే అలవాటు అయిపోయి.. అలీ, బ్రహ్మానందంలను నేను వేరే విధంగా అన్నానని అనుకుంటున్నారు. అలీ, బ్రహ్మానందంలు నా దగ్గరికి వచ్చి ఒకటే గోల.. అలీగాడొచ్చి వాడెవడు అన్నయ్య, నాకు లేని బాధ వాడికెందుకు అన్నయ్య అంటున్నాడు. బ్రహ్మం.. ఆహా నా పెళ్లంట దగ్గరి నుంచి పరిచయం. వాడైతే గురువుగారు అంటాడు. ఇవాళ్టీకి మా అటాచ్మెంట్ మీరెవ్వరూ ఊహించలేరు. మేం ఒక ఇంట్లో, ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాంటి వాళ్లం. నేనంటే వాళ్లకి ప్రాణం. వాళ్లంటే నాకు వల్లమాలిన ప్రేమ. ఇప్పటి పిల్లలతోనే నేను ఎలా వర్క్ చేస్తానో వాళ్లకి తెలుసు.. మరి వాళ్లతో నేను ఎలా పనిచేయాలి? ఎన్ని వందల సినిమాలు చేశాను వాళ్లతో? అసలు వాళ్లు లేని సినిమా ఉందా? నాతో? అంత చనువు అన్నారు రాజేంద్రప్రసాద్.
నా తిరుమల పర్యటనపై ట్రోలింగ్
అమ్మ చెల్లెల్ని పిన్ని అంటాం.. చిన్నమ్మ అంటాం.. లేకపోతే ఏమే అంటాం. ఏమే ఏంటీ? పెళ్లాన్ని ఏమే అంటాం? మేం తల్లిని కూడా ఏమే అంటాం. అవన్నీ అలవాట్లు. కానీ పుసుక్కున ఓ మాట అన్నాను. అయినప్పటికీ అలీ, బ్రహ్మంలు మాకు లేని బాధ వాళ్లకెందుకు అంటున్నారు. రాసినోడికి ఏం చేయాలో తెలియక రాశాడులే అని నేను వదిలేయమని చెప్పా. మొన్న తిరుమలలో కాటేజీలు కట్టాను. స్వామి వేసిన భిక్ష వల్ల కాటేజీలు కట్టాను. నేను వెళ్లి దర్శనం చేసుకుని బయటికి వస్తే.. మీడియా వాళ్లు మైక్ పెట్టి రెడీగా ఉన్నారు. తిరుమలలో కాటేజీలు కట్టాను, ఆ పని మీద ఇక్కడికి వచ్చాను, నేను స్వామి పనోడినే. కాటేజీ నుంచి రోజూ స్వామికి ఎంతో కొంత ఆదాయం వస్తుంది. అది కరెక్ట్గా ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పానని రాజేంద్రప్రసాద్ తెలిపారు.
అతని ఆన్సర్తో షాకయ్యా
కానీ ఒక యూట్యూబర్ మాత్రం తిరుమలలో నేనేదో చేసినట్లు రాసుకొచ్చాడు. అది మా ఇంట్లో వాళ్లు చూసి తిరుమలలో నువ్వేం చేశావని అడగటంతో షాకయ్యా. నేను తిరుమలలో అడుగుపెట్టిన వెంటనే కాళ్లకు చెప్పులు తీసేస్తా. అంత భయం నాకు కొండమీద. అది చూసి షాకైన నేను.. అతనెవరో కనుక్కోమని నాగరాజు గారికి చెప్పా. అతనిని పట్టుకోగా.. అన్నయ్య ఫీల్ అయ్యాడా? అని ఆ వ్యక్తి నవ్వుతూ అడిగాడట. తిరుమల గురించి రాశారు.. మీకు పాపం చుట్టుకుంటుంది. అలా రాయడం తప్పు కదా అని చెప్పగా.. అలాంటి టైటిల్ పెట్టకపోతే ఎవరు చూడటం లేదని ఆ యూట్యూబర్ చెప్పాడట. మా పరిస్ధితి అలా తయారైంది. మా క్యారెక్టర్స్ మీదకి వెళ్తోంది. నేను ఇన్ని సంవత్సరాల నుంచి మీ ముందు నిలబడి ఉన్నా.. 43 సంవత్సరాల నుంచి శబరిమల మాల, గోవిందుడి మాల వేసుకుంటున్నా. అలాంటి వ్యక్తికి ఇవన్నీ ఆపాదించడం ఎంత వరకు కరెక్ట్ అని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











