పద్మ అవార్డ్స్ గుట్టు తెలుసు.. నేను తలచుకుంటే 2 నిమిషాలే.. రాజేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్
కమెడియన్ అలీపై సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. గడిచిన కొద్దినెలలుగా రాజేంద్రప్రసాద్ తీరు విమర్శలకు తావిస్తోంది. వేదికపై మైక్ అందుకున్నారంటే ఎవరిని టార్గెట్ చేస్తారో? ఎక్కడ నోరు జారుతారో? అని నిర్వాహకులు కంగారుపడే పరిస్థితిని ఆయన తెచ్చుకున్నారు. ఇకపై రాజేంద్రప్రసాద్ను ఏదైనా ఈవెంట్కు పిలవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్ధితి ఎదురైంది. అలీపై వ్యాఖ్యల నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ పాత కాంట్రవర్సీలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
ఎన్టీఆర్ ఇంట్లో పెరిగిన రాజేంద్రప్రసాద్
నటరత్న ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరులోనే పుట్టి పెద్దాయన ఇంట్లో ఒకడిగా పెరిగారు రాజేంద్రప్రసాద్. చిననప్పటి నుంచి ఎన్టీఆర్ను చూస్తూ పెరిగిన రాజేంద్రప్రసాద్కు సినిమాల్లోకి రావడానికి స్పూర్తి కూడా రామారావు గారే. సిరామిక్ ఇంజనీరింగ్లో డిప్లోమా పూర్తి చేసిన రాజేంద్రప్రసాద్ ఉద్యోగం వచ్చి దానిని వద్దు అనుకుని చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. అవకాశాలు ఎంతకు రాకపోవడంతో ఎన్టీఆర్ ఒకసారి ఆయనని పిలిపించారు. జానపద, పౌరాణిక చిత్రాలకు నేను.. సాంఘిక చిత్రాలకు బ్రదర్ ఏఎన్ఆర్, క్రైమ్ థిల్లర్స్కు కృష్ణ ఉన్నారు. మరి నీ స్పెషాలిటీ ఏంటీ అనేది నువ్వే తెలుసుకోవాలని పెద్దాయన చెప్పిన మాటలతో కామెడీ ట్రాక్లో దిగారు రాజేంద్రప్రసాద్.

కామెడీని హీరోని చేసిన రాజేంద్రుడు
కామెడీ జోనర్లో వరుస సినిమాలు తీస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, కామెడీకి కేరాఫ్గా నిలిచారు. కామెడీని హీరోని చేసి ఎందరో దర్శకులను వెండితెరకు పరిచయం చేశారు. రాజేంద్రప్రసాద్ బాటలో ఎంతోమంది దర్శకులు, హీరోలు పరిశ్రమలో అడుగుపెట్టారు. జంథ్యాల, ఈవీవీ, రేలంగి నరసింహారావు వంటి దర్శకులు రాజేంద్రప్రసాద్లోని కామెడీని, నటుడిని బాగా వాడుకున్నారు. హీరోగా బిజీగా ఉన్నప్పటికీ సపోర్టింగ్ రోల్స్ చేశాడు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సేవలందించారు. రాజేంద్రప్రసాద్ సినిమా చూస్తూ బాధలు, కష్టాలు మరిచిపోవచ్చని స్వయంగా దివంగత భారత ప్రధాని పీవీ నరసింహారావు ప్రశంసించారంటే రాజేంద్రప్రసాద్ టాలెంట్ అర్ధం చేసుకోవచ్చు.
కామెడీయే కాదు సెంటిమెంట్లోనూ కింగే
వయసు పైబడటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన రాజేంద్రప్రసాద్ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించారు. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి చిత్రాలతో ఏడిపించారు. తాజాగా షష్టిపూర్తి సినిమాతో మరోసారి తనలోని నటుడిని బయటిక తీశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంటోంది. అయితే ఇన్నేళ్ల కెరీర్లో రాజేంద్రప్రసాద్కు ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు రాలేదని ఆయన అభిమానులు ఫీలవుతుంటారు. ముఖ్యంగా పద్మ అవార్డ్స్ విషయంలో రాజేంద్రప్రసాద్కు అన్యాయం జరిగిందని అంటూ ఉంటారు.
పద్మ అవార్డ్స్ 2 నిమిషాల పని
అయితే పద్మ అవార్డ్స్ తనకు రాకపోవడంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ పద్మ అవార్డుల గురించి ఆలోచించలేదని, అందుకే ఏ బాధ లేదని స్పష్టం చేశారు. పద్మ అవార్డులు పొందిన వారి కంటే తాను టాలెంటెడ్ కాదేమో? వాళ్లకు ఉన్న అర్హత నాకు లేదేమో? అని అంటే నా ఫ్యాన్స్ ఊరుకోరని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు తాను అడిగి ఉంటే రెండు నిమిషాలలో పద్మ అవార్డ్ వచ్చేదని, కానీ తాను ఆ పనిచేయలేదన్నారు. ఇన్నేళ్ల కెరీర్లో ఇది కావాలని నేను ఎప్పుడూ, ఎవరినీ అడిగింది లేదని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











