ఎంజీఆర్పై రాజేంద్రప్రసాద్ అభ్యంతరకర వ్యాఖ్యలు... పెను వివాదంలో నటకిరిటీ
కామెడీని హీరోగా నిలబెట్టిన అరుదైన నటుడు నటకిరిటీ, డాక్టర్ రాజేంద్రప్రసాద్. నాలుగు దశాబ్థాలుగా తన నటనతో తెలుగు వారిని అలరిస్తున్నారు రాజేంద్రుడు. సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఇటీవల భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిన సంగతి తెలిసిందే. 50 ఏళ్ల కెరీర్లో వందలాది చిత్రాలలో నటించిన రాజేంద్రప్రసాద్.. హీరోగా, కమెడియన్గా, సహాయ నటుడిగా సేవలందించారు. అయితే ఇటీవలి కాలంలో రాజేంద్రప్రసాద్ తన నోటి దురుసుతో వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
సినిమాలతో ప్రజలను అలరించిన రాజేంద్రపసాద్.. ఇటీవలి కాలంలో బహిరంగ వేదికలపై మాట్లాడుతున్న తీరు వివాదాస్పదమవుతోంది. మొన్నామధ్య బ్రహ్మానందం, అలీలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. వారిపై ఉన్న చనువుతోనే ఇలా మాట్లాడానంటూ రాజేంద్రుడు వివరణ ఇచ్చుకున్నాడు. రెండ్రోజుల క్రితం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి హాజరైన రాజేంద్రప్రసాద్ను ఓ చిన్నారి సెల్ఫీ అడగ్గా.. ఆ పిల్లాడిని పక్కకు నెట్డేయడం వివాదాస్పదమైంది.

తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్కు కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. రామారావు గారు, నాగేశ్వరరావు గారు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్లు అయితే వాళ్ల మధ్యలో ఉన్న బొట్టు కాంతారావు గారు. తెలుగు క్లాసికల్ ఫిలిమ్స్లో లవకుశ ఎంత గొప్పసినిమా.. కాంతారావు గారు ఈ చిత్రంలో లక్ష్మణుడు. ఈ సినిమా టైంకు ఆయనకు ఆరోగ్యంలో ఏదో తేడాగా ఉంది. రామారావు గారితో కలిసి తిరిగినప్పుడు ఇవన్నీ విన్నాను. కాంతారావు గారికి ఆరోగ్యం బాలేదన్న విషయం పెద్దాయనకి తెలిసి.. నెల రోజులైనా వెయిట్ చేద్దాం, కాంతారావు గారు వచ్చాక షూటింగ్కి వెళ్దామన్నారని రాజేంద్రప్రసాద్ అన్నారు.
కాంతారావు గారిని చూసి తమిళుల గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్ ఉ** పోసుకున్నాడు. కాంతారావు గారి జానపదాలు చూసి.. వాడెవడండి బాబోయ్, ఇండియన్ సినిమాను లేపుకెళ్లిపోతున్నాడు అని ఉ** పోశాడు. ఎన్టీఆర్ గారికి, ఏఎన్ఆర్ గారికి తమ్ముడైనా, అన్నయ్య అయినా, బావ అయినా, బావమరిది అయినా కాంతారావు గారే. వారిద్దరితో పాటు ఆయన అలా దూసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక హీరో కాంతారావు గారు. నా అదృష్టం కొద్దీ మహానటుడు గుమ్మడిగారి ఇంట్లో అందరం కలుసుకునేవాళ్లం. నా కామెడీని, టైమింగ్ని ఎంతో ఇష్టపడి.. నువ్వు ఎలా చేస్తావో ఒకసారి చేసి చూపించమని అడిగేవాళ్లు. గుమ్మడి గారితో, కాంతారావు గారితో కలిసి భోజనం చేసే అదృష్టం నాకు దొరికింది. ఆయన చాలా సెన్సిటివ్ యాక్టర్ అని రాజేంద్రప్రసాద్ గుర్తుచేసుకున్నారు.
ఇండస్ట్రీలో నేను ఐదు జనరేషన్స్తో కలిసి పనిచేశాను. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అద్భుతమైన ప్రతిభ చూపించడంతో రామారావు గారు తొలిసారి మెచ్చుకున్నారు. అయినప్పటికీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నీకెందుకు అవకాశం ఇవ్వాలని ప్రశ్నించారు. పాండి బజార్లో నువ్వు కనిపిస్తే ఇంటికి పంపేస్తామని రామారావు ఫ్యామిలీ వార్నింగ్ ఇచ్చింది. నా కోసం నేను కామెడీని హీరోని చేశాను. ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగవారికి నా సినిమాలు రిలీఫ్ చేయడంలో సహాయపడ్డాయన్న సంతోషం చాలు అని రాజేంద్రప్రసాద్ అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై తమిళులు మండిపడుతున్నారు. ఒక నటుడిని ప్రశంసించడానికి తమ ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పేరును కించపరిచేలా మాట్లాడటం సరికాదని ట్రోలింగ్ చేస్తున్నారు. ఎంజీఆర్పై చేసిన వ్యాఖ్యలకు గాను రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై రాజేంద్రప్రసాద్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications


















