రజనీ సినిమాకు తమిళంలో తక్కువ.. ఆంధ్రాలో ఎక్కువనా?.. తెలుగు ప్రేక్షకుల జేబుకు కూలీ బొక్క
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం కూలీ. ఈ ఏడాదిలోనే మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న కూలీపై తొలి నుంచి భారీ అంచనాలున్నాయి. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి దిగ్గజాలు నటిస్తుండటానికి తోడు ఇటీవల రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై హైప్ను తారాస్థాయికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో కూలీ సినిమా టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో విమర్శలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్
ఇటీవలి కాలంలో పెద్ద సినిమాలకు టికెట్ ధరలను భారీగా పెంచేస్తున్నారు. రిలీజ్కు రెండు మూడు రోజుల నుంచి ఆ సినిమాకు చెందిన నిర్మాత, దర్శకుడు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడమే ఆలస్యం టికెట్ ధరలు పెంచుకోవడానికి, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు వేసుకోవడానికి ఆయా ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చేస్తున్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ధరలకు భయపడి సామాన్యులు థియేటర్ వంక కన్నెత్తి చూడటం లేదు. నాలుగు రోజులైతే ఇంట్లోనే ఓటీటీలో చూసుకోవచ్చని భావిస్తున్నారు.

టికెట్ ధరల పెంపుకు తెలుగు రాష్ట్రాల పోటీ
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సినిమా టికెట్ ధరల పెంపుకు, ప్రత్యేక షోలకు అనుమతులు నిరాకరించడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో ఓ బృందం వెళ్లి జగన్ను ప్రసన్నం చేసుకుంది. అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలుగు సినీ పరిశ్రమ ఏం కోరుకుంటే అది జరిగిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం తొలి నుంచి టాలీవుడ్కు అండగా ఉంటగా.. పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకోవడంతో టికెట్ ధరల పెంపుకు, స్పెషల్ షోలకు అనుమతులు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. అయితే ఆయన కూడా తర్వాత మెత్తబడి టికెట్ ధరల పెంపుకు అనుమతులు ఇచ్చేస్తున్నారు.
చుక్కల్లో కూలీ టికెట్ ధర
స్ట్రెయిట్ తెలుగు సినిమాలు అనుకుంటే పర్లేదు.. కానీ డబ్బింగ్ సినిమాలకు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీగా టికెట్ ధరలు పెంచేస్తూ ఉండటంతో విమర్శలను తీసుకొస్తోంది. ఆగస్ట్ 14న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల వార్ 2.. రజనీకాంత్ నటించిన కూలీ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలకు ఏపీ, తెలంగాణలలో టికెట్ ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూలీ చిత్రానికి చెన్నై నగరంలోని ఓ మల్టీప్లెక్స్లో టికెట్ ధర రూ.183 ఉండగా.. అదే కూలీకి అదే మల్టీప్లెక్స్ సంస్థకు చెందిన థియేటర్లో హైదరాబాద్లో రూ.453 ఉండటంతో నెటిజన్లు ట్రోలింగ్కు దిగుతున్నారు.
డబ్బింగ్ చిత్రాలకు టికెట్ ధర పెంచొద్దు
డబ్బింగ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. తెలుగు సినిమాలు తమిళనాడులో రిలీజ్ కావడానికి, థియేటర్లు ఇవ్వడానికి అక్కడ ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తమిళనాడుకు చెందిన హీరోల సినిమాలకు థియేటర్లు, టికెట్ ధరల పెంపు చాలా సులభంగా జరిగిపోతుంది. తెలుగువారంతే అంత చులకనగా కనిపిస్తున్నారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని తొలిరోజే లాగేసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని.. ఇది ఇలాగే కొనసాగితే సినిమాలు చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు రారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై కూలీ నిర్మాతలు.. థియేటర్ యజమాన్యాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











