పెద్ది కథలోని రిస్క్ అప్పుడే అర్థమైంది.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా మూవీ'పెద్ది'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.292 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రూ.300 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ హైదరాబాద్లో ఘనంగా థ్యాంక్యూ మీట్ (Peddi Thank You Meet) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో రామ్ చరణ్, ప్రముఖ నటుడు జగపతి బాబు, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతలు సతీశ్ కిలారు, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హీరో రామ్ చరణ్ సినిమా విజయంపై తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల ప్రేక్షకులతో కలిసి థియేటర్లో సినిమా చూసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, తాను ఊహించని కొన్ని సన్నివేశాలకు కూడా ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం, విజిల్స్ వేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. సినిమా పూర్తయ్యాక చాలామంది ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా తమను ఎంతగానో ప్రభావితం చేసిందని, ఎంతో ప్రేరణనిచ్చిందని సందేశాలు పంపుతున్నారని చెప్పారు.

తన సినీ ప్రయాణంలో 'పెద్ది'కి ప్రత్యేక స్థానం ఉందని రామ్ చరణ్ పేర్కొన్నారు. "నా కెరీర్లో, నా సినీ లైబ్రరీలో టాప్ సినిమాల్లో ఒకటిగా 'పెద్ది' ఎప్పటికీ నిలిచిపోతుంది" అని అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు తొలిసారి కథ చెప్పిన రోజును గుర్తు చేసుకుంటూ, ఆ కథ విన్న వెంటనే ఆయన్ను హత్తుకుని అభినందించానని చెప్పారు. అయితే ఆ కథ వెనుక ఉన్న అసలు రిస్క్, ఆ పాత్రలోని సవాళ్లు షూటింగ్ ప్రారంభమైన తర్వాతే పూర్తిగా అర్థమయ్యాయని వెల్లడించారు.
ప్రేక్షకుల స్పందన చూస్తుంటే తనకు ఒక విషయం మరింత బలంగా నమ్మకం కలిగిందని రామ్ చరణ్ అన్నారు. "మనస్ఫూర్తిగా, నిజాయితీతో, స్వచ్ఛమైన ఆలోచనతో చేసే పనికి విజయం తప్పక లభిస్తుంది. 'పెద్ది' విజయమే అందుకు నిదర్శనం" అని వ్యాఖ్యానించారు. ఈ విజయాన్ని సాధించడంలో భాగమైన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి, అభిమానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సినిమాలో కీలక పాత్ర పోషించిన జగపతి బాబు నటనపై కూడా రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. "జగపతి బాబు గారి పూర్తి స్థాయి నటనను నేను ఈ సినిమాలోనే నిజంగా ఆస్వాదించాను. కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన చూసి నా కళ్లల్లో నీళ్లు కూడా వచ్చాయి. ఆయన అంకితభావం, పాత్రలో ఒదిగిపోయిన తీరు నాకు ఎంతో ప్రేరణనిచ్చింది" అని అన్నారు. అలాగే సినిమాలో నటించిన ప్రతి నటుడు తమ పాత్రల కోసం ప్రాణం పెట్టి పనిచేశారని కొనియాడారు.
ప్రత్యేకంగా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుతూ, అందులోని ప్రతి సన్నివేశాన్ని ఎంతో కష్టపడి, ఇష్టపడి చేశానని రామ్ చరణ్ తెలిపారు. అయితే ఆ సన్నివేశాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్ తమలో ఉండేదని చెప్పారు. కానీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని ప్రశంసించారు. "రెహమాన్ గారి సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది" అని పేర్కొన్నారు.
సినిమా నిర్మాణం వెనుక ఉన్న కష్టాన్ని కూడా రామ్ చరణ్ వివరించారు. 'పెద్ది' చిత్రాన్ని దాదాపు 185 రోజుల పాటు చిత్రీకరించినట్లు వెల్లడించారు. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేశారని చెప్పారు. పెద్ది వంటి సినిమాలను తెరకెక్కించేటప్పుడు నిజాయితీ ఎంతో ముఖ్యమనీ, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ఆశిస్తే, ఆ స్థాయి అంకితభావం, చిత్తశుద్ధితో పని చేయడం తప్పనిసరి అని రామ్ చరణ్ అన్నారు.
ఇక పాటల రచయిత అనంత శ్రీరామ్ రాసిన పాటలను ప్రస్తావిస్తూ, ఆ పాటలు తన ప్లేలిస్ట్లో ఎప్పటికీ ప్రత్యేక స్థానంలో ఉంటాయని తెలిపారు. సినిమాలోని ప్రతి పాట ప్రేక్షకులను ఆలోచింపజేసేలా, ప్రేరణనిచ్చేలా ఉందని అన్నారు. ముగింపులో ఈ భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు, చిత్రబృందంలోని ప్రతి సభ్యుడికి రామ్ చరణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 'పెద్ది' కేవలం ఒక సినిమా మాత్రమే కాకుండా, తనకు ఒక భావోద్వేగ ప్రయాణమని, ఈ విజయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పారు. రామ్ చరణ్ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.


Click it and Unblock the Notifications






