‘పెద్ది సినిమా అయినా డోంట్ కేర్.. మెగాస్టార్ చిరంజీవి పిలిచినా..’
తెలంగాణలో సింగిల్ థియేటర్లలో పర్సంటేజ్ సిస్టమ్ అమలు చేయాలని కొద్ది నెలలుగా ఆందోళన చేపడుతున్న తెలంగాణ ఎగ్జిబిటర్లు అసోసియేషన్ తీవ్రమైన హెచ్చరికలను జారీ చేసింది. తమ డిమాండ్లను పట్టించుకోకుండా కాలయాపన చేసి సమస్యను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్న కొందరు నిర్మాతలపై తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఈ వివాదం నివురుగప్పిన నిప్పులా రాజేసుకొంటుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఈ వివాదం రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం సినిమా ప్రదర్శనలకు సమస్యగా మారబోతున్నది. తాజాగా హైదరాబాద్లో తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధి శ్రీధర్ మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సమావేశంలో వారు చేసిన డిమాండ్లు ఏమిటనే వివరాల్లోకి వెళితే..
నిర్మాతలు తప్పుడు హామీలతో కాలయాపన చేస్తున్నారు. మేము చేసిన అభ్యర్థనలు, డిమాండ్ల విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. ఒకసారి పెద్ది సినిమా రిలీజ్ అయిందంటే నిర్మాతలు ఏ మాత్రం పట్టించుకోరు. పూర్తిగా సైలెంట్గా ఉంటారు. కాబట్టే మేము మా డిమాండ్ను సాధించుకొనే విషయంలో మరో ఆప్షన్ లేదు. పర్సంటేజ్ సిస్టమ్ అమలు చేయలేకపోతే పెద్ది సినిమాను ప్రదర్శించబోము అని శ్రీధర్ స్పష్టం చేశారు.

పెద్ది సినిమా నుంచి మేము ఆపం అని చెప్పాం. కానీ ఇవ్వాళ, రేపు అంటూ గత ఆరు వారాలుగా ఈ వివాదాన్ని నాన్చుతున్నారు. కానీ మేము కూల్ డౌన్ అవుతామని నిర్మాతలు అనుకొంటున్నారు. కానీ మేము మా కార్యాచరణ విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయం అని శ్రీధర్ అన్నారు.
రెంట్ కాకుండా పర్సంటేజ్ విధానంలో సినిమాలను సింగిల్ థియేటర్లలో ఆడించేందుకు మాత్రమే నిర్ణయం తీసుకొన్నాం. ఇప్పటికే మూడుసార్లకుపైగా చర్చలు జరిగాయి. గతంలో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సమయంలో మా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ సంవత్సరం గడిచినా సమస్య పరిష్కారం కాలేదు. ఇక ఈ విషయంలో మేము రాజీ పడే అవకాశం లేదు. పెద్ది సినిమాకు పర్సంటేజ్ విధానం కావాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు.
యాక్టివ్ నిర్మాతలుగా చెప్పుకొనే వారు.. మమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఈ సమస్యను పక్కదారి పట్టించేందుకు గ్రేడింగ్ అనే విషయాన్ని తెరపైకి తెచ్చారు. మొదట మూడు వారాలు చెప్పి.. ప్రస్తుతం ఆరు వారాలు అని సాగదీస్తున్నారు. పర్సంటేజ్ సిస్టమ్ అమలు చేస్తేనే సినిమాలు ప్రదర్శిస్తాం అని స్పష్టం చేశారు.
రెంట్ పద్దతిలో సింగిల్ థియేటర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. 120కి పైగా థియేటర్లు, వాటి ఓనర్లు పరిస్థితి బాగా లేదు. 10 ఏళ్ల క్రితం సింగిల్ థియేటర్ల రెవెన్యూ బాగుండేది. ప్రస్తుతం ఎగ్జిబిటర్లకు ఆదాయం లేదు. కానీ నిర్మాతలకు 14 రకాలుగా ఆదాయం వస్తున్నది. కాబట్టి మాకు పర్సంటేజ్ సిస్టమ్ కావాలి. ఎంత శాతం ఇస్తారో చెప్పాలి అని సుదర్శన్ థియేటర్ బాలగోవింద్ రాజ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ..
"దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో పర్సంటేజ్ విధానం అమల్లో ఉంది. ఇక్కడ మాత్రమే రెంటల్ విధానం కొనసాగుతోంది. సమస్యను పరిష్కరించకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారు అని ఆరోపించారు.
పర్సంటేజ్ సిస్టమ్ సమస్య గురించి మాట్లాడటానికి మెగాస్టార్ చిరంజీవి పిలిచినా.. చర్చించేందుకు వెళ్తాం. మా కష్టాలు, బాధలు చెప్పుకొంటాం అని అన్నారు. నిర్మాతలు పట్టుబడుతున్న గ్రేడింగ్ ఓ కుంటిసాకు మాత్రమే అని తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ఘాటుగా స్పందించారు.


Click it and Unblock the Notifications