రజనీకాంత్ మిస్ చేసుకొన్న రాంగోపాల్ వర్మ మూవీ ఎంటో తెలుసా?
జానపదాలు, పౌరాణికాలు, సాంఘికాలు తెలుగు తెరను దున్నేస్తున్న కాలంలో శివతో ఓ కొత్త అనుభూతిని ప్రేక్షకులకు కలిగించారు రామ్ గోపాల్ వర్మ. మూసలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా గతిని మార్చి సినిమా మేకింగ్ స్టైల్ను మార్చేసి కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టారు. తెలుగు సినిమా ప్రస్థానం గురించి చెప్పాల్సి వస్తే.. ఖచ్చితంగా శివకి ముందు, శివకి తర్వాత అన్నంతగా టాలీవుడ్లో తన ముద్ర వేశారు ఆర్జీవీ. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన సొంత కష్టాన్ని, ప్రతిభను నమ్ముకుని ఆయన ఇక్కడి వరకు వచ్చారు.
తను దర్శకుడిగా మారడంతో పాటు ఎంతో మంది ప్రతిభావంతులను భారతీయ చిత్ర పరిశ్రమకు రామ్ గోపాల్ వర్మ ప్రచారం చేశారు. కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్, శివ నాగేశ్వరరావు, గుణశేఖర్ ఉత్తేజ్, తేజ, హరీష్ శంకర్, అజయ్ భూపతి, అనురాగ్ కశ్యప్, మాధూర్ భండార్కర్ వంటి దర్శకులు వర్మ స్కూల్ నుంచి వచ్చినవారే. క్రియేటివ్ జీనియస్గా మన్ననలు అందుకున్న ఆర్జీవీ గతంలోలా తన మార్క్ చూపించలేకపోతున్నారు.

సినిమాలు తీసినా, తీయకున్నా వర్మకి ఉన్న క్రేజ్ ఏ డైరెక్టర్కు లేదన్నది వాస్తవం. ముఖ్యంగా ఈ తరం పిల్లలు ఆయనను బాగా ఇష్టపడుతున్నారు. వర్మ మాటలు, చేతలు అన్నీ కాంట్రవర్సీయే. ఆ వివాదాలతోనే ఎప్పుడూ లైమ్ లైట్లో ఉంటూ బోల్డెంత పబ్లిసిటీ సంపాదిస్తుంటారు ఆర్జీవీ. మనసులో ఒకటి, బయటి ఒకటి మాట్లాడే రకం కాదు వర్మ. ఎవరెమనుకున్నా సరే ,ఏ విషయంపై అయినా సరే ఆయన మాటలు కుండబద్ధలు కొట్టినట్లుగా ఉంటాయి.
శివ, క్షణక్షణం, అంతం, గాయం, గోవింద గోవింద వంటి సినిమాలతో టాలీవుడ్లో సక్సెస్ఫుల్గా సాగిపోతున్న రామ్ గోపాల్ వర్మ అనూహ్యంగా తెలుగు ఇండస్ట్రీని పక్కనబెట్టి బాలీవుడ్కు మకాం మార్చారు. ఆయన హిందీలో తీసిన తొలి చిత్రం రంగీలా. 1995లో విడుదలైన ఈ మూవీ బాలీవుడ్ చరిత్రను తిరగరాసింది. అమీర్ఖాన్, ఊర్మిళ, జాకీష్రాఫ్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా వారి కెరీర్కు కూడా ఎంతో ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ఊర్మిళ ఓవర్నైట్ హీరోయిన్గా మారిపోయింది. ఆమె కాల్షీట్ల కోసం దర్శక నిర్మాతలు క్యూకట్టారు.
నిజానికి ఈ సినిమాలో అమీర్, ఊర్మిళ, జాకీష్రాఫ్ పాత్రలకు ముందుగా మరో ముగ్గురు స్టార్స్ను తీసుకోవాలని వర్మ అనుకున్నారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ ఈ విషయాన్ని బయటపెట్టారు. కథ రాసుకునేటప్పుడు తెలుగులో శ్రీదేవి - నాగార్జునలతో తీయాలనుకున్నానని.. అలాగే రజనీకాంత్ను గెస్ట్ రోల్లో చూపించాలనుకున్నట్లు వెల్లడించారు. అయితే శ్రీదేవి, నాగ్ ఇద్దరూ ఈ కథను రిజెక్ట్ చేశారని.. గోవిందా గోవిందను శ్రీదేవి ఇష్టపడ్డారని వర్మ వెల్లడించారు.
గాయం సినిమాలో ఊర్మిళ నటనను చూసి రంగీలా ఆమెతోనే తీయాలని ఫిక్స్ అయినట్లు ఆయన చెప్పారు. రోజా సినిమాలో రెహమాన్ మ్యూజిక్ చూసి ఆయనను రంగీలా తీసుకున్నానని.. అమీర్ఖాన్కు కూడా ఈ స్టోరీ నచ్చగా, రజనీకాంత్తో చేయించాలనుకున్న గెస్ట్ రోల్ని జాకీష్రాఫ్ని ఫిక్స్ చేశానని అలా మూవీ సెట్స్పైకి వెళ్లిందని వర్మ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవేళ శ్రీదేవి, నాగార్జున, రజనీకాంత్లు రంగీలా కనుక చేసి ఉంటే రిజల్ట్ మరో రేంజ్లో ఉండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











