‘ధురంధర్ దెబ్బకి వణికిపోయారు.. రణ్వీర్ సింగ్పై నిషేధం వెనుకే వాళ్లే’
బాలీవుడ్ సూపర్స్టార్ రణ్వీర్ సింగ్పై నిషేధం వ్యవహారం భారతీయ చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. ధురంధర్, ధురంధర్ 2 సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన హీరోకి ఇలాంటి పరిస్ధితి ఎదురవ్వడం ఇండస్ట్రీ వర్గాలను, రణ్వీర్ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈ వివాదంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
2023లో ఫర్హాన్ అక్తర్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రణ్వీర్ సింగ్ హీరోగా డాన్ 3ని నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే సినిమా తీయడంలో ఆలస్యం, స్క్రిప్ట్పై ఏకాభిప్రాయం రాకపోవడం, తదితర కారణాలతో రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. రణ్వీర్ కోరుకున్న విధంగా స్క్రిప్ట్లో మార్పులు చేయడానికి ఫర్హాన్ అక్తర్ ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లుగా బాలీవుడ్ టాక్.

డాన్ 3 నుంచి వైదొలగడంతో నష్టపరిహారం కింద ఫర్హానకు రణ్వీర్ 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేయడంతో పాటు తన తదుపరి సినిమా ప్రళయ్లో అక్తర్కు వాటా ఇవ్వడానికి కూడా ముందుకొచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వివాదం మధ్యలోనే రణ్వీర్ నుంచి 45 కోట్ల రూపాయలు నష్టపరిహారం కోరుతూ ఫర్హాన్ సంస్థ నుంచి లీగల్ నోటీసు వెళ్లింది. అదే సమయంలో వ్యవహారం ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్డబ్ల్యూఐసీఈ) దృష్టికి వెళ్లగా.. ఇది రణ్వీర్పై మూడేళ్లు నిషేధం విధించింది. ఈ కాలంలో సదరు హీరోతో ఎవరు పనిచేయొద్దని పరిశ్రమను సంస్థ ఆదేశించిడంతో బాలీవుడ్తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది.
తాజాగా ఈ పరిణామాలపై రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రణ్వీర్పై నిషేధం అనేది గాంధీజీ శైలిలో సాగించే సహాయ నిరాకరణ అనడం పెద్ద జోక్. ఇది పరిశ్రమ, కార్మికుల రక్షణ గురించి కాదు... కేవలం తమ పట్టును నిలుపుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఓ పాత కార్మిక సంఘాల ప్రదర్శన మాత్రమే. 5 లక్షల మందికి పైగా కార్మికుల తరపున మాట్లాడుతున్నామని అది చెప్పుకుంటున్నా.. 50 లక్షల మందికి పైగా కార్మికుల తరపున మాట్లాడుతున్నామని చెప్పుకున్నా.. వీరిలో చాలామందికి ఈ వివాదంలోని అసలు నిజాలు తెలియవని వర్మ ఆరోపించారు.
ఎఫ్డబ్ల్యూఐసీఈ అనేది న్యాయస్థానం కాదు, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థ కూడా కాదు. న్యాయం అందిస్తున్నట్లు ఇది నటిస్తుంది, కానీ చట్టపరమైన నియమాలను, ప్రక్రియను ఇది విస్మరిస్తుంది. ధురంధర్లో రణ్వీర్ సింగ్ సాధించిన భారీ విజయంతో ప్రాణభయంతో వణికిపోతున్న నటులతో సహా, ఒక నిర్దిష్టమైన అజెండాతో పనిచేసే వ్యక్తుల బృందం రహస్యంగా సమావేశమై తీర్పును ముందుగానే నిర్ణయిస్తుంది. పరిశ్రమలోని లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి ఏ ఒక్క నటుడికో లేదా ఏ ఒక్క ప్రాజెక్ట్కో మాత్రమే ముడిపడి ఉండదు. ఈ అలజడి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఒక బూటకం మాత్రమేనని ఆర్జీవీ దుయ్యబట్టారు.
ఈ మొత్తం వ్యవహారానికి మూలం.. ఒక నిర్మాణ సంస్థ నష్టాలు వచ్చాయని ఆరోపించడమే. భారతదేశంలో ఇలాంటివి నిత్యం జరుగుతూనే ఉంటాయి. దీనిలోని చిక్కులు వివాదంలో ఉన్న వారికి మాత్రమే తెలుస్తాయి. వీరు కోర్టును కనుక ఆశ్రయిస్తే న్యాయమూర్తి ఏం చేయాలనేది నిర్ణయిస్తారు. రణ్వీర్ తప్పు చేసినట్లు ఇప్పుడు వాదిస్తున్న వారు ఆధారాలతో నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. రణ్వీర్తో పనిచేయడానికి నిరాకరించాల్సింది లక్షలాది మంది కార్మికులు కాదు.. పరిశ్రమలోని ఇతర నిర్మాతలు. రణ్వీర్ కనుక ఊ అంటే చాలు ఉదయానికే చెక్కులు తీసుకుని ఆయన ఇంటి ముందు నిర్మాతలు క్యూకడతారు.
థియేటర్లో టికెట్లు తెగేలా చేసేది రణ్వీర్ సింగ్ వంటి స్టార్స్ తప్పించి.. ఎఫ్డబ్ల్యూఐసీఈ కాదు. అలాగే లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది రణ్వీర్ సింగ్ లాంటి స్టార్స్ తప్పించి.. ఎఫ్డబ్ల్యూఐసీఈ కాదు. రణ్వీర్ వంటి తారల వల్లే ఈ పరిశ్రమ, దానితో పాటు ఎఫ్డబ్ల్యూఐసీఈ కూడా మనుగడలో ఉన్నాయి. ఇరుపక్షాలకు ఉన్న వివాదంలో అనవసరంగా తల దూర్చొద్దని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు బాలీవుడ్లో చర్చనీయాంశమయ్యాయి.


Click it and Unblock the Notifications




