VYOOHAM: వైఎస్సార్ డెత్ తర్వాత అలా జరిగిందా? ఆసక్తికరంగా వర్మ వ్యూహం టీజర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో నిత్యం వివాదాలతో సహవాసం చేస్తూ సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్గా నిలుస్తోన్న దర్శకుడు రాంగోపాల్ వర్మ. గతంలో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. కొంత కాలంగా కాంట్రవర్శీ అండ్ అడల్ట్ సినిమాలనే చేస్తున్నాడు. ముఖ్యంగా రాజకీయ నేపథ్యంతో సాగే కొన్ని వివాదాస్పద అంశాలను టచ్ చేస్తూ మూవీలు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయలపై పలు చిత్రాలను రూపొందించాడు.
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న చిత్రమే 'వ్యూహం'. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. 'అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం' అనే కాన్సెప్టుతో నిజమైన అంశాలతో ఈ చిత్రాన్ని తీస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

తాజాగా రిలీజ్ అయిన టీజర్ 'వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలీకాప్టర్ ప్రమాదం' జరిగిన సంఘటనతో మొదలైంది. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురైన కఠిన సమస్యలు, అప్పటి అధికారి పార్టీ నాయకుల తీరు, అలాగే, ప్రతిపక్ష పార్టీ నాయకులను ఇందులో హైలైట్ చేశారు. ముఖ్యంగా వైఎస్ జగన్ను అరెస్ట్ చేసిన సన్నివేశాన్ని కూడా చూపించారు. ఇక, చివర్లో జనాల మద్దతుతో జగన్ సీఎం అయినట్లు ఓ ఫ్రేమ్ పెట్టారు. అంతేకాదు, 'అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు' అనే డైలాగ్తో ముగించారు.
మొత్తంగా ఈ 'వ్యూహం' మూవీ టీజర్ చూస్తుంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచే సన్నివేశాలే కనిపించాయి. అంతేకాదు, ఏపీలోని ప్రధాన ప్రతిపక్షాన్ని మరింత ఇబ్బంది పెట్టే కొన్ని సీన్స్ కూడా పెట్టినట్లు ఈ టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఫైనల్గా ఈ టీజర్ చూసిన వాళ్లంతా వైఎస్సార్ డెత్ తర్వాత అలా జరిగిందా? అని అనుకునే సీన్స్తో నింపేశారు.
ఇదిలా ఉండగా.. రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న 'వ్యూహం' మూవీలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, భారతీ రెడ్డి పాత్రలో మానసలు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్పై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎన్నికల ముందు విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











