యానిమేషన్లో రామాయణం.. 32 ఏళ్ల నిరీక్షణకు తెర, రిలీజ్ ఎప్పుడంటే?
భారతీయుల ఇతిహాసం రామాయణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాల్మీకి మహార్షి రాసిన ఈ గ్రంథం.. మనిషి వ్యక్తిత్వ వికాసానికి దీపిక అంటారు పెద్దలు. కొడుకుగా, అన్నగా, భర్తగా, తండ్రిగా, అన్నింటికి మించి ప్రజలను కన్నబిడ్డల్లా పాలించిన మహారాజుగా శ్రీరాముడు తరతరాలుగా భారతీయుల పూజలందుకుంటున్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, తండ్రి మాటను జవదాటకూడదని, ధర్మం తప్పకూడదని మనిషి అనే వాడు ఇలా జీవించాలని లోకానికి చూపించిన వాడు శ్రీరామచంద్రుడు.
శ్రీమహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించి ధర్మాన్ని నిలబెట్టాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. రామాయణంలోని ప్రతి పాత్ర గొప్పదే. శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, భరతుడు, ఆంజనేయుడు, వాలి, సుగ్రీవుడు, రావణుడు, మండోదరి, అంగదుడు, ఇంద్రజిత్, మేఘనాథుడు చివరికి జటాయువు, చిన్న ఊడుతకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.

ప్రతి వస్తువును కథా వస్తువుగా తీసుకునే సినీ రంగం చూపు రామాయణంపై ఏనాడో పడింది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు భారతదేశంలోని అన్ని భాషల్లో రామాయణంపై లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. మొన్నటి మొన్న ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చి నెలలు గడవకుండానే రామయణ్ పేరుతో రణబీర్ కపూర్ - సాయిపల్లవి కాంబినేషన్లో మరో సినిమా సిద్ధమవుతోంది. అయినా ఎన్నిసార్లు చూసినా తనివి తీరనది రామాయణం. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో ఇంకెన్ని సార్లు వచ్చినా రామాయణానికి ఉన్న క్రేజ్ తగ్గదు.
అలాంటి రామాయణంపై వచ్చిన ఓ సినిమా భారతదేశంలో 32 ఏళ్లుగా విడుదల కాలేదు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఏకంగా యానిమేషన్లో మూడు దశాబ్ధాల క్రితమే రూపొందించిన రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ సినిమా ఈ నెల 24న తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాముడి కథను టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందని మూడున్నరేళ్ల క్రితం యానిమేషన్లో తీసుకురావాలన్నది అరుదైన విషయం.
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత నేపథ్యంలో ఈ సినిమా విడుదల ఆగిపోయింది. అది అలాగే కొనసాగుతూ 32 ఏళ్లుగా ఈ చిత్రం రిలీజ్ కాలేదు. అయితే ఈ చిత్ర నిర్మాతలు, కొందరి పట్టుదల కారణంగా ఎట్టకేలకు రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ థియేటర్లలో విడుదల కానుంది. యుగో సాకో, కోయిచి ససకి, రామ్ మోహన్ సహా 450 మంది ఆర్టిస్టులు, లక్షమంది ఎంతో శ్రమించి ఈ విజువల్ వండర్ను తెరకెక్కించారు. 4కే వెర్షన్లో వస్తున్న ఈ సినిమాను దిగ్గజ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షించారు.

రిలీజ్ డేట్ గురించి చెబుతూ చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో సీతారాములు, అయోధ్య, మిథిలా నగరాలు, సీతారామ వనవాసం, రామ- రావణ యుద్ధం తదితర అంశాలను హై స్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్తో తెరకెక్కించారు. చిన్నారులను ఈ సినిమా విశేషంగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











