Ravi Teja: పులిని వేటాడే పులి.. అద్భుతంగా టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్.. ఐదుగురు హీరోలతో రిలీజ్
వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. గతేడాది ధమాకాతో డబుల్ ట్రీట్ ఇచ్చిన రవితేజ 2023లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో సందడి చేశాడు. మళ్లీ అతి తక్కువ సమయంలోనే రావణాసుర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అదంతగా హిట్ సాధించలేదు. కానీ ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ మరో సినిమాతో సిద్ధంగా ఉన్నాడు రవితేజ. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ వదిలారు మేకర్స్.
హిట్లు-ప్లాపులు:ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత మాస్ మహారాజా రవితేజ ప్లాప్ అందుకున్న మూవీ రావణాసుర. డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు మరోసారి మంచి హిట్ కొట్టేందుకు ప్రేక్షకుల ముందుకు 'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao)గా వస్తున్నాడు రవితేజ.

భారీ అంచనాలు:మాస్ మహారాజ్ రవితేజ, వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. దానికి తగినట్లుగానే సినిమా మేకింగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ వదిలారు.
బ్లాక్ పాంథర్ తరహాలో:రాజమండ్రిలో గ్రాండ్ గా ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోకు దగ్గుబాటి వెంకటేష్ వాయిస్ ఓవర్ అదిరిపోయింది. అంతేకాకుండా అందులో టైగర్ నాగేశ్వర రావు గురించి చెప్పే డైలాగ్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఈ గ్లింప్సులో వచ్చే సీన్స్, సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఇక "బ్లాక్ పాంథర్" మూవీ సిరీస్ తరహాలో ఉన్న బీజీఎమ్ మాత్రం నెక్ట్స్ లెవెల్ లో ఉంది.

ది టైగర్ జోన్:"ప్రపంచాన్ని భయపెట్టే చీకటి కూడా అక్కడి జనాలను చూసి భయపడుతుంది. దడదడమని వెళ్లే రైలు కూడా ఆ ప్రాంతం పొలిమేర రాగానే గజగజ వణుకుతుంది. ఆ ఊరు మైలు రాయి కనపడితే జనం అడుగులు తడబడతాయి. దక్షిణ భారతదేశపు నేర రాజధాని స్టువర్టుపురం. ఆ ప్రాంతానికి ఇంకో పేరు కూడా ఉంది ది టైగర్ జోన్. ది జోన్ ఆఫ్ టైగర్ నాగేశ్వరరావు" అంటూ వెంకీ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

5 భాషల్లో ఐదుగురు:"జింకల్ని వేటాడే పులుల్ని చూసింటావ్. కానీ పులులను వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా" అని చివర్లో రవితేజ చెప్పే డైలాగ్ వీడియోకు ప్రధాన హైలెట్ గా నిలిచింది. ఈ గ్లింప్స్ వీడియోను తెలుగులో వెంకటేష్, హిందీలో జాన్ అబ్రహం, కన్నడలో శివరాజ్ కుమార్, మలయాళంలో దుల్కర్ సల్మాన్, తమిళంలో కార్తి విడుదల చేశారు. అంటే సౌత్ నుంచి నార్త్ వరకు అగ్ర హీరోలతో ఫస్ట్ లుక్ రిలీజైంది.
ఇద్దరు హీరోయిన్లు:'టైగర్ నాగేశ్వరరావు' సినిమా 1970-80 ప్రాంతంలో స్టువర్టుపురం గజదొంగగా పేరు మోసిన టైగర్ నాగేశ్వర రావు జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. ఇందులో రవితేజ పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాలో కృతి సనన్ చెల్లెలు నూపుర్ సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. మరో హీరోయిన్ గా గాయత్రి భరద్వాజ్ చేస్తోంది. ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 సినిమాల నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











