Srihari's Death: శ్రీహరి మరణానికి కారణం అదే.. ప్రభుదేవాతో ఆ ఒక్కరోజు.. డిస్కో శాంతి ఎమోషనల్
తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటనకు మారుపేరుగా నిలిచారు రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి. విలనిజమైనా, కామెడీ అయినా, సహాయ పాత్రలైనా తన మార్క్ చూపారు. అన్నింటికి మంచి మనిషిగా, మానవతావాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీహరి. తన వద్దకు ఎవరొచ్చినా తనకు చేతనైన సాయం చేసి అండగా నిలిచిన మంచి మనసు ఆయనది. మరణించి 11 ఏళ్లు కావొస్తున్నా తెలుగు చిత్ర పరిశ్రమపై ఇప్పటికీ ప్రభావం చూపుతున్నారు డాక్టర్ శ్రీహరి. ఈ నేపథ్యంలో ఆయన అనారోగ్యం, మరణంపై కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీహరి సతీమణి డిస్కో శాంతి. ఈ వివరాల్లోకి వెళితే :
1964న స్వాతంత్య్ర దినోత్సవం రోజున పుట్టారు శ్రీహరి. చిన్నప్పటి నుంచి ఫిజికల్ ఫిట్నెస్పై ఫోకస్ పెట్టి మిస్టర్ హైదరాబాద్గా ఏడుసార్లు నిలిచారు. పలుమార్లు జాతీయ స్థాయిలోనూ సత్తా చాటారు. కెరీర్లో మంచి అథ్లెట్గా స్థిరపడాలని శ్రీహరి కలలు కనగా.. విధి ఆయనను సినీరంగం వైపు నడిపించింది. 1986లో స్టంట్ మాస్టర్గా సినీ పరిశ్రమలో కెరీర్ మొదలుపెట్టిన శ్రీహరి .. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా తన మార్క్ వేశారు. హీరోగానూ సత్తా చాటి తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. తన సహ నటి డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీహరికి ఇద్దరు కుమారులు శశాంత్, మేఘాంశ్ అయితే తన గారాలపట్టి , ముద్దుల కూతురు అక్షర మరణంతో శ్రీహరి మానసికంగా కృంగిపోయారు.

ఆమె పేరిట ఫౌండేషన్ స్థాపించి నాలుగు గ్రామాలను దత్తత తీసుకోవడంతో పాటు ఎంతో మంది పేద విద్యార్ధుల చదువుకు సాయం చేసి రియల్ స్టార్ అనిపించుకున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో రాంబో రాజ్ కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన శ్రీహరి .. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. యూనిట్ సభ్యులు ఆయనను హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ 2013 అక్టోబర్ 9న తుదిశ్వాస విడిచారు. శ్రీహరి హఠాన్మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.
కాగా.. శ్రీహరి సతీమణి డిస్కో శాంతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భర్త అనారోగ్యం, మరణంపై కీలక విషయాలు వెల్లడించారు. శ్రీహరి నాన్ వెజ్ బాగా ఇష్టపడతారని కానీ చివరి రోజుల్లో ఉప్పు లేకుండానే భోజనం చేయాల్సి వచ్చిందన్నారు. చక్కెరకేళి, అరటిపండు, సీతాఫలం అంటే శ్రీహరికి బాగా ఇష్టమని డాక్టర్ దానిని ఇవ్వొద్దన్నారు. జాండీస్ వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని, కానీ షూటింగ్లో నాన్ వెజ్ తినడంతో ఆరోగ్యం దెబ్బతిందని శాంతి తెలిపారు . భోజనం విషయంలో తాను కేర్గా ఉంటానని.. కానీ తనకు తెలియకుండా వాళ్ల ఫ్రెండ్స్ నాన్ వెజ్ పెట్టారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
మందు తాగకుండా తాను కంట్రోల్ చేస్తే కొందరి వల్ల శ్రీహరి మళ్లీ మొదలుపెట్టారని .. అర్ధరాత్రి పూట కొందరు ఫ్రెండ్స్ వచ్చి తాగేవాళ్లని , నాకు తెలియడంతో వారిని ఇంటికి రానివ్వలేదని శాంతి చెప్పారు. ఒక్కరోజు షూటింగ్ చేస్తే మీ రోల్ కంప్లీట్ అవుతుందని ప్రభుదేవా చెప్పడంతో శ్రీహరి ముంబైకి వెళ్లారని.. సెట్లో దోమలు కుట్టడం వల్ల ఆయనకి జ్వరం వచ్చిందని తెలిపారు. జ్వరానికి రాంగ్ ఇంజెక్షన్ చేయడంతో శ్రీహరి ఆరోగ్యం దెబ్బతిందని.. నాతో , పిల్లలతో మాట్లాడారని కాసేపటికి లోపలికి వెళ్లి చూసేసరికి ఆయన కళ్లు, ముక్కు, నోట్లో నుంచి రక్తం వచ్చిందని ఆమె గుర్తుచేసుకున్నారు.
శ్రీహరి పరిస్ధితి చూసి అత్తమ్మ వాళ్లకు ఫోన్ చేసి చెబితే.. వాళ్లు నా పిల్లలకు ఫోన్ చేసి టికెట్లు బుక్ చేయమన్నారని శాంతి కన్నీటి పర్యంతమయ్యారు. నేను సరిగా చూసుకోలేదని, ఆస్తి కోసం నేనే తీసుకెళ్లి శ్రీహరిని చంపేశానని నాపై దుష్ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆయన ఏది కొన్నా నా పేరిటే కొనుగోలు చేశారని శాంతి వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











