అర్ధరాత్రి మంచు మనోజ్ అరెస్ట్ హైడ్రామా.. మోహన్ బాబు ఫిర్యాదు ఎందుకంటే!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ అరెస్ట్ సమయంలో తిరుపతిలోని బాకరాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో హై డ్రామా చోటు చేసుకొన్నది. తిరుపతి జిల్లా చిన్న గొట్టిగల్లు మండలం బాకరాపేట ప్రాంతంలోని గెస్ట్ హౌస్లో బస చేసిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆ సమయంలో తనను అరెస్ట్ చేయడాన్ని మనోజ్ అభ్యంతరం తెలిపి.. వారితో వాదనకు దిగినట్టు తెలిసింది. అయితే ఫిర్యాదు మేరకే తాము అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పి మనోజ్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ అరెస్ట్ గురించిన వివరాల్లోకి వెళితే..
తిరుపతికి సమీపంలోని బాకరాపేట ప్రాంతంలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్లో తన సిబ్బందితో కలిసి మనోజ్ బస చేశారు. ఆ విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. మనోజ్ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించారు. అయితే మంచు మనోజ్ అనుచరులం. ఆయనతోపాటు ఇక్కడే ఉన్నామని బదులిచ్చారు. అయితే మీరు మాతో పోలీస్ స్టేషన్కు రావాలని చెప్పారు. దాంతో ఎందుకు రావాల్సి ఉంటుందో.. ఫిర్యాదు ఏమిటో చెప్పాలని మనోజ్ ప్రశ్నించారని తెలిసింది.

అయితే పోలీసులతో వాగ్వాదం జరిగిన తర్వాత మనోజ్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే తాము పోలీస్ స్టేషన్కు చేరుకొన్న సమయంలో ఎస్సై లేరు అని మనోజ్ సిబ్బంది తెలిపారు. అయితే తమను అకారణంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు మనోజ్తోపాటు అనుచరులు బైఠాయించారు. దాంతో గొడవకు దారి తీసే ప్రమాదం ఉందని భావించి.. వెంటనే సీఐతో మనోజ్ను మాట్లాడించారు.
అయితే మోహన్ బాబు యూనివర్సిటీలో చోటు చేసుకొంటున్న లోపాలను ప్రశ్నించడం కొందరికి నచ్చడం లేదు. విద్యార్థుల భవిష్యత్ కోసం పోరాటం చేస్తుంటే ఇబ్బంది పెట్టడం తగదు. అర్ధరాత్రి తనిఖీల పేరుతో మేము బస చేసిన రెస్టారెంట్, గెస్ట్ హౌస్లోకి పోలీసులు రావడం కరెక్ట్ కాదు. ఎన్ని ధ్వంసాలు, విధ్వంసాలు చేసినా వారిపై కేసు ఉండదు అని మనోజ్ తన నిరసనను వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, మోహన్ బాబు, మంచు విష్ణుతో మనోజ్కు కొద్దికాలంగా వివాదం కొనసాగుతున్నది. ఆస్తులు, ఇతర అంశాల నేపథ్యంగా గొడవలు జరిగి హైదరాబాద్లో పోలీస్ కేసులు, కోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల కోర్టులో మోహన్ బాబు, మనోజ్ ఇద్దరు గొడవ పడ్డారనే విషయం కూడా మీడియాలో వైరల్ అయింది. అయితే బాకరా పేటలో మనోజ్ ఉన్నారని తెలుసుకొన్న మోహన్ బాబు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యూనివర్సిటీ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తుగా అదుపులోకి తీసుకొన్నారు. ఆ కారణంగానే ఆయనను అరెస్ట్ చేశారనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











