అప్పుడు తోసి పారేశారు.. ఇప్పుడు ఆయనతోనే సినిమా చేశా.. భీమ్లా నాయక్ డైరెక్టర్ ఎమోషనల్
భీమ్లా నాయక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన సాగర్ కే చంద్ర మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇప్పటికే ఆలస్యం అవుతుంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడను కేవలం ఐదు నిమిషాలు నాకు ఇవ్వండి అంటూ మొదలు పెట్టిన ఆయన ఈ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్, ప్రత్యేక అతిథిగా హాజరైన తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదంతా ఒక కల లాగా అనిపిస్తోంది అని చెప్పుకొచ్చిన సాగర్ చంద్ర ఎక్కడో నల్గొండ నుంచి వచ్చిన నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేశాను అంటే అది తన చుట్టూ ఉన్న మంచి మనుషుల కారణంగానే అని చెప్పుకొచ్చారు.

మంచి మనుషుల కారణంగా
తన తండ్రి రామచంద్రారెడ్డి, తల్లి సునీత, సోదరి గాయత్రి అలాగే తన భార్య తనకు అండగా లేకపోతే ఇన్నేళ్ళ తన కల తీరి ఉండేది కాదని ఆయన చెప్పుకొచ్చారు.. సినిమాలు చేయాలనే ఉద్దేశంతో నల్గొండ నుంచి హైదరాబాద్ వచ్చానని అలాంటి సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పంజా సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ జరుగుతోందని తెలుసుకుని ఒక పాస్ జేబులో పెట్టుకుని అక్కడికి వెళ్ళాను అని చెప్పుకొచ్చారు.. అప్పటికే తాను సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాను కానీ అక్కడ మూడు సార్లు బయటకు తోసేసిన పరిస్థితితో బాధ పడ్డా అని చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసి మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను అంటే అది కేవలం తన చుట్టూ ఉన్న మంచి మనుషుల కారణంగానే జరిగింది అని చెప్పుకొచ్చారు.

పేరుపేరునా ధన్యవాదాలు
ఇక సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరిని పేరుపేరునా గుర్తుచేసుకున్నారు సాగర్ చంద్ర. ముందుగా దగ్గుబాటి రానా అంటే ఎనర్జీ మారుపేరని అన్ని పరిస్థితులలో కూడా ఆయన ఒకే ఎనర్జీ కలిగి ఉంటారని చెప్పుకొచ్చారు. దేవుడు కలలోకి వచ్చి నాకు వేరే ఎవరిలాగా అయినా బతికే అవకాశం ఇస్తాను అంటే నీ లా బతకాలని కోరుకుంటా అని చెప్పుకొచ్చారు. సముద్రఖని, సంయుక్త మీనన్, నిత్యామీనన్, రావు రమేష్, పమ్మి సాయి సహా నటీనటులందరూ అద్భుతంగా నటించడమే కాక బాగా సహకరించారని సాగర్ చంద్ర చెప్పుకొచ్చాడు. ఇక సినిమా కోసం పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ సహా అందరినీ పేరుపేరునా సాగర్ చంద్ర ధన్యవాదాలు తెలిపాడు.

ఆత్మీయులు అని
దేవుడు నా కోసం మంచి మనుషులను వెతికి పంపించారేమో అనిపిస్తూ ఉంటుందని ముఖ్యంగా అలాంటి వాళ్లలో ముందుగా చెప్పుకోవాల్సింది నాగ వంశీ గారి గురించి అని సాగర్ చంద్ర చెప్పుకొచ్చారు. ముందు నుంచి నన్ను నమ్మి ఈ ప్రాజెక్టులో నన్ను భాగం చేసిన ఆయనకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అని అన్నారు. ఇక నిర్మాత చిన్న బాబు గురించి చెబుతూ వంశీ గారు మీకు రక్త సంబంధీకులు అయి ఉండవచ్చు కానీ నన్ను కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా చూసుకున్నారు, ఇండస్ట్రీలో చాలా మంది సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఉన్నారు కానీ మీరు మాత్రం ఆత్మీయులు అని కచ్చితంగా చెప్పగలను అని చెప్పుకొచ్చారు సాగర్ చంద్ర.

మొట్టమొదటిసారి
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని సినిమా మొత్తానికి ఆయన ఒక బ్యాక్ బోన్ లాగా పని చేశారు అని చెప్పుకొచ్చారు. సినిమాకి స్క్రీన్ ప్లే ఇవ్వకపోతే ఆయన గనుక సినిమా డైలాగ్స్ ఇవ్వకపోతే సమర్థవంతంగా సినిమా చేయగలిగే వాడినో లేదో అని అన్నారు. అవుట్ పుట్ ఎలా వచ్చింది అని నా కంటే ఎక్కువ ఆతృతగా ఉత్సాహంగా ఆయన ఉండేవారని ఇప్పుడు ఎక్కడున్నారో కనబడడం లేదు కానీ సినిమా మొత్తానికి ఆయనే బ్యాక్ బోన్ అని చెప్పుకొచ్చారు. తాను చాలా మంది దగ్గర సినీ పరిశ్రమలో అనేక విషయాలు తెలుసుకున్నాను కానీ మొట్టమొదటిసారి మీ దగ్గర నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చారు ఆయన.
Recommended Video

అదీ పవన్ అంటే
ఇక చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఫ్యాన్స్ అందరూ ఆయనను పవర్ స్టార్ అని పిలుస్తాము కానీ ఆయనకు అలా పిలవడం ఇష్టం ఉండదు అని ఆయన చెప్పుకొచ్చారు.. పవర్ స్టార్ అభిమానిగా ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం ఒక గొప్ప వరం అని భావించే స్థాయి నుంచి ఆయనతో సినిమా చేసే స్థాయికి వచ్చారు అంటే ఇక నా జన్మ ధన్యం అయినట్లే అని సాగర్ చెప్పుకొచ్చాడు. నేను మా నల్గొండ వెళ్ళినప్పుడు కానీ లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ అసలు ఏమిటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది అని చెప్పిన సాగర్ దానిని ఒక గజల్ రూపంగా మీ ముందుకు తీసుకు వస్తున్నారు అంటూ ఒక హిందీ గజల్ వినిపించారు. ''గెలుపంటే మోజులేదు ఓటమి అంటే భయం లేదు చావే అర్థం కానప్పుడు చావుకు మాత్రం ఎందుకు భయపడతావ్ వెళ్లి ఆకాశంలో గర్జించు'' అంటూ చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు.


Click it and Unblock the Notifications











