సోలో బ్రతుకే సో బెటర్ అనేసిన మెగా మేనల్లుడు.. వెంటనే రియాక్ట్ అయిన రానా
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' అనేశాడు. అంటే అతగాడికి పెళ్లి గట్రా వద్దని చెబుతున్నాడన్నమాట. ఈ విషయం చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. తోటి నటీనటులు వెంటనే రియాక్ట్ అయ్యారు. దగ్గుబాటి రానా, వెన్నెల కిషోర్ దీనిపై స్పందించారు. అరె! ఏంటిది తికమకగా ఉందే.. అనుకుంటున్నారు కదూ. అసలు కథకు ఇప్పుడొద్దాం.
జయాపజయాలకు లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ నేపథ్యంలోనే తన కొత్త ప్రాజెక్టు వివరాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. తన కొత్త సినిమా పేరు 'సోలో బ్రతుకే సో బెటర్' అని తెలుపుతూ టైటిల్ పోస్టర్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు మెగా మేనల్లుడు. ఈ సినిమాకు కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించనున్నాడని తెలిపాడు. టైటిల్ చాలా డిఫెరెంట్ గా ఉండటంతో దీనిపై రానా, వెన్నెల కిషోర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. టైటిల్ చాలా బాగా ట్రెండీగా ఉందని కామెంట్ చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియనున్నాయి.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ప్రతీ రోజూ పండగే' సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు బన్నీవాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఎస్ థమన్ బాణీలు కడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్ చివర్లో ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











