భేష్ సాయిమాధవ్ బుర్రా.. 300 మంది రంగస్థల కళాకారులకు చేయూత
పేద, ధనికులనే తేడా లేకుండా అన్నివర్గాలపై కరోనావైరస్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ప్రదర్శన ఇస్తే గానీ పూట గడవని కళాకారులు పరిస్థితి గురించి ఇక చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎంతో మంది కళాకారులు సరైన అవకాశాలు, ఆదరణ లేక పేదరికంలో మగ్గుతున్నారు. అలాంటి వారిని కరోనా లాక్డౌన్ ఆర్థికంగా మరింత కుంగదీస్తున్నది.
ఈ క్రమంలో కళాకారులు జీవితం, వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిన రంగస్థల నటుడు, దర్శకుడు, సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ రంగస్థల నటులకు అండగా నిలిచారు. సమాజంపై తన వంతు బాధ్యతగా పేద కళాకారులకు నిత్యావసర వస్తువులను అందించారు. తన సొంత పట్టణం తెనాలిలో 300లకుపైగా రంగస్థల కుటుంబాలను ఆదుకొన్నారు. తన కళావేదిక కళల కాణాచి అనే సంస్థ ద్వారా సుమారు రూ.3 లక్షల రూపాయల విలువైన సరుకులను కళాకారులకు అందించారు.

జీవితంలో తాను ఎదగడానికి కారణమైన రంగస్థలాన్ని, ఆ కళాకారులను ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గుర్తుంచుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తోటి కళాకారులను ఆదుకోవడంపై సాయిమాధవ్ బుర్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా పేద కళాకారులు ఆర్థిక పరిస్థితులను, వారి జీవన విధానాన్ని అడిగి తెలుసుకొన్నారు. సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ వారితో తన అనుభవాలను, గతంలో నాటక రంగంలో కొనసాగినప్పటి అనుభూతులను ఈ సందర్భంగా పంచుకొన్నారు.



Click it and Unblock the Notifications











