హైదరాబాద్లో సల్మాన్ ఖాన్ షూటింగ్ .. ప్రధాని, సీఎం రేంజ్ మించి సెక్యూరిటీ
కరడుగట్టిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రాణహాని పొంచి ఉన్న నేపథ్యంలో బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ భద్రతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఆయన క్లోజ్ ఫ్రెండ్ , మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్య నేపథ్యంలో సల్మాన్కు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయన నివాసం, కార్యాలయం, చివరికి షూటింగ్ ప్రదేశాలను సైతం భద్రతా దళాలు డేగ కళ్లతో పహారా కాస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్లో షూటింగ్కు వచ్చిన సల్మాన్కు కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతను కల్పించారు . ఈ వివరాల్లోకి వెళితే..
1998లో రాజస్థాన్లో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాంతంలో నివసించే బిష్ణోయ్ తెగకు కృష్ణ జింకలు అత్యంత పవిత్రమైనవి, తమ పూర్వీకులే కృష్ణ జింకలుగా తమ కోసం మళ్లీ పుట్టారని వారు భావిస్తారు. అలాంటి కృష్ణ జింకలను సల్మాన్ వేటాడంపై బిష్ణోయ్ కమ్యూనిటీ అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తెగకే చెందిన లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్స్టర్ .. సల్మాన్ను చంపుతానని శపథం చేశాడు.

ఇప్పటికే పలుమార్లు ఇందుకు కుట్ర చేశాడు కూడా. ఈ క్రమంలోనే సల్మాన్కు అండగా నిలుస్తున్నాడనే కక్షతో గత నెలలో మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని ఈ గ్యాంగ్ దారుణంగా కాల్చి చంపింది. తమ నెక్ట్స్ టార్గెట్ సల్మాన్ ఖానేనని చెప్పిన బిష్ణోయ్ గ్యాంగ్.. పలుమార్లు ఆయనకు హెచ్చరికలు పంపింది. ఈ నేపథ్యంలో సల్మాన్కు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సికిందర్లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికల నేపథ్యంలో సల్మాన్ ఖాన్కు హైదరాబాద్లో నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 70 మందికి పైగా కమాండోలు సల్మాన్ భద్రతా విధుల్లో ఉన్నారు. వీరిలో ఎన్ఎస్జీ కమాండోలు, పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.
హైదరాబాద్లో సికిందర్ షూటింగ్ కోసం రెండు సెట్లను ఏర్పాటు చేశారు. ఓ ప్రైవేట్ హోటల్ సహా మరో ప్రాంతంలో ఈ మేరకు షూటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశాలను భద్రతా సిబ్బంది తమ ఆధీనంలో తీసుకున్నారు. సల్మాన్ బస చేసిన హోటల్కు వచ్చే సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మొత్తం రెండు దశల్లో తనిఖీలు నిర్వహిస్తున్టన్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే హోటల్ సిబ్బందిని కూడా ప్రతీ రోజూ తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. నో స్వాపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. అయితే ఏకంగా దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో సల్మాన్ ఖాన్కు భద్రతా ఏర్పాట్లు చేస్తుండటంతో ఈ వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
హైదరాబాద్లో సికిందర్ షూటింగ్ను పూర్తి చేసిన తర్వాత దుబాయ్లో దబాంగ్ రీలోడెడ్ షోను ప్రారంభించడానికి వెళ్తారని బాలీవుడ్ టాక్. సికిందర్ను సాజిద్ నడియడ్వాలా నిర్మిస్తుండగా.. సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్లు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











