Samantha: ఆయనతో గొడవలు లేవు... తేల్చేసిన సమంత
టాలీవుడ్ అగ్రనటి సమంత తెలుగులో గట్టి కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. గత కొంతకాలంగా హిందీలోనే వెబ్ సిరీస్ చేస్తుండటం.. ఆ లోపు రాజ్ నిడిమోరుతో పెళ్లి కావడంతో పూర్తిగా ముంబైకే పరిమితం అయ్యారు సమంత. ఈ నేపథ్యంలో తన సొంత బ్యానర్పై సామ్ నిర్మించి నటించిన మూవీ మా ఇంటి బంగారం. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం మే 25న హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాండ్ దువ్వూరులు కలిసి మా ఇంటి బంగారం సినిమాను నిర్మించగా.. బీవీ నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించగా.. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్గా వ్యవహరించారు. తొలుత షెడ్యూల్ ప్రకారం మే 15న రావాల్సిన ఈ సినిమా.. అనివార్య కారణాలతో జూన్ 19కి వాయిదా పడింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.

తొలుత రాజ్ నిడిమోరు మాట్లాడుతుండగా తెలుగులో మాట్లాడాలని అభిమానులు గొడవ చేశారు. సార్కి తెలుగు వచ్చమ్మా అంటూ యాంకర్ సమీర భరద్వాజ్ చెప్పింది. ఆ వెంటనే మైక్ అందుకున్న రాజ్ మాట్లాడుతూ.. క్లుప్తంగా చెప్పమంటారా? విశదీకరించి చెప్పమంటారా అని అడిగాడు. తిరుపతి అబ్బా మాది.. మా తిరుపతి భాషలో మాట్లాడించాం. డైలాగ్ కూడా ఒక్కొక్కడిని కొడతా చూడు అని మా ఊరి భాషలో చెప్పించాం. నందినీ, సమంత బెస్ట్ ఫ్రెండ్స్. మా ఇంటి బంగారం అనేది ప్రేమతో, అప్యాయంగా పిలిచే పదం. కానీ దాని వెనుక చాలా అర్ధం ఉంటుందని చెప్పారు.
మరో నిర్మాత హిమాంక్ దువ్వూరి మాట్లాడుతూ.. నాకు తెలుగు బాగా వచ్చు. వాళ్లది తిరుపతి అయితే మాది నెల్లూరు. ఈ సినిమాలో యాక్టర్ సమంత డామినేషన్ కనిపిస్తుంది, ట్రైలర్లో ఇప్పటికే మీకు అర్ధమైపోయింది, సినిమాలో చాలా బీభత్సంగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి, చర్చించి తీసుకున్నామని తెలిపారు. ఇక్కడ మేం ఆరుగురిమే ఉన్నాం.. కానీ ఈ సినిమా వెనుక చాలామంది చాలా కష్టపడ్డారు. అందుకే ఆ క్వాలిటీ మీకు ట్రైలర్లో కనిపించింది. దానికి ఇంకో లెవల్లో సినిమాలో కనిపిస్తుంది. అందరూ జూన్ 19న సినిమాని చూసి ఎంజాయ్ చేయండి.
మీ పక్కన ఇద్దరు దర్శకులు ఉన్నారు. ఒకరు రాజ్ గారు, ఇంకొకరు నందినీ గారు. ఇద్దరిలో నచ్చిన క్వాలిటీ, ఒక ఇరిటేట్ చేసే క్వాలిటీ ఏంటీ చెప్పమని యాంకర్ సమీరా భరద్వాజ్ అడగ్గా... ఇరిటేట్ చేసే అంశాలు ఇద్దరిలో లేవు. నందినీకి నాకు 15 ఏళ్ల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇరిటేషన్ కూడా అలవాటైపోయింది. ఇక ఈరోజు వరకు కూడా నాకు రాజ్గారితో ఏ విషయంలోనూ, ఎప్పుడూ వాదన జరగలేదు. రాజ్గారు, నందినీ గారు చాలా పర్ఫెక్ట్. మా ఇంటి బంగారం కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్, డ్రామా, కామెడీ, యాక్షన్ అన్ని ఉన్నాయి. మీరంతా మీ బంగారంతో థియేటర్స్కి వచ్చి జూన్ 19న తప్పకుండా చూడండి అని సమంత తెలిపారు. చివరిలో దర్శకురాలు బీవీ నందినీ రెడ్డి మాట్లాడుతూ.. జూన్ 19న థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి. మీరంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తారని వెల్లడించారు.


Click it and Unblock the Notifications


