కేసు విత్ డ్రా చేసుకుంటా.. అల్లు అర్జున్ని వదిలేయండి : తొక్కిసలాట మృతురాలి భర్త
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్లో తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని డిసెంబర్ 13న హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడంతో టాలీవుడ్ సహా భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఉదయం నుంచి రాష్ట్ర, జాతీయ మీడియా మొత్తం అల్లు అర్జున్ వార్తల కవరేజీలో బిజీగానే ఉన్నాయి. కోర్టు అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేయడంతో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లయ్యింది.
తొక్కిసలాటకు సంబంధించి బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్, అతని టీమ్, సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు పోలీసులు. దీనిలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఆ వెంటనే గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. అల్లు అర్జున్కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్ట్. ఈ తీర్పుతో చిత్ర పరిశ్రమ, అల్లు అర్జున్ అభిమానులు షాక్ అయ్యారు.

మరోవైపు.. అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించింది. ఆయన తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు సూపరింటెండెంట్కు రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని.. కేసును, సాక్షులను ప్రభావితం చేయరాదని బన్నీని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. అలాగే రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. అల్లు అర్జున్తో పాటు సంధ్య థియేటర్ యజమానులకు కూడా ఇదే ఆదేశాలు వర్తిస్తాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.
మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ , రిమాండ్ వార్త విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా సంఘీభావం తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, నాగబాబులు స్వయంగా అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు. ఇదిలాఉండగా.. అల్లు అర్జున్ అరెస్ట్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నేరం ఎవరు చేశారన్నదే తమకు ముఖ్యమని.. అతను సినిమా స్టారా, పొలిటికల్ స్టారా అన్నది మాకు అనవసరమన్నారు సీఎం. అల్లు అర్జున్ ఎలాంటి హంగామా లేకుండా వచ్చి సినిమా చూసి వెళ్లుంటే ఈ గొడవ ఉండేది కాదని.. కానీ ఆయన కారులో నుంచి బయటికి వచ్చి చేతులు ఊపుతూ లోపలికి వెళ్లారని రేవంత్ రెడ్డి తెలిపారు. చిరంజీవి, చంద్రశేఖర్ రెడ్డిలు కాంగ్రెస్ నేతలని.. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మా కుటుంబానికి బంధువులని అయినా చట్టం ప్రకారమే తాము నడుచుకుంటున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

కాగా.. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలుసుకున్న తొక్కిసలాటలో మరణించిన రేవతి భర్త భాస్కర్ స్పందించారు. బన్నీ అరెస్ట్ అయిన విషయం తనకు తెలియదని.. నా కొడుకు పుష్ప 2 సినిమా చూస్తానంటే తీసుకెళ్లానని , తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్కు సంబంధం లేదని తెలిపారు. ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తనకు సమాచారం ఇవ్వలేదని.. తాను న్యూస్ ఛానెల్స్ ద్వారా విషయం తెలుసుకున్నానని భాస్కర్ తెలిపారు. అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం భాస్కర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











