వరలక్ష్మీ శరత్ కుమార్ వివాదంలోకి యాంకర్ విష్ణుప్రియ... డైరెక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్కు టాలీవుడ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటీల మధ్య వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. సంజీవ్ దర్శకత్వంలో వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర జంటగా నటించిన పోలీస్ కంప్లైంట్ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో వరలక్ష్మీపై సంజీవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకుని కూడా ప్రమోషన్స్కి రాలేదని, డబ్బింగ్ సమయంలోనూ తనను వేధించిందని, ఒక దశలో తాను అడుక్కున్నప్పటికీ ఆమె కనికరించలేదని వాపోయారు.
ఇది కాస్తా వివాదంగా మారడంతో మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. అయితే మరుసటి రోజు సాయంత్రానికి ఈ వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వరలక్ష్మీకి సంజీవ్ స్వయంగా క్షమాపణలు చెప్పారు. బాధలోనే అలా అన్నాను కానీ నిజంగా తనకు వరలక్ష్మీతో ఎలాంటి విభేదాలు లేవని సంజీవ్ క్లారిటీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి వరలక్ష్మీ కూడా స్పందించింది. సత్యం, న్యాయం ఎప్పటికైనా గెలుస్తాయని ఈ విషయంలో వేగంగా స్పందించిన తెలుగు నిర్మాతల మండలికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజీవ్ మేగోటీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

గొడవ చేయాలి, సినిమా కోసం హైప్ చేయాలని ఇదంతా మాట్లాడలేదు. నా కెరీర్లో చాలా పెద్ద సినిమా వరలక్ష్మీ గారు, నవీన్ గారు, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం వంటి 52 మంది ఆర్టిస్టులతో చేసిన ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో డిసెంబర్లో టీజర్ లాంచ్ చేశాం. వరలక్ష్మీ గారు చాలా మంది నటి, షూటింగ్ లోకేషన్కి రావడం సపోర్ట్ చేయడం కూడా చాలా అద్భుతంగా చేశారు. అంతకుముందే ఆమె గురించి లేడీ బాలయ్య అని అందరూ చెప్పేవారు. ఆవిడతో చాలా జాగ్రత్తగా చేయాలి.. కరెక్ట్ టైంకి వస్తారు షూటింగ్ చేస్తారని చెప్పారని సంజీవ్ తెలిపారు.
ఫస్ట్ డే కూడా నా కంటే ముందే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సెట్కి వచ్చేశారు. 8.30కి షూటింగ్ అయితే 8.25 కల్లా మేకప్తో రెడీగా ఉండేవారు. 45 రోజులు షూటింగ్ చేస్తే అన్ని రోజులూ అలాగే వచ్చేవారు. షూటింగ్ సమయంలో వేలు విరిగిపోతే 2 నెలలు గ్యాప్ వచ్చింది.. అయినప్పటికీ కట్టుతోనే షూటింగ్ చేసి సహకరించారు. ఇప్పటి వరకు సీరియస్ రోల్స్ చేసిన వరలక్ష్మీ గారు నా సినిమాలో కొంచెం హ్యూమర్ టచ్ ఇచ్చారు. షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రమోషన్స్లోనే ఇబ్బంది వచ్చింది. సినిమాని ఎలా జనంలోకి తీసుకెళ్లాలని అనుకున్నాం.. డిసెంబర్ నుంచి కూడా వరలక్ష్మీ గారు రకరకాల కారణాలు చెప్పడంతో వాయిదా వేస్తూ వచ్చామని సంజీవ్ చెప్పారు.
400 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నాం.. ప్రమోషన్స్ చేస్తే మనకి, మన సినిమాను కొనుక్కున్న వాళ్లకి డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో మనం చెబితే పనిచేయదు. వరలక్ష్మీ గారు ప్రమోషన్స్లో ఉంటే రీచ్ బాగుంటుంది.. కానీ ఆమె సరిగా స్పందించలేదు. డిస్ట్రిబ్యూటర్లు, మీడియా వాళ్లు కూడా ప్రమోషన్స్లో వరలక్ష్మీ ఎందుకు రావడం లేదని అడిగేవారు. 5 రోజులు ప్రమోషన్స్లో పాల్గొంటానని ముందే అగ్రిమెంట్ చేసుకున్నారు. ఒకరోజు వచ్చారు. మిగిలిన 4 రోజులు రావడం లేదు.. కనీసం రిలీజ్కు రెండు రోజుల ముందైనా ప్రమోషన్స్ చేయాలని అనుకున్నాం. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ సైడ్ నుంచి ఇంకేదో చేయాలని అన్నప్పుడు ప్రెస్మీట్లో కొంచెం సీరియస్గానే మాట్లాడాను. లాభం, నష్టం ఏమీ అనుకోలేదు.. కేవలం నా బాధ చెప్పుకున్నానని సంజీవ్ తెలిపారు.
నేను గతంలో చేసిన సినిమాల కంటే పెద్ద సినిమా, థియేటర్స్ కూడా సెట్ అయిపోయింది. మా నిర్మాతలకు కూడా సినిమా గురించి పెద్దగా అవగాహన లేదు. సరిగ్గా ప్రెస్మీట్ మొదలయ్యే సమయానికి ఈరోజు వరలక్ష్మీ గారు ఎందుకు రాలేదనే మాటలు వినిపించాయి. ఆ మాటలతో ఇంకా బాధనిపించి అలా మాట్లాడా. నూటికి నూరు శాతం షూటింగ్కి సపోర్ట్ చేశారు. రిస్కీ షాట్ కూడా చేశారు, వేలు విరిగితే రెస్ట్ తీసుకుంటూనే షూటింగ్లో పాల్గొన్నారు. అంత చేసిన మనిషి ఇప్పుడెందుకు చేయడం లేదనే ఒక బాధతోనే అలా అన్నాను. నా జీవితంలో ఏ అమ్మాయిని గానీ, ఫ్రెండ్స్ని కానీ హర్ట్ చేసిందే లేదు. సొంత బ్రదర్ని కూడా అరేయ్ అని పిలవలేదు.. బాబు అనే పిలుస్తానని సంజీవ్ చెప్పారు.
వరలక్ష్మీ గారి గురించి నేను అన్న మాటలు చాలా వైరల్ అయ్యాయి. వేరే వేరే వాళ్లంతా ఈ మాటలను అన్వయించుకున్నారు. ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా విష్ణుప్రియ అనే ఒక ఆర్టిస్ట్ కూడా ఏదో ట్వీట్ చేశారు. ఆవిడతో నాకు పరిచయం లేదు. మీరు రెమ్యునరేషన్ ఇచ్చేది మేం యాక్టింగ్ కోసం మాత్రమే ప్రమోషన్స్ కోసం కాదు కదా అని ట్వీట్ చేశారు. సినిమాకు సంబంధించి వరలక్ష్మీతో పాటు ప్రతి ఆర్టిస్ట్ నుంచి అగ్రిమెంట్ రాయించుకున్నాం. ఇన్నిరోజులు షూటింగ్ డేస్, ప్రమోషన్స్ కోసం ఇన్ని రోజులు అని అగ్రిమెంట్లో ప్రస్తావించాం.
నయనతార లాంటి వారైతే ముందే ప్రమోషన్స్కి రానని చెప్పేస్తారు. అయితే అగ్రిమెంట్లో ఉంది కాబట్టి వరలక్ష్మీ గారు వస్తారని అనుకున్నాం. నేను మాట్లాడినది నెగిటివ్గా తీసుకుని విష్ణుప్రియ అనే అమ్మాయి ట్వీట్ చేయడం, ఆవిడెందుకు మాట్లాడింది? ఆవిడకి ఈ సినిమాతో ఏం సంబంధం ఉందో నాకైతే అర్ధం కాలేదు. విష్ణుప్రియ ఎవరో కూడా నాకు తెలియదు. 32 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను.. అందరితోనూ పనిచేశా, కొత్తవాళ్లు తెలియదని సంజీవ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విష్ణుప్రియ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications





