Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కేసు.. ఏకంగా ఆ సెక్షన్లు.. వివాదమేంటీ?
ఎప్పుడూ సరదాగా, నవ్వుతూ, నవ్విస్తూ మాట్లాడుతూ జోష్ తీసుకొస్తారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. మనసులో ఏం దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. వేదికలపై ప్రసంగించేటప్పుడు కూడా సరదాగానే ఉంటూ.. ఎంత వరకు మాట్లాడాలో అక్కడి వరకే మాట్లాడతారు. అలాంటిది కొద్దిరోజుల క్రితం మైక్ అందుకోగానే పూనకం వచ్చినట్లు ఊగిపోయారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. ఈ ఆవేశమే ఆయనను చిక్కుల్లో పడేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం రెట్రో. మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 26న హైదరాబాద్లో జరిగింది. ఈ ఈవెంట్కు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్ జరగడానికి నాలుగు రోజుల ముందు జమ్మూకాశ్మీర్లోని పర్యాటక ప్రదేశం పహల్గామ్లో ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు.

పహల్గామ్ ఉగ్రదాడితో దేశం షాక్
అమాయకులైన పర్యాటకులను చుట్టుముట్టి.. వారిలో పురుషులను వేరు చేసి, మతం పేరు కనుక్కుని మరి కాల్చి చంపారు. భార్యాబిడ్డల కళ్ల ముందే భర్తలను దారుణంగా హతమార్చారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలంటూ దేశం మొత్తం ఊగిపోతున్న సమయం అది. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. దీంతో పాకిస్తాన్ సైతం మనదేశంపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడగా వాటిని సైన్యం విజయవంతంగా కూల్చేసింది. ఆ వెంటనే ఇండియన్ ఎయిర్ఫోర్స్.. పాకిస్తాన్లోని సైనిక స్థావరాలు, ఎయిర్ఫోర్స్ స్టేషన్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై దాడులు చేసి ధ్వంసం చేసింది. భారత్ దాడులతో ఉక్కిరిబిక్కిరైన పాకిస్తాన్ వెంటనే కాళ్లబేరానికి వచ్చింది.
కాశ్మీర్ ఇండియాదేనన్న విజయ్
ఉగ్రవాదుల దాడిపై రెట్రో స్టేజ్ మీద ఆగ్రహంతో ఊగిపోయారు విజయ్ .. పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ టెర్రరిస్టు నా***లకు సరైన ఎడ్యుకేషన్ ఇప్పించి ఉంటే బ్రెయిన్వాష్ అవ్వకుండా ఉంటారని విజయ్ మండిపడ్డారు. కాశ్మీర్ ఇండియాదే.. కాశ్మీరీలు మనవాళ్లేనని, తాను షూటింగ్ నిమిత్తం అక్కడికి వెళ్లానని చాలా బాగా చూసుకున్నారని విజయ్ తెలిపారు. పాకిస్తాన్పై ఇండియా దాడి చేయాల్సిన అవసరం లేదని.. అక్కడి ప్రజలే ఆ దేశ ప్రభుత్వంపై దాడి చేస్తారని విజయ్ దేవరకొండ జోస్యం చెప్పారు. భారతీయులు ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
గిరిజనులపై వ్యాఖ్యలు
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇదే ప్రసంగంలో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పాతకాలంలో అటవిక గిరిజన తెగలు కొట్టుకుంటున్నట్లుగా ఇండియా- పాకిస్తాన్లు కొట్టుకుంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. విజయ్ వ్యాఖ్యలు తమ జాతిని, గిరిజనులను కించపరిచేలా ఉన్నాయంటూ ఆదివాసులు పలు చోట్ల ఆందోళనలకు దిగారు. విజయ్ దేవరకొండపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో గిరిజన సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. దీనిని స్వీకరించిన పోలీసులు హీరోపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. మరి దీనిపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











