నువ్వెంత , నీ బతుకెంత.. కళ్లునెత్తికెక్కాయా : కిరాక్ ఆర్పీపై మండిపడ్డ బాబూ మోహన్
జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు కిరాక్ ఆర్పీ. నెల్లూరు యాసలో ఆర్పీ చేసే సందడి మామూలుగా ఉండదు. తన స్కిట్స్లో పంచ్ డైలాగ్స్, ప్రాసలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆర్పీ ఈ పాపులారిటీతో కొన్ని సినిమాల్లో అవకాశాలను కూడా దక్కించుకున్నారు. సినిమాలు, షోలలో చేస్తూనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట తన జిల్లాకు చెందిన ఫేమస్ నాన్ వెజ్ వంటకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఔట్లెట్లను తెరిచారు. రుచి, క్వాలిటీ బాగుండటంతో వీటికి జనం నుంచి మంచి స్పందన వస్తోంది.
తొలి నుంచి రాజకీయాలపై ఆసక్తితో ఉండే కిరాక్ ఆర్పీ.. 2024 ఏపీ ఎన్నికల ముందు నుంచి టీడీపీ , జనసేన, బీజేపీకి కూటమికి మద్ధతు పలికారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ సమయంలో వైసీపీ నేతలు చేసే విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు ఆర్పీ. ఫలితాలు విడుదలైన నాటి నుంచి వైసీపీ నాయకులు ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వస్తున్న కిరాక్ ఆర్పీ రోజుకొక ప్రెస్మీట్ పెట్టి ఏకీపారేస్తున్నాడు. ముఖ్యంగా మాజీ మంత్రి రోజాను టార్గెట్ చేస్తూ ఆర్పీ చేసే ఫన్నీ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రోజా రూ.3000 కోట్లు దోచుకుందని.. ఆమె అవినీతిని బయటపెడతానని ఆర్పీ హెచ్చరించారు.

ఇప్పుడంటే ఈ రేంజ్లో ఉన్నాడు కానీ.. గతంలో అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డాడు, పస్తులున్న రోజులు కూడా ఉన్నాయని కిరాక్ ఆర్పీ పలు సందర్భాల్లో వెల్లడించారు. అలాంటిది మల్లెమాల సంస్థ పిలిచి అవకాశం ఇవ్వడమే గాక, ఆర్పీ జీవితంలో ఎదిగేందుకు తోడ్పాటును అందించింది. జబర్దస్త్ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆర్పీ .. కొన్ని ఛానెల్స్లో కామెడీ ప్రోగ్రామ్స్ చేసినా అవి అంతగా వర్కవుట్ కాలేదు. అప్పట్లో ఓ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జబర్దస్త్, మల్లెమాల సంస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్పీ.
జబర్దస్త్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నా అక్కడ వసతులు సరిగా ఉండవని.. సరైన భోజనం , గౌరవం కూడా ఉండదని ఆర్పీ ఆరోపించారు. టీమ్ లీడర్స్, సభ్యులు ఎంతోమంది వచ్చేసినా మల్లెమాల వాళ్లు మారడం లేదని.. నానక్రామ్ గూడ నుంచి తుక్కుగూడ వచ్చినా అక్కడా వరస్ట్ ఫుడ్డే పెట్టారని ఆర్పీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ఏ సంస్థ ద్వారా ఆర్ధికంగా స్థిరపడ్డాడో, ఏ షో ద్వారా పేరు సంపాదించుకున్నాడో.. ఆ సంస్థపై ఆర్పీ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు అప్పట్లోనే ఖండించారు.
అయితే ఆర్పీ వ్యాఖ్యలపై సీనియర్ నటుడు , మాజీ మంత్రి బాబూ మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జబర్దస్త్లోకి రాకముందు నువ్వెంత..? నీ బతుకెంత..? పొట్టపోసుకోవడానికి ఇక్కడికి వచ్చావు.. నిన్ను నలుగురు గుర్తుపెట్టే స్థాయికి వచ్చాక నీ కళ్లు నెత్తికెక్కాయని బాబూమోహన్ ఫైర్ అయ్యారు. మల్లెమాల అంటే ఎంఎస్ రెడ్డి.. చిత్రసీమకే ఒక తండ్రి లాంటి వారు జబర్దస్త్ను నడిపేది ఆయన కొడుకు శ్యాంప్రసాద్ రెడ్డి.
అలాంటి సంస్థ నీకు అన్నం పెడితే.. దానిపై ఆరోపణలు చేయడానికి నీకు సిగ్గు లేదా, అన్నం పెట్టిన చేయినే కొరుకుతావా , నీకు అన్నం దొరక్కుండా పోతుంది అంటూ ఆయన ఫైర్ అయ్యారు. మల్లెమాల సంస్థ బాగుండాలని కోరుకోవాలే తప్పించి , తప్పుడు మాటలు మాట్లాడకూడదని బాబూ మోహన్ హెచ్చరించారు. తనకు జీవితాన్నిచ్చి.. ఇంత పెద్ద స్టార్ను చేసింది కూడా మల్లెమాల సంస్థేనని ఆయన తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాబూ మోహన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











