‘చిరంజీవి వల్ల నా కొడుకు కెరీర్ను తొక్కేశారు.. సినిమాను నష్టానికి అమ్ముకొని..’
ఏ రంగంలోనై బంధుప్రీతి, వారసత్వం కామన్ దీనికే నెపోటిజం అని అందంగా పేరు పెట్టి విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ బలవన్మరణం తర్వాత ఈ పదం బాగా ట్రెండ్ అయ్యింది. తన పిల్లలు, బంధువులు, మిత్రుల కోసం మరొకరికి నష్టం కలిగించడాన్నే నెపోటిజం అంటారు. దీని కారణంగా ప్రతిభావంతులైన ఎంతోమంది తమ జీవితాలను , అందమైన భవిష్యత్ను కోల్పోయారు.. నేటికీ కోల్పోతున్నారు. ఏ రంగంలోనైనా పోటీ సహజం.. కానీ అది ఆరోగ్యకరంగానే ఉంటేనే అందరికీ మంచిది, అలా కాకుండా హద్దులు దాటి వైరుధ్యాలకు దారి తీయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఆయా వ్యక్తుల ప్రమేయం లేనప్పటికీ పక్కనుండే మనుషుల వల్ల కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎందరో సినీనటులు బంధుప్రీతి, నెపోటిజం వల్ల నష్టపోయామని పలు వేదికలపై, ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.
సీనియర్ నటుడు గిరిబాబు సైతం ఓ ఇంటర్వ్యూలో తాను కూడా ఇలాంటి బాధితుడినని చెప్పుకొచ్చారు. తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని చూసిన నటులు ఒక్కొక్కరే ప్రేక్షకుల్ని విడిచి తిరిగి రాని లోకాలకు తరలిపోగా.. ఆ తరానికి ప్రతినిధిగా మిగిలిన కొందరిలో గిరిబాబు ఒకరు. మారుమూల పల్లెటూరులో జన్మించి.. సినిమాపై పిచ్చితో మద్రాస్ రైలెక్కి , అక్కడ ఎన్నో కష్టాలు పడి నటుడిగా ఎదిగారు. హీరోగా, విలన్గా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, స్క్రీన్ ప్లే రైటర్గా, నిర్మాతగా, దర్శకుడిగా అన్ని రంగాల్లోనూ సత్తా చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి గిరిబాబు. దాదాపు 6 వందలకు పైగా సినిమాల్లో నటించిన ఆయన దేవతలారా దీవించండితో దర్శకుడిగా మారారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో సింహగర్జన, మెరుపు దాడి, రణరంగం, ఇంద్రజిత్ , నీ సుఖమే కోరుతున్నా వంటి చిత్రాలతో డైరెక్టర్గా తనదైన ముద్ర వేశారు.

తన వారసులుగా రఘుబాబు, బోసుబాబులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు గిరిబాబు. నిజానికి బోసును హీరోను చేయాలన్నది ఆయన కల. అప్పటికే దర్శకుడిగా గుర్తింపు పొందిన గిరిబాబు.. తన కొడుకుని హీరోగా లాంచ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తన స్వీయ దర్శక నిర్మాణంలో 'ఇంద్రజిత్'ను తెరకెక్కించారు. సరిగ్గా అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'కొదమ సింహం' సినిమా తెరకెక్కుతోంది. ఆశ్చర్యకరంగా రెండు సినిమాలూ కౌబాయ్ జోనర్స్ కావడంతో ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.
యాక్షన్ చిత్రాలు తీయడంలో గిరిబాబుకు గుర్తింపు ఉండటంతో ఇంద్రజిత్పై హైప్ ఉంది. సినిమాకు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసిన సమయంలో కొదమసింహం సినిమాకు సంబంధించిన కొందరు జనాలు రఘుబాబుకి మాయ మాటలు చెప్పి హైదరాబాద్లోని ఓ ప్రివ్యూ థియేటర్లో సినిమాను చూశారు. ఔట్పుట్ చూసిన తర్వాత కొదమసింహం వాళ్లు మద్రాస్ చేరుకుని షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేసి సరిగ్గా ఇంద్రజిత్ రిలీజ్ అయ్యే తేదీనే.. తాము సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని పేపర్లో చూసిన గిరిబాబు షాక్కు గురయ్యారు.

ఇంద్రజిత్ను కొనడానికి వచ్చిన బయ్యర్లు కూడా కొదమసింహ రిలీజ్ విషయాన్ని తెలుసుకుని.. అంత పెద్ద స్టార్ నటిస్తున్న సినిమాను తట్టుకుని నిలబడగలరా అని అడిగారని గిరిబాబు గుర్తుచేసుకున్నారు. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి తీసిన ఇంద్రజిత్ను తాను చెప్పిన రేటు కంటే తక్కువకు అడిగారని తెలిపారు. అయితే కొదమసింహం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదని, దీంతో ఇంద్రజిత్కు బిజినెస్ సరిగా జరగలేదని గిరిబాబు తెలిపారు.
మెగాస్టార్ సినిమాయే నష్టపోతే.. మీ సినిమాను ఎవరు కొంటారని ప్రశ్నించడంతో బడ్జెట్ కంటే తక్కువ ధరకే మూవీని అమ్మేసినట్లు ఆయన చెప్పారు. రెండు నెలల తర్వాత సినిమా చేస్తే ఇంద్రజిత్కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, అయినప్పటికీ దానిని ఫ్లాప్.. ఫ్లాప్ అని ప్రచారం చేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
కానీ తన సినిమా బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొచ్చిందని గిరిబాబు చెప్పారు. చిన్నవాళ్లను పెద్దవాళ్లు తొక్కడం ఎక్కడైనా ఉంటుందని, తనకంటే బాగా నష్టపోయిన ఎంతోమంది ఇండస్ట్రీలో ఉన్నారని గిరిబాబు వెల్లడించారు. జీవితాలతో ఆడుకోవడమేనని .. తనకు అన్నలు, తమ్ముళ్లు, బావలు, బావమరుదులు ఆ సమయంలో లేరంటూ పరోక్షంగా కొందరిపై ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరెవరి హస్తం ఉందన్నది మాత్రం గిరిబాబు బయటపెట్టకపోవడం కొసమెరుపు.


Click it and Unblock the Notifications











