18 కేసుల్లో ఏ1 .. ఇన్నాళ్లు వైఎస్ జగన్ బెయిల్పై ఎలా ఉన్నాడంటే? మురళీ మోహన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించగా.. వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 11 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలకే పరిమితమైంది. అపూర్వ విజయంతో కూటమి శ్రేణులు, ముఖ్యంగా తెలుగుదేశం కేడర్ సంబరాలు జరుపుకుంటోంది. గడిచిన ఐదేళ్లలో తమ నేతలకు , తమ అధినేతకు జరిగిన అవమానాలు, కోర్టు కేసులు, వేధింపులతో రగిలిపోయిన తెలుగు తమ్ముళ్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడిపోవడంతో ఆంధ్రప్రదేశ్లో కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్లపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సైతం ఫలితాలు విడుదలయ్యాక ఆయన అదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజాతీర్పు ఎలా ఉందో చూశారని, ఆరా మస్తాన్ సర్వే ఏమైందో చూశారని .. అది కేవలం బెట్టింగుల కోసం జగన్ అండ్ కో చేసిన ఫేక్ సర్వే అని బుద్ధా వెంకన్న ఆరోపించారు.

చంద్రబాబు కుటుంబంపై తప్పుడు విమర్శలు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని.. జగన్ రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిందేనని, ఆయన జీవితం ఇక జైలుకేనని హెచ్చరించారు. మూడు జన్మలెత్తినా తరగని శిక్షలు జగన్కి పడతాయని, సజ్జల కూడా జైలుకు వెళ్తాడని బుద్ధా వెంకన్న అన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక చాలా అర్ధాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
జగన్ విషయంలో టీడీపీ శ్రేణులు మొదటి నుంచి ఓ ప్రశ్న వేస్తుంటాయి. 18 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న వ్యక్తిని దాదాపు 12 ఏళ్లుగా బెయిల్పై ఎందుకు తిరగనిస్తున్నారని ఎన్నో సార్లు ప్రశ్నించారు. కొందరైతే జగన్ బెయిల్ రద్దు చేయాల్సిందిగా కోర్టుల్లో కేసులు సైతం వేశారు. కానీ వాటిపై విచారణ ఎంత వరకు వచ్చిందో తెలియదు. అప్పట్లో రఘురామకృష్ణంరాజు సైతం జగన్ బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఆ సమయంలో కొంత కదలిక వచ్చినట్లే కనిపించింది. కానీ ఎన్నికల సీజన్ మొదలయ్యాక విషయం మరుగున పడింది. ఇప్పుడు ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఘన విజయం నేపథ్యంలో జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ పరిగెడుతుందని అంటున్నారు.
ఈ క్రమంలో టీడీపీ నేత, మాజీ ఎంపీ, దిగ్గజ నటుడు మురళీ మోహన్ కూడా జగన్ అక్రమాస్తుల కేసు, బెయిల్ వంటి అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్తో ఆయన మాట్లాడుతూ.. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని, బెయిల్పై బయటకు వచ్చారని గుర్తుచేశారు. సాధారణంగా ఒక్క కేసు ఉంటేనే ఒక నెల లేదంటే ఒక ఏడాది బెయిల్ ఇస్తారని , మరి జగన్పై 18 కేసులు ఉన్నాయని , వీటిలో ఏ1 ఆయనేనని మురళీమోహన్ పేర్కొన్నారు.
అలాంటిది జగన్ బెయిల్పై బయటికొచ్చి పన్నెండేళ్లు అయ్యిందని, ఇన్ని రోజులు బెయిల్ ఎవరిస్తారని ఆయన ప్రశ్నించారు. జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేసి బెయిల్ రద్దు కాకుండా చూసుకున్నారని మురళీ మోహన్ ఆరోపించారు. మాట్లాడితే ఢిల్లీకి వెళ్లేవారని.. ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకొస్తారని అంతా అనుకునేవారని ఆయన తెచ్చిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కేవలం తన కేసుల విచారణను ఆపుకునేందుకే జగన్ ఢిల్లీ వెళ్లారని మురళీ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


Click it and Unblock the Notifications











