ఆ హీరోయిన్ని మోసం చేసిన టాలీవుడ్ డైరెక్టర్.. ఇంటి మీదకెళ్లిన ఫ్యాన్స్, రాజీ కింద!
రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టడం అంత తేలికకాదు.. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సినిమా తీసినా ప్రేక్షకులు దానిని ఆదరిస్తారన్న గ్యారెంటీ లేదు. సినిమా కోసం కొందరు కొన్ని త్యాగాలు చేయాలి, అవమానాలు భరించాలి.. ఈ క్రమంలో కొందరికి అన్యాయం జరగొచ్చు. ఈ నేపథ్యంలో ఓ దర్శకుడి చేతిలో తనకు జరిగిన అవమానాన్ని , అన్యాయాన్ని బయటపెట్టారు సీనియర్ హీరోయిన్ మణిచందన. ఆ వివరాల్లోకి వెళితే..
ఒకప్పుడు వెండితెరను ఏలిన సీనియర్ హీరోయిన్లు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో అమ్మ, అక్క, వదిన క్యారెక్టర్లు వేస్తున్నారు. వారి బాటలోనే మరో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు ఒకప్పటి హీరోయిన్ మణిచందన. ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ, భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలో విలన్గా చేసిన జగపతి బాబుకు భార్యగా మణిచందన నటించారు. గతంలో రవితేజతో రొమాన్స్ చేసిన మణిచందన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయారు.

2000వ సంవత్సరంలో ప్రమోద్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మనసిచ్చాను మూవీలో రవితేజ - మణిచందన హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులో వీరిద్దరి మధ్య ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నగర్ వంటి చిన్నాచితకా సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. తమిళ్, కన్నడలలో మాత్రం మణిచందన బాగా క్లిక్ అయ్యారు. తమిళ తంబీలైతే ఈమెను జూనియర్ ఖుష్భూ అంటూ ఆరాధించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న మణిచందన.. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.
ప్రజెంట్ సీనియర్ హీరోయిన్ల సెకండ్ ఇన్నింగ్స్లు ప్రారంభమవుతుండటంతో తను కూడా ఓ ట్రైయిల్ వేసి మిస్టర్ బచ్చన్లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులు రావడంతో ఆ వెంటనే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ మూవీలో ఛాన్స్ వచ్చింది. రీసెంట్గా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవరలో హీరోయిన్ జాన్వీ కపూర్కు తల్లిగా మణిచందన నటించారు. ఈ పాత్ర కూడా గుర్తింపు తీసుకురావడంతో ఆమెకు ఆఫర్లు క్యూకడుతున్నాయి.

ప్రస్తుతం ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిజం సినిమా సమయంలో చోటు చేసుకున్న ఘటనలను మణిచందన బయటపెట్టారు. మహేశ్ బాబు హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో చాకలి మహిళగా మణిచందన నటించారు.
ఇందులో ఆమె నటించిన ఆరేడు సీన్లు, ఓ పాటను కట్ చేయడంతో ఈ విషయం తెలుసుకున్న మణిచందన చాలా బాధపడ్డారట. ఓ ఇంటర్వ్యూలో ఈ సంగతులు పంచుకోవడంతో ఆమె ఫ్యాన్స్ నిజం సినిమా డైరెక్టర్ తేజ ఇంటి మీదకెళ్లి గొడవ చేశారట. ఆయన వారితో రాజీ చేసుకుని కొన్ని సీన్లు, పాట పెట్టడానికి అంగీకరించడంతో గొడవ సద్దుమణిగినట్లు మణిచందన స్వయంగా తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











