షకీలా రాసిన సినిమాకు సెన్సార్ క్లీన్ యు సర్టిఫికెట్.. జగన్ అన్నపై కత్తెర!
యాక్టర్ షకీలా అంటే శృంగార భరితమైన సినిమాలే గుర్తొస్తాయి. 90వ దశకంలో ఆమె నటించిన చిత్రాలు యువతను ఉర్రూతలూగించాయి. ఆమె చిత్రాలంటే అశ్లీలత, అసభ్యకరమైన సన్నివేశాలనే అభిప్రాయం ప్రతీ ఒక్కరిలో ఉంది. అయితే అలాంటి ఒకప్పటి శృంగార తార తాజాగా కుటుంబ కథా చిత్రంలో నటించి సెన్సార్ అధికారులను మెప్పించింది. తాను అన్ని రకాల సినిమాలు చేయగలనని ప్రేక్షకులకు చెప్పాలనే ప్రయత్నం చేసింది. 'షకీల రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం' అనే టైటిల్తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.
షకీల రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రంలో విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా నటిస్తున్నారు. సిహెచ్ వెంకట్రెడ్డి నిర్మాత. కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సాయిరాం దాసరి, నవ్యమైన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ మూవీ ఇప్పటికే చిత్రీకరణ. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని సెన్సార్లో ఉంది. ఈ సినిమా తాజాగా సెన్సార్ బోర్డు ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ అధికారులు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడం విశేషంగా మారింది. అయితే షకీలా సినీ జీవితంలో గానీ, నిర్మాత సాయి రామ్ దాసరి కెరీర్లో గానీ ఇదే తొలి క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా కావడం గమనార్హం.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో కేవలం "జగన్ అన్న" అనే ఒక పదానికి మ్యూట్ వేయాలని సెన్సార్ అధికారులు కోరారు. అది తప్పితే కట్స్, మ్యూట్స్ లేవు అని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది, తన ప్రతి సినిమా విడుదలకు ముందు ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కే సాయి రామ్ దాసరి.. క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా తియ్యడంతో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఈ సినిమాకు సి.హెచ్. వెంకట్ రెడ్డి నిర్మిత. లండన్ గణేష్ సహా నిర్మాత. మధు పొన్నస్ సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.
షకీల రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం సినిమా నిడివి రెండు గంటల రెండు నిమిషాలు ఉంటుంది. 9 పాటలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇది పక్కా కుటుంబ కథా చిత్రం. దీనిని నేరుగా ఓటిటిలో విడుదల చెయ్యాలా లేక సినిమా హాల్లో విడుదల చెయ్యాలా అనే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సాయి రామ్ దాసరి తెలిపారు. త్వరలో పూర్తి వివరాలు తెలుపుతాము అని చెప్పారు


Click it and Unblock the Notifications











