ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు.. ప్రభాస్పై శర్వా ఓపెన్ కామెంట్స్
యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ 'బైకర్'. యువీ క్రియేషన్స్ నిర్మాణంలో అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించగా, డా. రాజశేఖర్ కీలక పాత్రలో నటించారు. మోటో క్రాస్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం బైకర్ బంపర్ బ్లాక్ బస్టర్ మీట్ పేరిట ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్పై శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక 'బైకర్' విజయంలో నిర్మాత వంశీ కృష్ణ రెడ్డి పాత్ర కీలకమని శర్వానంద్ పేర్కొన్నారు. 'ఈ కథను మొదట నాకి పంపింది వంశీ అన్నే. ఈ సినిమా మొదటి హీరో ఆయనే. యూవీ క్రియేషన్స్తో నాకు ఇది నాలుగో హిట్. 'రన్ రాజా రన్', 'ఎక్స్ప్రెస్ రాజా', 'మహానుభావుడు' తర్వాత ఇప్పుడు 'బైకర్'తో మరో బ్లాక్బస్టర్ అందుకున్నాం' అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. సినిమా కోసం తాను చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి కూడా శర్వానంద్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'ఈ క్యారెక్టర్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. దాదాపు 22 కిలోల బరువు తగ్గాను. ఈ సినిమా నా జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఇండియా గర్వించే సినిమా తీస్తామని చెప్పాం... తీసాం' అని చెప్పి తన కట్టుబాటును వివరించాడు.

డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గురించి మాట్లాడుతూ, 'ఆయన చెప్పిన కథే నన్ను పూర్తిగా మార్చింది. ఇలాంటి కాన్సెప్ట్ను తీసుకుని అద్భుతంగా తెరకెక్కించారు" అని ప్రశంసించాడు. అలాగే యాక్షన్ మాస్టర్ దిలీప్, డీఓపీ యువరాజ్, సంగీత దర్శకుడు జిబ్రాన్ వంటి టెక్నీషియన్స్ పనితీరును కూడా అభినందించాడు. ముఖ్యంగా రేసింగ్ సీక్వెన్స్లు సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయని తెలిపారు. ఇక హీరోయిన్ మాళవిక నాయర్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుందని, షూటింగ్ సమయంలో పెద్దగా మాట్లాడుకోకపోయినా ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యామని చెప్పాడు.
ఇక డా. రాజశేఖర్ గురించి మాట్లాడుతూ, 'ఆయనంత సింపుల్, ప్యూర్ హార్ట్ ఉన్న వ్యక్తిని చూడలేదు. ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం. స్క్రీన్ మీద నిజంగా తండ్రి-కొడుకుల్లా కనిపించాం' అని భావోద్వేగంగా పేర్కొన్నారు. 'బైకర్' కథలో ఉన్న ఎమోషనల్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతూ, 'ఇది కేవలం రేసింగ్ సినిమా మాత్రమే కాదు. తండ్రి-కొడుకుల మధ్య అనుబంధం, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. అందుకే ఇది ప్యూర్ ఫ్యామిలీ ఫిల్మ్. ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా' అని ప్రేక్షకులను థియేటర్లకు ఆహ్వానించాడు.
ఈ సందర్భంగా శర్వానంద్ ముందుగా స్టార్ హీరో ప్రభాస్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం హైలైట్గా నిలిచింది. 'మా ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ ట్వీట్ వేసింది ప్రభాస్ అన్నే. సినిమా రిలీజ్కు ముందు చిన్న యాడ్ చేసి మాకు పెద్ద సపోర్ట్ ఇచ్చారు. ఆయన నాకోసం ఎప్పుడూ ఉంటారు. లవ్ యూ అన్నా... నా హార్ట్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది" అంటూ ఎంతో ఎమోషనల్గా మాట్లాడాడు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. నాకు ఎక్స్ ప్రెస్ చేయడం రాదు. మేమేంటో మాకు తెలుసు. థ్యాంక్యూ ప్రభాస్ అన్నా' అని అన్నారు. ఇక తన తదుపరి ప్రాజెక్ట్ గురించి కూడా హింట్ ఇచ్చిన శర్వానంద్, సంపత్ నందితో 'భోగి' సినిమా చేస్తున్నానని, దానికోసం ఇంకా ఎక్కువ కష్టపడతానని వెల్లడించాడు.


Click it and Unblock the Notifications


















