రియా చక్రవర్తికి మరో షాక్.. కూపర్ హాస్పిటల్, ముంబై పోలీసులకు షోకాజ్ నోటీసులు
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత చోటుచేసుకొన్న సంఘటనలపై మహరాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సుశాత్ మరణం తర్వాత కూపర్ హాస్పిటల్ మార్చురీ వద్ద రియా చక్రవర్తి కనిపించిన వీడియోలు మా దృష్టికి వచ్చాయి. ఈ విషయంలో కూపర్ హాస్పిటల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది అంటూ మానవ హక్కుల సంఘం సీరియస్ అయింది. ఈ మేరకు కూపర్ హాస్పిటల్ యాజమాన్యానికి, ముంబై పోలీసులకు హక్కు కమిషన్ ఆగస్టు 25వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
సుశాంత్ మృతదేహానికి పోస్టు మార్టమ్ చేస్తున్న సమయంలో రియా చక్రవర్తిని ఎలా అనుమతించారు అని షోకాజ్ నోటీసులో హక్కుల కమిషన్ చీఫ్ ఎంఏ సయీద్ ప్రశ్నించారు. మార్చురీలోకి వారిని ఎలాంటి పరిస్థితుల్లో అంగీకరించారనే విషయంపై మా వద్ద సమాచారం లేదు. అలా ఎవరినీ అనుమతించకూడదు. ఏదైనా లోపాలు కనిపిస్తే హాస్పిటల్ యాజమాన్యంపై లీగల్ యాక్షన్ తీసుకొంటాం అని పేర్కొన్నారు.

ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు మాత్రమే మార్చురీలోకి వెళ్లే అనుమతి ఉంటుంది. సుశాంత్కు రియా చక్రవర్తి ఎలా కుటుంబ సభ్యురాలు అవుతుంది అని సయీద్ అభిప్రాయపడ్డారు. రియా చక్రవర్తి కుటుంబ సభ్యులు మార్చురీ నుంచి బయటకు వచ్చే వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలోను, పలు టీవీ ఛానెళ్లలో వైరల్ అయ్యాయి. దీంతో మానవ హక్కుల కమిషన్ స్పందించింది.
సుశాంత్ మరణానికి రియా చక్రవర్తి పరోక్షంగా కారణమంటూ తండ్రి కేకే సింగ్ పాట్నాలో కేసు నమోదు చేసిన తర్వాత అనేక విషయాలు సంచలనంగా మారాయి. ఈ కేసును ఈడీ, సీబీఐ లాంటి సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో పలు విషయాలు, వీడియోలు సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్నాయి.


Click it and Unblock the Notifications











