జాక్ మూవీ డిజాస్టర్.. అప్పులో మునిగిన సిద్దూ జొన్నలగడ్డ!
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సిద్దూ జొన్నగడ్డ తెలుగు ప్రేక్షకుల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కినేని యంగ్ హీరో యువ సామ్రాట్ నాగచైతన్య డెబ్యూ ఫిల్మ్ జోష్ సినిమా నుంచే సిద్దూ జొన్నగడ్డ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. పలు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఇక రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ డీజే టిల్లుతో సిద్దూ జొన్నగడ్డ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు.
ఆ తర్వాత నుంచి సిద్దూ జొన్నగడ్డ సినిమాలకు మంచి డిమాండ్ పెరిగింది. ఇక డీజే టిల్లు బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో వెంటనే సినిమాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ సీక్వెల్ పెద్దగా అలరించలేకపోయింది. ఆ తర్వాత జాక్ అనే స్పై యాక్షన్ ఫిల్మ్ తో థియేటర్లలోకి వచ్చారు. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.

జాక్ సినిమా డిజాస్టర్ కావడంతో నిర్మాతకు, హీరోగా నటించిన సిద్దూ జొన్నగడ్డకు కాస్తా అభిప్రాయ బేధాలు వచ్చాయని ఇండస్ట్రీలో గుసగుసలు కూడా వినిపించాయి. మరోవైపు మీడియా ముందే సదరు నిర్మాత హీరోకు ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా తిరిగి రాలేదని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా సిద్దూ జొన్నగడ్డ రెమ్యునరేషన్ అంశంపై స్పందించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో సిద్దూ జొన్నగడ్డ పారితోషికం విషయంలో తను కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ... నా గత చిత్రం జాక్ డిజాస్టర్ గా మిగిలింది. ఎందుకో ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. దాంతో ఆ మూవీకి జరిగిన నష్టం ఎవరికీ భారం కాకూడదని అనుకున్నాను. అందుకే నా రెమ్యునరేషన్ ను తిరిగి ఇచ్చేశాను. బ్యాంక్ లో లోన్ తీసుకొని మరీ రూ.4.75 కోట్ల పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశాను. ఇక నాకున్న ఆందోళన ఒక్కటే. చేసిన అప్పును తీర్చాలన్నదే నా మైండ్ లో ఉంది. ఎంత వీలైతే అంత త్వరగా అప్పు క్లియర్ చేయాలని చూస్తున్నాను.. అని సిద్దూ జొన్నగడ్డ చెప్పుకొచ్చారు.
ఇక జాక్ చిత్రానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర నిర్మాణానికి రూ.40 కోట్ల బడ్జెట్ వరకు ఖర్చు చేసినట్టు ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఇక బాక్సాఫీస్ నుంచి కేవలం రూ.9 కోట్ల గ్రాస్ మాత్రమే వసూల్ చేసిందీ చిత్రం. మూవీలో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఇక నెక్ట్స్ సిద్దూ జొన్నగడ్డ తెలుసు కదా, టిల్లు క్యూబ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


Click it and Unblock the Notifications











