మా అమ్మది సూసైడ్ అటెంప్ట్ కాదు.. సింగర్ కల్పన కూతురు సంచలన వ్యాఖ్యలు
సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం సంఘటన దక్షిణాది సినీ పరిశ్రమలో సంచలన రేపింది. తమిళ, తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో తన గానంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకొన్న ఆమెకు ఇలాంటి పరిస్థితి రావడంపై అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు, సినీ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. అయితే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంపై అనేక రూమర్లు మీడియాలో వచ్చాయి. ఈ క్రమంలో ఆమె కూతురు దయ ప్రసాద్ మీడియాకు క్లారిటీ ఇచ్చారు.ఈ చెప్పిన విషయాల్లోకి వెళితే..
సింగర్ కల్పనకు ఫ్యామిలీ సంబంధిత, కూతురుతో కొన్ని విభేదాల కారణంగా తీవ్ర మనస్తాపం చెందారు. తన కూతురు తన మాట వినడం లేదనే బాధతో ఆమె నిద్ర మాత్రలు మింగారు అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తన కూతురు కేరళలో చదువుకొంటున్నారు. ఆమెను హైదరాబాద్కు వచ్చి ఇక్కడే చదువుకోవాలని కల్పన సూచించారు. కానీ కూతురు అందుకు నిరాకరించడంతో ఆమె ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు తీసుకోవడం జరిగిందనే వార్త ప్రచారంలోకి వచ్చింది.

అయితే మంగళవారం సాయంత్రం పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి కల్పన ఇంటిలోకి వెళ్లారు. ఆ సమయంలో ఆమె అపస్మారక స్థితిలో కనిపించారు. దాంతో ఆమెను సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఆమెకు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. ఆ తర్వాత చెన్నై నుంచి వచ్చిన భర్త ప్రసాద్ను పోలీసులు విచారించి అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం ఆయనను కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్కు తరలించారు.
తన తల్లి కల్పన ఆరోగ్య పరిస్థిత విషమంగా ఉందని తెలుసుకొన్న కూతురు వెంటనే హైదరాబాద్కు వచ్చింది. తన తల్లి ఆరోగ్యం గురించి యోగ క్షేమాలు తెలుసుకొన్నది. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన తల్లి పరిస్థితి గురించి వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. మా కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నా పేరు దయా ప్రసాద్ ప్రభాకర్. సింగర్ కల్పన, ప్రసాద్ కూతుర్ని. మా అమ్మకు ఎలాంటి సమస్యలు లేవు. మా అమ్మ సింగర్ మాత్రమే కాకుండా ఎల్ఎల్బీ, పీహెచ్డీ కూడా చేస్తున్నారు. దాని వల్ల ఇన్సోమియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. అందుకు వైద్యులు నిద్ర మాత్రలు వేసుకోవాలని సూచించారు. ఆమె ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లారే కానీ.. ఆమెది సూసైడ్ అటెంప్ట్ కాదు అని దయా ప్రసాద్ ప్రభాకర్ తెలిపారు.
మా అమ్మ సూసైడ్కు ప్రయత్నించారని వార్తలు రాయొద్దు. అసత్యాలను ప్రచారం చేయవద్దు. కేవలం మానసిక ఒత్తిడితోనే ఈ సమస్య తలెత్తింది. మా ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవు. మా అమ్మ, నాన్న మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను చాలా హ్యపీగా ఉన్నాను. మా మధ్య రిలేషన్స్ గురించి మానిపులేట్ చేయవద్దు. త్వరలోనే మా అమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వస్తారు. ఈ విషయాన్ని రాద్దాంతం చేయవద్దు అని దయా ప్రసాద్ వేడుకొన్నారు..


Click it and Unblock the Notifications











