సింగర్ కల్పన కేసులో ట్విస్ట్.. వేధిస్తున్నారంటూ మహిళా కమీషన్కు ఫిర్యాదు
సినీ నేపథ్య గాయనీ కల్పన అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అచేతన స్థితిలో ఉన్న ఆమెను స్థానికుల సాయంతో పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. రెండ్రోజుల పాటు వెంటిలేటర్పై చికిత్స అందించి కల్పనను వైద్యులు కాపాడారు. అయితే అందరు అనుకుంటున్నట్లుగా తాను ఆత్మహత్యాయత్నం చేసుకోలేదని ఈ స్టార్ సింగర్ క్లారిటీ ఇచ్చారు.
సింగర్ కల్పన ఆసుపత్రి పాలైందని తెలియగానే తోటీ గాయనీ గాయకులు , నటీనటులు హుటాహుటిన ఆసుపత్రి తరలివచ్చారు. ఇదే సమయంలో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి. కల్పన - ఆమె భర్తకు మధ్య గొడవలు జరిగాయని ఈ కారణంతోనే చనిపోవాలని అనుకుని నిద్రమాత్రలు మింగిందని మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై సింగర్ కల్పన కుటుంబ సభ్యులు, ఆమె కుమార్తె మండిపడ్డారు.

తన తల్లి అసలు ఆత్మహత్యాయత్నం చేయలేదని తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని మీడియాను ఆమె కోరారు. ఆమె నిద్రలేమీ సమస్యతో బాధపడుతున్నారని.. అనుకోకుండా మందుల మోతాదు ఎక్కువ కావడం వల్లే కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్లారని దయా క్లారిట ఇచ్చారు. పలు మీడియా సంస్థలు , సోషల్ మీడియాలోనూ తన తల్లిదండ్రుల గురించి తప్పుడు కథనాలు వస్తున్నాయని ఆమె మండిపడ్డారు. అమ్మానాన్నలు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారని ఫేక్ న్యూస్ని ఎవరూ నమ్మొద్దని దయా తెలిపారు.
ప్రాణాపాయ స్థితి నుంచి క్షేమంగా కోలుకున్న సింగర్ కల్పన తన ఆరోగ్య పరిస్ధితి, కుటుంబంపై వస్తున్న కథనాలపై స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు . తాను 45 ఏళ్ల వయసులో పీహెచ్డీ , ఎల్ఎల్బీ చేస్తున్నానని.. ఇందుకు తన భర్త ఎంతగానో సహకరిస్తున్నారని కల్పన తెలిపారు. తాను గత కొంతకాలంగా ఇన్సోమియా (నిద్రలేమి)తో బాధపడుతున్నానని.. తన సమస్యలకు వైద్యుడి ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడుతున్నట్లు ఈ సింగర్ వెల్లడించారు. అయితే మోతాదుకు మించి డోస్ తీసుకోవడం వల్లే స్పృహ తప్పానని కల్పన క్లారిటీ ఇచ్చారు. నా భర్త, నా కుటుంబం, కాలనీ వాసులు, పోలీసుల వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని ఆమె చెప్పారు.
సింగర్ కల్పన స్వయంగా క్లారిటీ ఇచ్చినా కొన్ని మీడియా సంస్థల్లో, సోషల్ మీడియాలో కొందరు ఆమె గురించి, ఆమె భర్త గురించి తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కల్పన శనివారం తెలంగాణ మహిళా కమీషన్ను ఆశ్రయించారు . కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తనపై అసత్య ప్రచారం చేస్తున్నాయని .. వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు పెట్టకుండా చూడాలని ఆమె కమీషన్కు ఫిర్యాదు చేశారు. కల్పన ఫిర్యాదుపై స్పందించిన తెలంగాణ మహిళా కమీషన్ ఛైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని ఆమె యూట్యూబ్ ఛానెల్స్, నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











