10 కోట్ల మోసం.. సింగర్ మంగ్లీపై కేసు.. ప్రాణహానీ ఉందంటూ ఫిర్యాదు..
తెలంగాణ ఫోక్ పాటలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రముఖ గాయని మంగ్లీ.. ఇప్పుడు ఒక వివాదాస్పద కేసుతో వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమెపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు కావడం సినీ, సంగీత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల సమాచారం ప్రకారం.. ఓ వ్యక్తి మంగ్లీ తనను సుమారు రూ.10 కోట్ల మేర మోసం చేసిందని ఫిర్యాదు చేశారు. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికి డబ్బులు తీసుకుని, తర్వాత ఎలాంటి లాభాలు ఇవ్వకపోవడంతో పాటు అసలు పెట్టుబడిని కూడా తిరిగి ఇవ్వలేదని బాధితుడు ఆరోపించాడు.
ఈ వ్యవహారంలో డబ్బులు అడిగినప్పుడు, మంగ్లీ , ఆమె సోదరుడు శివ తనను ఫోన్ ద్వారా బెదిరించారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, ప్రమాదానికి గురిచేస్తామని హెచ్చరించారని కూడా పోలీసులకు తెలిపారు. దీంతో కేసు తీవ్రత మరింత పెరిగింది.
బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బీఎన్ఎస్ (BNS) సెక్షన్ 351(2), 352 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో మంగ్లీని ఏ5గా చేర్చినట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు ఆమె సోదరుడు శివ మరియు మరో ముగ్గురు నిందితులుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

మంగ్లీ అసలు పేరు సత్యవతి చౌహాన్. 'తీన్మార్ వార్తలు' కార్యక్రమం ద్వారా తెలంగాణ యాసలో మాట్లాడి మంచి గుర్తింపు పొందింది. అనంతరం బతుకమ్మ, బోనాలు, భక్తి గీతాలు పాడుతూ ప్రజలకు మరింత దగ్గరైంది. సోషల్ మీడియాలో ఆమె పాటలు లక్షలాది వ్యూస్ సాధించి విశేష ఆదరణ పొందాయి. ఫోక్ సింగర్గా పేరు తెచ్చుకున్న మంగ్లీ, తర్వాత సినిమాల్లో కూడా తన గాత్రంతో ప్రత్యేక స్థానం సంపాదించింది. 'శైలజా రెడ్డి అల్లుడు'లో టైటిల్ సాంగ్, 'జార్జ్ రెడ్డి'లో "వాడు నడిపే బండి", 'అల వైకుంఠపురములో'లో "రాములో రాములా", 'లవ్ స్టోరీ'లో "సారంగదరియా", 'సీటీమార్'లో "జ్వాలారెడ్డి", 'ధమాకా'లో "జింతాక్" వంటి పాటలతో ప్రేక్షకులను అలరించింది.
ఈ కేసుపై ఇప్పటివరకు మంగ్లీ లేదా ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామం మంగ్లీ కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications

















