Mangli : పాట మారుద్దామనుకున్నా కానీ, వాళ్ళు కూడా నా జాతి గురించి మాట్లాడతారా, గుడికట్టించా.. !
యాంకర్ గానే కాకుండా సింగర్ గా ఎంతో క్రేజ్ సంపాదించిన మంగ్లీ ఇప్పుడు అనూహ్యంగా వివాదంలో చిక్కుకుంది. ఆమె పాడిన బోనాలు పాటలో కొన్ని పదాలు హిందూ దేవతలని అవమానించే విధంగా ఉన్నాయనే రచ్చ రేపడంతో ఆమె ఎట్టకేలకు ఈ విషయం మీద స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే

మోతువరి లెక్క
తెలంగాణలో బోనాల సీజన్ కావడంతో మంగ్లీ ఒక బోనాల పాట విడుదల చేసింది. ఈ పాట ఇప్పుడు యూబ్యూబ్ను ఒక ఊపు ఊపుతోంది. జులై 11న మంగ్లీ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్లో విడుదలైన ఈ పాటకు 40 లక్షలకు పైగా వ్యూస్ కూడా వచ్చాయి. అంతా బాగానే ఉన్నా ఈ పాట కోసం రాసిన లిరిక్స్ హిందూ సంస్థలకి కోపం తెప్పించింది. 'చెట్టు కింద కూసున్నవమ్మా.. సుట్టం లెక్క , మోతువరి లెక్క ఓ మైసమ్మా..' అంటూ సాగే ఈ పాట లిరిక్స్ సరిగ్గా లేవని పెద్ద ఉద్యయమే లేచింది.

బీజీపీ ఫిర్యాదు
తాజాగా హైదరాబాద్లో సింగర్ మంగ్లీపై బీజేపీ కార్పొరేటర్లు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు.బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని, సామాజిక మాధ్యమాల నుంచి ఈ పాటను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.ఈ అంశం మీద మంగ్లీ తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఈ పాటను ప్రఖ్యాత జానపద పాటల రచయిత 25 ఏళ్ళ క్రితమే రాశారని, పాలమూరు ప్రాంత కోలాటంలో ఈ పాట చాలా ప్రసిద్ది, 2008లో ఈ పాటను DRC ఆడియో సంస్థ సిడీ రూపంలో కూడా విడుదల చేసిందని పేర్కొన్నారు. ఆయన మీద అభిమానంతో స్వయాన ఆయన్ని కలిసి ఈ పాటను తీసుకోవడం జరిగిందన్న ఆమె ఈ పాట వీడియోలో రామస్వామిగారిని కూడా చిత్రీకరించామని అన్నారు.

నిందాస్తుతి
300 జానపదాలతోపాటు గ్రామదేవత మైసమ్మ మీద ఆయన వంద కోలాటం పాటలు రచించారు. ఆ పాటలన్ని నిందాస్తుతిలోనే ఉన్నాయని అన్నారు. ఈ పాటలో 'మోతెవరి' అనే పదం గురించి రచయిత రామస్వామిగారి అభిప్రాయం ప్రకారం మోతెవరి అంటే గ్రామంలో పెద్ద అనే అర్థంలో ఈ పాట సాగుతుంది. ప్రస్తుతం ఆ పదం వ్యతిరేక పదంగా వాడుకలోకి వచ్చిందన్నది వాదన. నిందాస్తుతిలో కోలాటం రూపంలో సాగే ఈ పాటను మాకు తెలిసిన కొంతమంది కళాకారులు,పెద్దల సలహాలు తీసుకుని చిత్రీకరించామని, గ్రామదేవతల ఒగ్గు కథలు, బైండ్లోల కొలుపులు ఇలా రకరకాల ఆచారాలు ఉన్నాయి.భక్తిలో కూడా మూఢ భక్తి,వైరి భక్తి అని రకరకాలుగా ఉన్నాయని, అందులో భాగంగానే ఈ పాటను రూపొందించామని ఆమె పేర్కొంది.

గుడికట్టించా
నేను పండితుల కుటుంబం నుంచి రాలేదన్న మంగ్లీ చెట్లు, పుట్టలను కొలిచే గిరిజన జాతికి చెందిన తండా నుంచి వచ్చిన ఆడబిడ్డనని పేర్కొంది. బతుకమ్మ, బోనాలు పండగల్లాగే మా బంజారాలో తీజ్, శీతలా (సాతి భవాని) పండగల్లో పకృతినే దేవతలుగా పూజిస్తామని, మాకు కష్టం కలిగినా సంతోషం వొచ్చినా మేము చెప్పుకునేది నమ్ముకున్న గ్రామదేవతలకే, వారిని మా ఇంట్లో సభ్యులుగా నమ్ముతాము. మేము తినేదే, తాగేదే ఆ దేవతలకు నైవేద్యంగా పెడతాము. నేను సింగర్ గా అంతో ఇంతో ఎదిగింది కూడా అమ్మవారి కృప, ఆంజనేయ స్వామి దీవెన, వల్లనే అని నమ్ముతాను. అందుకే నేను పుట్టిన తండాలో ఆంజనేయ స్వామి గుడికట్టించానని చెప్పుకొచ్చింది.

వాళ్ళు కూడా నా జాతి గురించి
మా తాతలనాటి ఆంజనేయస్వామి విగ్రహానికి గుడికట్టించి నేడు ధూప దీప, నైవేద్యాలతో పూజలు చేస్తున్నాని, నీకు గుడికట్టించే ధైర్యం, పేరు నాకు ఇవ్వాలి స్వామి అని మొక్కుకున్నా ఆ దేవుని దయవల్ల గత ఏడాది నవంబర్ 19న నా మొక్కును తీర్చుకున్నానని పేర్కొన్నారు. ఏనాడు గుడికి వెళ్ళని వాళ్ళు, బోనం ఎత్తని వాళ్ళు కూడా నా జాతి, ప్రాంతం, కులం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసమో గమనించాలని ఆమె పేర్కొంది. గత నాలుగేళ్లుగా ప్రతీ ఏటా లాల్ దర్వాజ అమ్మవారికి బోనం ఎత్తుతున్నా, ఆరు సంవత్సరాలుగా బతుకమ్మ, సమ్మక్క సారక్క, శివరాత్రి, సంక్రాంతి, బోనాలు అంటూ ప్రతి పండగకి నేను పాటలు చేస్తున్నానని చెప్పికొచ్చింది.
Recommended Video


నేపథ్యం తెలుసుకోకుండా
ఈ సారి శివరాత్రి పాట అత్యంత పవిత్ర స్థలం కాశీకి వెళ్ళి మరీ చిత్రీకరించా, ఒక్క రోజులో నేను ఫేమస్ కాలేదు. నా పాటల వెనక పదేళ్ళ కష్టం ఉంది. కానీ కొందరు తమ ఇంట్లో తల్లి, చెల్లి ఉందన్న విషయం మరిచి విచక్షణ కోల్పోయి కామెంట్లు చేస్తున్నారని,ఈ పాట నేపథ్యం తెలుసుకోకుండా నిందిస్తున్నారని అన్నారు. అసలు గ్రామదేవతలను ఎలా కొలుస్తారు, మైసమ్మ కొలుపు పాటలు, నిందాస్తుతి సాహిత్యం గురించి తెలుసుకొని విమర్శలు చేస్తే విజ్ఞతగా ఉండేదన్న ఆమె ఈ పోస్టు నా మనసుకు బాధకలిగించిన వారికోసము, నన్ను అభిమానించేవారి మనసుకు కష్టం కలిగించిన వారి కోసమని అన్నారు.

నా వాళ్ళే అనుకుని
ఈ పాటపై విమర్శలు వచ్చినరోజే పాటను మార్చే అవకాశం ఉన్నప్పటికీ, పాటకోసం ప్రాణంపెట్టిన 80 ఏళ్ల వృద్ద రచయితని తక్కువ చేయవద్దనే ఉద్దేశ్యంతో, ఆయన్ని గౌరవించి ఈ నిర్ణయం తీసుకోలేకపోయా కానీ దీన్ని మరింత వివాదం చేసి ఆయన్ని కూడా కించపరుస్తున్నారని, ఆ పెద్దాయన కుటుంబ సభ్యుల అనుమతితో లిరిక్స్ లో మార్పులు చేశామని అన్నారు. నన్ను వ్యతిరేకించినవారు, నిందించినవారు కూడా నా వాళ్ళే అనుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











