Vani Jayaramకు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు.. వాణీ జయరాం మృతిపై వీడని మిస్టరీ!
లెజండరీ దర్శకులు కే విశ్వనాథ్ మరణవార్త మరవకముందే దిగ్గజ గాయనీ వాణి జయరాం కన్నుమూశారనే విషయం భారతీయ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం అంటే ఫిబ్రవరి 4న చెన్నైలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమెది సహజమరణమా కాదా అనే అనుమానాలతో సందిగ్ధత ఇంకా వీడలేదు.
కానీ ఈ క్రమంలోనే ఆమె అంత్యక్రియలను ఆదివారం (ఫిబ్రవరి 5) నిర్వహించారు. వాణీ జయరాంను చివరిసారిగా చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ప్రముఖులు తరలి వచ్చారు. దిగ్గజ గాయనీకి కన్నీటి వీడ్కోలు పలికారు.

ఐదో సంతానంగా వాణీ జయరాం
ప్రముఖ గాయనీగా పేరు సంపాదించుకున్న వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. నవంబర్ 30న 1945లో తమిళనాడులోని వెళ్లూరులో వాణీ జన్మించారు. దురైస్వామి అయ్యాంగర్, పద్మావతి దంపతులకు మొత్తంగా ఆరుగురు కాగా అందులో ఐదో సంతానంగా వాణీ జయరాం జన్మించారు. వాణీ జయరాం తల్లి వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్ శిష్యురాలు.
దీంతో బాల్యంలోనే వాణీ జయరాం సంగీతంలో విశేషమైన ప్రతిభ కనబర్చింది. ఎనిమిదో ఏటనే ఆల్ ఇండియా రేడియో కార్యక్రమంలో పాల్గొంది. వాణి జయరాం కర్నాటక సంగీతం కడలూరు శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్, బాలసుబ్రమణియన్, ఆర్.యెస్ మణి ల వద్ద సంగీతం అభ్యసించగా, హిందుస్తాని సంగీతాన్ని ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నారు.

1973లో తెలుగులోకి..
వాణీ జయరాం వివాహానంతరం భర్తతో ముంబయిలో స్థిరపడ్డాక అనుకోని విధంగా హిందీ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ ని కలవడంతో సినిమాలో పాడే అవకాశం లభించింది. హృషీకేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ప్రముఖ హిందీ చలన చిత్రం "గుడ్డి" లోని "బోలె రే పపీ హరా" ద్వారా సినీనేపథ్య గాయకురాలిగా వాణీ జయరాం తెరంగేట్రం చేశారు.
అలా 1971లో సినీ సంగీత ప్రపంచంలోకి అడుగపెట్టిన వాణీ జయరాం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, మరాఠీ, ఒడియా, గుజరాతీ, హర్యానీ, తులు, బెంగాళీ, అస్సామీ ఇలా సుమారు 14 భాషల్లో దాదాపు 20 వేలకుపైగా పాటలు పాడారు. తెలుగులో మాత్రం 1973 సంవత్సరంలో ఎప్పటివలే కాదురా నా స్వామి అనే పాటతో ఎంట్రీ ఇచ్చారు.

గౌరవ నివాళులతో అంత్యక్రియలు..
గాయనీగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వాణీ జయరాం శనివారం చెన్నైలో ఆమె నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇక ఆదివారం రోజున ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. చెన్నైలోని ఆమె స్వగృహం నుంగంబాక్కం నివాసం నుంచి బీసెంట్ నగర్ శ్మశాన వాటిక వరకు వాణీ జయరాం అంతిమ యాత్ర సాగింది.
మిన్ మయన్ శ్మశాన వాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు. వాణీ జయరాం మరణానికి పోలీసులు గౌరవ నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆమె అంతిమ యాత్రకు అశేషమైన అభిమానగనం తరలి వచ్చింది.

మృతిపై వీడని అనుమానాలు..
వాణీ జయరాం భర్త జయరాం ఐదేళ్ల క్రితం 2018లో మరణించారు. వాణీ జయరాం దంపతులకు పిల్లలు ఎవరు లేరు. సంగీతమే తమకు పిల్లలు లేని లోటు తీర్చిందని ఆమె చెబుతూ ఉండేవారు. బంధువులే వారసులు కాగా ఆదివారం రోజున వాణీ జయరాం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే వాణీ జయరాం మృతిపై అనుమానాలు ఇంకా వీడలేదు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.
వాణీ పోస్ట్ మార్టమ్ రిపోర్టులోనూ ఆమె తలకు గాయమైన విషయం వెలుగులోకి రావడంతో మరింత బలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్ మార్టమ్ పూర్తి నివేదిక వస్తే గానీ గాయానికి గల కారణాలు చెప్పలేమని వైద్యులు, పోలీసులు తెలిపారు.


Click it and Unblock the Notifications











