ఆ నలుగురి జెండా, ఎజెండా ఏమిటి? ఆ దోపిడి సంగతి ఏంటి? థియేటర్ల మూసివేతపై ఏపీ సర్కార్ సీరియస్
తెలుగు సినిమా పరిశ్రమలో డిస్ట్రిబ్యూషన్ రంగంలో పర్సెంటేజీ విధానాన్ని అమలు చేయాలనే కొంత మంది నిర్మాతల రూపంలో డిస్టిబ్యూటర్లు డిమాండ్ చేయడం అత్యంత వివాదంగా మారింది. అద్దె ప్రాతిపాదికన కాకుండా మల్టీప్లెక్స్లో అమలు చేస్తున్నట్టుగా కలెక్షన్లలో కొంత పర్సెంటీజ్ను అద్దె లేదా కమిషన్గా చెల్లించాలనే డిమాండ్ టాలీవుడ్లో దుమారం లేపింది. అయితే తమ డిమాండ్ను బలంగా వినిపిస్తూ డిస్ట్రిబ్యూషన్ రంగంలో 'ఆ నలుగురు' ముద్ర వేసుకొన్న నిర్మాతలు ఏకంగా జూన్ 1వ తేదీ నుంచి సింగిల్ థియేటర్లను మూసి వేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఫిల్మీబీట్ కొందరు ఇండస్ట్రీ వర్గాలను సంప్రదించగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అలాగే ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించడం ఈ వివాదంలో మరో ట్విస్టుగా మారింది. ఇండస్ట్రీలోని కొందరు చెప్పిన విషయాలు ఏమిటి? ఏపీ ప్రభుత్వం దీనిని ఎలా డీల్ చేయబోతుందనే విషయాల్లోకి వెళితే..
ఆ నలుగురిలో ఆ వ్యక్తి అలా లబ్ది పొంది..
గత ఏడాదిలో గానీ.. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో పెద్ద సినిమాల రిలీజ్ నేపథ్యంలో లేని అద్దె, పర్సంటేజ్ సమస్యను ఇప్పుడే ఎందుకు తెరపైకి తెచ్చారు? డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఆ నలుగురిలో ఓ వ్యక్తికి సంబంధించిన సినిమాలు సంక్రాంతి సీజన్లో భారీగా రిలీజ్ అయ్యాయి. అప్పుడు ఏపీ ప్రభుత్వం నుంచి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నుంచి టికెట్ల రేట్ల పెంపు, బెన్ఫిట్ షోల విషయంలో ఆయన లబ్ది పొందాడు. ఆ సమయంలో లేని పర్సంటేజ్.. ఇప్పుడే వారికి ఎందుకు గుర్తుకు వచ్చాయి? ఆయనే ఎగ్జిబ్యూటర్లకు ఫోన్ చేసి.. పర్సంటేజీ విధానానికి ఒప్పుకోకపోతే జూన్ 1వ తేదీ నుంచి సింగిల్ థియేటర్లకు తాళాలు వేయాలని వారి చేత హెచ్చరికలు పంపారనే విషయం మాకు తెలిసిందని ఓ నిర్మాత వెల్లడించారు.

క్యూబ్ దోపిడి మాటేమిటి?
అయితే తెలుగు సినిమా పరిశ్రమలో చోటు చేసుకొన్న ఈ వివాదంపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొన్నది. సింగిల్ థియేటర్లను గ్రౌండ్ లీజ్ తీసుకొని డిస్ట్రిబ్యూషన్ రంగంపై గుత్తాదిపత్యం చేస్తూ చిన్న, మధ్య తరగతి నిర్మాతలను వేధిస్తున్న తీరుపై ఏపీ ప్రభుత్వ అధికారులు దృష్టిపెట్టారు. ముఖ్యంగా క్యూబ్ టెక్నాలజీతో ఆ నలుగురిలోని కొందరు చేస్తున్న అక్రమ దందాను దారుణంగా ఉంది. డిజిటల్ టెక్నాలజీపై పెట్టిన పెట్టుబడి మొదటి ఏడాదే వచ్చినా.. ఇంకా ఈ దోపిడిని కొనసాగిస్తున్నారు. వారం వారం క్యూబ్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు అంటూ ఓ డిస్టిబ్యూటర్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
హరిహర వీరమల్లు అడ్డుకొనేందుకు కుట్ర
అయితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కు ముందే ఈ వ్యవహారం తెరపైకి తెచ్చి.. ఇండస్ట్రీని మరింత సంక్షోభంలోకి నెట్టాలనే ప్రయత్నం డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని శాసించే వ్యక్తులు చేస్తున్నారు. హరిహర వీరమల్లు ఎన్నో ఆర్థిక సమస్యలను అధిగమించి రిలీజ్కు సిద్దమైంది. అలాంటి సినిమాను థియేటర్ల మూసివేత ద్వారా అడ్డుకొని పవన్ కల్యాణ్కు సవాల్ విసిరే ప్రయత్నం చేస్తున్నారా? ముందు ముందు ఆ నలుగురు తీసే సినిమాలకు ఇలాంటి సమస్యలు వస్తే ఏం చేస్తారు? పరిష్కారం కోసం ఎవరిని సంప్రదిస్తారు. ఇలాంటి సమస్యలను సమిష్టిగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. కానీ గుత్తాధిపత్యంతో బ్లాక్ మెయిల్ రూపంలో చేయకూడదు అని ఓ నిర్మాత ప్రశ్నించారు.

విచారణకు కందుల దుర్గేష్ ఆదేశం
తెలుగు సినిమా పరిశ్రమలో జూన్ 1వ తేదీ నుంచి సింగిల్ థియేటర్లను మూసి వేయాలని ఎగ్జిబ్యూటర్లు, డిస్టిబ్యూటర్లు తీసుకొన్న నిర్ణయంపై విచారణ జరపండి. ఈ వివాదం వెనుక ఎవరి హస్తం ఉంది? అనే విషయాన్ని వెంటనే తెలియజేయాలని ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసివేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారా? ఈ వ్యవహారం వెనుక వారి జెండా, ఎజెండా ఏమిటి? అనే విషయంపై సమగ్ర సమాచారం ఇవ్వాలి. ఎగ్జిబ్యూటర్లు, డిస్టిబ్యూటర్లు చేస్తున్న గ్రూప్గా ఏర్పడి ఈ వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంపై విచారణ చేపట్టండి. సినిమా హాల్స్ మూసివేత వల్ల ఇండస్ట్రీపై పడే ప్రభావం. ఆదాయానికి ఎలాంటి విఘాతం కలుగుతుందనే విషయంపై అధ్యయనం చేయాలి అని హోం శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్తో ఆయన చర్చించినట్టు తెలిసింది.
థియేటర్స్ బంద్ తప్పదా?
అయితే సింగిల్ థియేటర్ల మూసివేత విషయంలో తమపై వస్తున్న ఆరోపణలకు ఆ నలుగురు కానీ.. లేదా డిస్ట్రిబ్యూషన్ రంగంలోని పెద్దలు, ఎగ్జిబ్యూటర్లు ఎలా స్పందిస్తారనే విషయంపై ఆసక్తి నెలకొన్నది. పర్సంటేజ్ సిస్టమ్కు పట్టుబట్టి సినిమా హాళ్లను మూసి వేస్తారా? జూన్లో రిలీజ్ అయ్యే భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ను వాయిదా వేస్తారా? ఈ డిమాండ్ను చర్చల ద్వారా పరిష్కరించుకొని తమపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పుకొంటారా? అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











