శివాజీపై మా అసోసియేషన్కు ఫిర్యాదు... దిగొచ్చిన నటుడు, క్షమించాలంటూ వేడుకోలు
దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై మంగళవారం ఉదయం నుంచి సినీ ప్రముఖులు, నెటిజన్లు భగ్గుమన్నారు. సెలబ్రిటీ స్థానంలో ఉండి అలాంటి మాటలు సరికాదని, మహిళలను గౌరవించుకోవడం నేర్చుకోవాలని శివాజీపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అనసూయ భరద్వాజ్, మంచు మనోజ్, చిన్మయి శ్రీపాద తదితర ప్రముఖులు శివాజీ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో హీరో శివాజీ దిగొచ్చారు. తన వ్యాఖ్యలపై మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు.

హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు
లౌక్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని దండోరా చిత్రాన్ని నిర్మించారు. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా దండోరా రిలీజ్ కానున్న నేపథ్యంలో డిసెంబర్ 22న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో శివాజీ మాట్లాడుతూ.. గ్లామర్ పేరుతో హీరోయిన్లు సామాన్లు ప్రదర్శించొద్దని వ్యాఖ్యానించారు. పద్ధతిగా చీర కట్టుకోవాలని.. నిండైన వస్త్రధారణతోనే సావిత్రి, సౌందర్య వంటి నటీమణులు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు.
శివాజీకి మంచు మనోజ్ ఘాటు లేఖ
శివాజీ వ్యాఖ్యలపై నెటిజన్లతో పాటు చిత్ర పరిశ్రమ నుంచి ఓ రేంజ్లో విమర్శలు వెల్లువెత్తాయి. నటి అనసూయ భరద్వాజ్, సింగర్ చిన్మయి శ్రీపాద, హీరో మంచు మనోజ్లు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. శివాజీ తరపున మహిళా లోకానికి క్షమాపణలు చెబుతున్నట్లు మనోజ్ లేఖ విడుదల చేశారు. అటు శివాజీ వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళా నటులు, దర్శకులు, నిర్మాతలు సీరియస్ అయ్యారు. టాలీవుడ్లో మహిళల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన వాయిస్ ఆఫ్ విమెన్ కమిటీ సైతం స్పందించింది.
శివాజీపై మా అసోసియేషన్కు లేఖ
దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహిళల వస్త్రధారణపై శివాజీ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు తెలిపింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో సభ్యుడైన శివాజీ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేసింది. మహిళా లోకానికి శివాజీ తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో తాము న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో పలు విభాగాలలో పనిచేస్తున్న 100 మంది మహిళల తరపున మేము లేఖ రాస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ లేఖలో దర్శకురాలు నందిని రెడ్డి, నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, స్వప్నదత్, మంచు లక్ష్మీ, ఝాన్సీ లక్ష్మీలు ఉన్నారు.
శివాజీకి మహిళా కమీషన్ నోటీసులు
మరోవైపు.. ఈ వివాదంపై తెలంగాణ మహిళా కమీషన్ సైతం సీరియస్ అయ్యింది. ఈ మేరకు తాను చేసిన కామెంట్స్పై వివరణ ఇవ్వాలని మహిళా కమీషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద ఆయనకు నోటీసులు జారీ చేశారు. శివాజీ వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమీషన్లోని లీగల్ టీమ్ పరిశీలించినట్లు ఆమె తెలిపారు. త్వరలోనే శివాజీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటామని శారద వెల్లడించారు. మహిళల గురించి మాట్లాడే విషయంలో సినీనటులు అప్రమత్తంగా ఉండాలని.. సెలబ్రిటీలే కాదు, ఎవరైనా సరే మహిళల గురించి అసభ్యంగా మాట్లాడితే చర్యలు తప్పవని శారద హెచ్చరించారు.
ఆ రెండు పదాలు మాట్లాడకూడదు
అన్ని వైపుల నుంచి విమర్శలు, ఒత్తిడితో పాటు ఇప్పుడు మహిళా కమీషన్ కూడా సీరియస్ కావడంతో నటుడు శివాజీ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లు ఈ మధ్యకాలంలో ఇబ్బందిపడ్డ సందర్భంలో నాలుగు మంచి మాటలు చెప్పాలని చెబుతూనే రెండు అన్ పార్లమెంటరీ వర్డ్స్ని మాట్లాడాను. ఎవరికైనా వాళ్ల మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది.. అమ్మాయిల అందాన్ని ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటికి వెళ్లినప్పుడు, బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బందిగా ఉండదేమో అమ్మా అనే ఉద్దేశం తప్ప నేను ఎవరినీ అవమానపరచాలని కాదు. కానీ ఏదైనా రెండు అన్ పార్లమెంటరీ వర్డ్స్ దొర్లాయి. దానికి క్షమాపణలు చెబుతున్నా అని శివాజీ అన్నారు.
స్త్రీ అంటే ఒక మహాశక్తి
నేనెప్పుడూ స్త్రీ అంటే ఒక మహాశక్తి. ఒక అమ్మవారి లాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వొద్దని చెప్పటమేనన్న ఇంటెన్షన్లో ఒక ఊరి భాష మాట్లాడటం చాలా తప్పు. దానికి నా క్షమాపణలు. నా ఇంటెన్షన్ మంచిదే కానీ, ఆ రెండు పదాలు దొర్లకుండా ఉంటే ఈ రోజు ఈ పరిస్ధితి లేదు. బట్ ఒకటి మాత్రం చెబుతున్నా.. మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప.. అవమానపరచాలని, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్ధితుల్లోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు.. దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీనిని తప్పుగా అనుకుంటే మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా అమ్మా.. థ్యాంక్యూ అంటూ శివాజీ ముగించారు.


Click it and Unblock the Notifications











