శివాజీకి SKN దిమ్మ తిరిగే కౌంటర్.. అనసూయకు సపోర్ట్గా షాకింగ్ కామెంట్స్
దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమ నేటికీ రగులుతోంది. శివాజీ వ్యాఖ్యలపై స్టార్ యాంకర్, సినీనటి అనసూయ భరద్వాజ్ కౌంటర్ ఇవ్వడంతో వివాదం ముదిరి పాకానపడింది. దాంతో ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియా జనాలు రెండు వర్గాలుగా విడిపోయాయి. శివాజీకి సపోర్ట్ చేసేవారు ఒక వర్గంగా, అనసూయకు మద్ధతుగా నిలిచేవారు మరో వర్గంగా నిలిచారు. తాజాగా శివాజీకి నిర్మాత ఎస్కేఎన్ కౌంటర్ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
హీరోయిన్లు నిండుగా చీర కట్టుకోవాలని అంతేకానీ సామాన్లు బయటపెట్టొద్దని శివాజీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివాదం రేగడంతో అనసూయ భరద్వాజ్, సింగర్ చిన్మయి, మంచు విష్ణు, హీరోయిన్ నిధి అగర్వాల్ తదితరులు ఆయనకు కౌంటరిచ్చారు. విషయం మా అసోసియేషన్కు, తెలంగాణ మహిళా కమీషన్ దృష్టికి వెళ్లడంతో శివాజీ క్షమాపణలు చెప్పారు. మంచి చెప్పాలన్నదే తన ఉద్దేశమని ఈ సమయంలో రెండు పదాలు తప్పుగా దొర్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అక్కడితో ఈ వివాదానికి తెరపడుతుందని అంతా భావించారు. కానీ ఆ మరుసటి రోజు శివాజీ ప్రెస్మీట్ పెట్టడం.. మధ్యలో అనసూయ పేరు ప్రస్తావించడంతో అనసూయ రెచ్చిపోయింది. ఆ రోజు నుంచి అనసూయకి, శివాజీకి మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. వీరిద్దరికి మద్ధతు చేసేవారు, నెటిజన్లతో సోషల్ మీడియా హొరెత్తిపోతోంది.

తాజాగా డిసెంబర్ 27వ తేదీన అనసూయకు మద్ధతుగా జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబు రియాక్ట్ అయ్యారు. మోడ్రన్ దుస్తులు ధరించడం తప్పు కాదని.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు దుస్తులు కారణం కాదని, మగాళ్ల క్రూరత్వమే కారణమని నాగబాబు మండిపడ్డారు. ప్రతి ఆడపిల్లను ఇంట్లోని మనిషిలాగే చూడాలని.. ఆడపిల్లలు ఎలాంటి బట్టలు ధరించినా, రక్షణ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆడవాళ్లను అవమానించిన వారు బాగుపడినట్లు ఎక్కడా లేదని నాగబాబు పేర్కొన్నారు. దాంతో నాగబాబుకు అనసూయ థ్యాంక్స్ చెప్పారు. ఆ వెంటనే సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా అనసూయకు మద్ధతుగా మాట్లాడారు.
మరోవైపు... హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ మహిళా కమీషన్ ఎదుట శివాజీ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఇండస్ట్రీలోని కొంతమందికి వ్యతిరేకత ఉందని, నాపై కుట్ర జరుగుతోందని.. జూమ్ మీటింగ్ పెట్టుకుని మరీ నన్ను టార్గెట్ చేస్తున్నారని శివాజీ ఆరోపించారు. నేను మాట్లాడిన మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారని.. ఆవేశంలో అలా మాట్లాడినప్పటికీ ఎలాంటి దురుద్దేశం లేదని శివాజీ చెప్పారు. ఓ తండ్రి పిల్లలకు చెప్పినట్లుగా నాలుగు మంచి మాటలు మాట్లాడానని తెలిపారు.
కాగా.. శివాజీ వ్యాఖ్యలపై నిర్మాత ఎస్కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రిలీజైన పతంగ్ మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతుండటంతో చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎస్కేఎన్ మాట్లాడుతూ.. అమ్మాయిలూ.. మీకు ఏ డ్రెస్ కంఫర్టబుల్గా ఉంటే అది వేసుకోండి. ఏ డ్రెస్లో కాన్ఫిడెన్స్గా ఉంటే అది వేసుకోండి. ఏ బట్టల సత్తిగాని మాటలను వినకండి. ఎందుకంటే కాన్ఫిడెన్స్, ఇలా ఏదైనా సరే హార్ట్లో నుంచి రావాలి. ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది.. ఈ డ్రెస్ వేసుకుంటే ఏదో అయిపోతుందని ఏం ఉండదు. ఏం జరిగినా మన మనసు మంచిదైతే, మనం మంచిగా ఉంటాం. మన ఇంటెన్షన్ మంచిగా ఉంటే మనకి మంచి జరుగుతుంది తప్ప డ్రెస్లో ఉండదు అని ఎస్కేఎన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై హీరో శివాజీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











