రాజమౌళికి ఎదురు దెబ్బ.. జూ ఎన్టీఆర్ ఆశలపై నీళ్లు
భారతీయ సినిమా పరిశ్రమకు మార్గదర్శకుడు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ మూవీ వివాదంలో చిక్కుకొన్నది. దర్శక ధీరుడు రాజమౌళి నిర్మాతగా, అలాగే రాజ్ కుమార్ హిరాణి ఈ సినిమాను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒకే సమయంలో ఈ రెండు టీమ్లు పోటాపోటీగా సినిమాలు నిర్మించడంపై ఫాల్కే కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం ఈ వివాదానికి కారణమైంది. అయితే ఈ మూవీపై లెజెండరీ ఫిల్మ్ మేకర్ చెప్పిన అభ్యంతరాల వివరాల్లోకి వెళితే..
దాదా సాహెబ్ ఫాల్కే జీవిత కథను బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత రాజ్ కుమార్ హిరాణీ వెండి తెర మీద ఆవిష్కరించేందుకు సిద్దమయ్యారు. ఫాల్కేగా అమీర్ ఖాన్ను నటింపజేసేందుకు రెడీ అయ్యారు. నాలుగేళ్లుగా కథ, కథనాలపై వర్క్ చేస్తున్న టీమ్ ఈ సినిమాను అక్టోబర్ నెలలో ప్రారంభించాలని ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నది.

ఇదే సమయంలో మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్తో పాన్ ఇండియా మూవీగా ఫాల్కే బయోపిక్ తెరకెక్కించే ప్రయత్నాలను ఎస్ఎస్ రాజమౌళి టీమ్ ప్లాన్ చేసింది. ఈ సినిమాకు రాజమౌళి నిర్మాతగా వ్యవహరించేందుకు సిద్దంగా కాగా, ఫాల్కేగా ఎన్టీఆర్ నటించేందుకు రెడీ అయ్యారనే వార్తలు మీడియాలో వినిపించాయి. ఈ సినిమాను రాజమౌళి కుమారుడు కార్తీకేయ, బాలీవుడ్ ప్రముఖుడు, మ్యాక్స్ స్టూడియో అధినేత వరుణ్ గుప్తా రూపొందించే పనిలో ఉండగా, జాతీయ అవార్డు గ్రహీత నితిన్ కక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించేందుకు రెడీ అయ్యారు.
బయోపిక్ వివాదంపై ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ పుసాల్కర్ జాతీయ మీడియా అమర్ ఉజాలాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ దిగ్గజం ఫాల్కే జీవితంపై బయోపిక్ తీసే సమయంలో ఆయన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన కుటుంబ సభ్యులు మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి. రాజమౌళి కూడా ఫాల్కే బయోపిక్ తీస్తున్నారనే వార్త మా దృష్టికి వచ్చింది. ఆయన మమ్మల్ని ఇంత వరకు కాంటాక్ట్ చేయలేదు. రాజమౌళి తరఫున కూడా ఎవ్వరూ కూడా మమ్మల్ని సంప్రదించలేదు అని అన్నారు.
ఫాల్కే జీవితంపై సినిమా తీయాలని ప్లాన్ చేసినప్పడు వారికి సంబంధించిన వారిని కలువాల్సిన బాధ్యత తప్పకుండా ఉంటుంది. వాస్తవ కథలను తెరకెక్కించేటప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం ఆనవాయితీగా వస్తున్నది. మాతో మాట్లాడకుండా మేడ్ ఇండియా ప్రాజెక్టును ఎలా ప్రకటిస్తారు? అని ఆయన ప్రశ్నించారు.
ఫాల్కే బయోపిక్ విషయంపై మాతో రాజ్ కుమార్ హిరాణి టీమ్ సభ్యులు మాతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ సినిమా సహ నిర్మాత హిందూకుష్ భరద్వాజ్ కొన్ని సంవత్సరాలుగా మాతో టచ్లో ఉన్నారు. అమీర్, హిరాణి ఈ సినిమా కోసం చేస్తున్న కృషి మమ్మల్ని ఆకట్టుకొన్నది. వారి ఈ సినిమాను తీయడానికి మా నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవు. మా నానమ్మ సరస్వతి భాయ్ ఫాల్కే పాత్రను విద్యా బాలన్ చేస్తే బాగుంటుందని అనుకొంటున్నాను అని చంద్రశేఖర్ శ్రీకృష్ణ పుసాల్కర్ అభిప్రాయపడ్డారు. అయితే చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలతో రాజమౌళికి ఎదురు దెబ్బ తగిలింది. జూనియర్ ఎన్టీఆర్కు గొప్ప పాత్రను పోషించే అవకాశం చేజారుతుందా? అనే ఫీలింగ్స్ అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











