Rajamouli: రాజమౌళి లక్ష్యం అదేనట! మహేశ్ ‘వారణాసి'తో నెరవేరేనా?
Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ వేదికపై సగర్వంగా తెలుగు సినిమాను నిలిపారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ను సాధించింది. మన సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ సినిమాను మించి మరో భారీ అడుగు వేయబోతున్నారు రాజమౌళి. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో రూపొందిస్తున్న భారీ అడ్వెంచర్ సినిమా 'వారణాసి'( Varanasi) గ్లోబల్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కుతోంది. భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ పటంపై నిలబెట్టాలని అగ్ర దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి (S.S.Rajamouli) మరోసారి తన గ్లోబల్ విజన్ను వెల్లడించారు.
తాజాగా ఇచ్చిన ఓ అంతర్జాతీయ ఇంటర్వ్యూలో ఎస్. ఎస్. రాజమౌళి మాట్లాడుతూ.. 'ఇండియన్ సినిమా కేవలం దేశానికే పరిమితం కాకుండా, ఒక అంతర్జాతీయ బ్రాండ్గా ఎదగాలి' అన్నదే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జపనీస్ యానిమేషన్, కొరియన్ K-Popలాగా భారతీయ సినిమాలకు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్బేస్ ఉండాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. రాజమౌళి మాటల్లో చెప్పాలంటే.. ఇతర దేశాల కంటెంట్ భాషా గడులు దాటి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నప్పుడు, మన కథలు ఎందుకు ప్రపంచాన్ని చేరకూడదు? అనే ప్రశ్నే తనను ముందుకు నడిపిస్తోందట. ముఖ్యంగా డెమోన్ స్లేయర్: ముగెన్ ట్రైన్ (Demon Slayer: Mugen Train) వంటి జపనీస్ యానిమేషన్ సినిమాలు భారత్లోనూ భారీ క్రేజ్ సంపాదించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. ఇది కంటెంట్కు ఉన్న శక్తిని స్పష్టంగా చూపిస్తోందని అభిప్రాయపడ్డారు.

RRRతో నమ్మకం
ఈ ఆలోచనలకు ఉదాహరణగా RRR నిలిచిందని జక్కన్న పేర్కొన్నారు. విడుదలకు ముందు వరకు ఇది ఒక ప్రాంతీయ సినిమాగానే భావించబడినా... రిలీజ్ తర్వాత మాత్రం గ్లోబల్ ఈవెంట్లా మారిపోయిందన్నారు. భారీ బడ్జెట్, హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్, భావోద్వేగాలతో నిండిన కథనం కలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కట్టిపడేశాయని చెప్పారు. అంతకుముందే బాహుబలి (Baahubali)సిరీస్తో భారతీయ సినిమాకు కొత్త మార్కెట్లు తెరుచుకున్నాయని గుర్తుచేశారు. ఈ విజయాలు కేవలం వసూళ్ల పరంగా మాత్రమే కాదు.. భారతీయ సినిమాపై ప్రపంచ దృష్టిని మళ్లించడంలోనూ కీలక పాత్ర పోషించాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. 'భాష కాదు- కథే అసలు హీరో' అన్న సిద్ధాంతాన్ని రాజమౌళి సినిమాలు మరోసారి రుజువు చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గ్లోబల్ మార్కెట్ వైపు 'వారణాసి'
ఇప్పుడు అదే దిశలో మరో భారీ అడుగు వేయబోతున్నారు రాజమౌళి. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో రూపొందిస్తున్న భారీ అడ్వెంచర్ సినిమా 'వారణాసి'( Varanasi) గ్లోబల్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కుతోంది. హాలీవుడ్ స్థాయి మేకింగ్ విలువలతో పాటు, భారతీయ మట్టివాసన కలిగిన భావోద్వేగాలను ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే జక్కన్న ప్లాన్. వారణాసి సినిమాలో రుద్ర పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారు. మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ మూడు ప్రధాన పాత్రలనే రాజమౌళి రివీల్ చేశారు. టైటిల్ టీజర్ ద్వారా 'వారణాసి వరల్డ్' ఎలా ఉండబోతోందో ఓ శాంపిల్ కూడా చూపించారు. వచ్చే ఏడాది సమ్మర్ సీజన్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ఇండస్ట్రీ టాక్.
జక్కన్న కల నెరవేరుతుందా?
కేవలం యాక్షన్ కాదు... భారతీయ మూలాలున్న బలమైన భావోద్వేగాలను ప్రపంచానికి చూపిస్తే అంతర్జాతీయ ప్రేక్షకుల ఆధారిస్తారని రాజమౌళి విశ్వసిస్తున్నారు. RRR, బాహుబలి విజయాల తర్వాత 'వారణాసి' ఆయన గ్లోబల్ డ్రీమ్ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్ట్గా మారుతుందా? అన్నది ఇప్పుడు సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్న. భారతీయ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలనే జక్కన్న కల ఇప్పుడిప్పుడే నిజమవుతోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మహేశ్ 'వారణాసి'తో ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరుతుందా? సమాధానం త్వరలోనే వెండితెరపై కనిపించనుంది.


Click it and Unblock the Notifications











