SSMB 29 : మహేష్ బాబు ఈవెంట్పై వివాదం.. మీడియా కెమెరాలకు నో ఎంట్రీ ?
SSMB 29: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ వర్డల్ మూవీ తెరకెక్కుతోంది. "గ్లోబ్ ట్రాటర్ (Globe Trotter)" గా పిలుస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నవంబర్ 15న హైదరాబాద్లో ఈ సినిమా వరల్డ్ లుక్ రివీల్ ఈవెంట్ జరగనుంది. కానీ, ఈ వేడుకకు స్థానిక మీడియా కెమెరాలకు అనుమతి ఇవ్వకపోవడం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
కెమెరాలకు నో ఎంట్రీ ఎందుకు?
విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ ప్రత్యేక ఈవెంట్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారమ్ జియో హాట్స్టార్ (Jio Hotstar) కొనుగోలు చేసింది. అందువల్ల ఈవెంట్లో జరిగే ప్రతి క్షణం ఎక్స్క్లూజివ్గా హాట్స్టార్లోనే ప్రసారం అవుతుంది. ఇందుకే నిర్వాహకులు ఇతర టీవీ ఛానెల్స్, యూట్యూబ్ మీడియా, వెబ్ మీడియా కెమెరాలను నిషేధించారు. సాధారణంగా మహేష్ బాబు లేదా రాజమౌళి సినిమాల ఈవెంట్లకు తెలుగు మీడియా ప్రతినిధులు, యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ మీడియా పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. కానీ ఈసారి మాత్రం వారికి పరిమిత ప్రవేశం మాత్రమే ఉండబోతోందని తెలుస్తోంది. ఈ నిర్ణయం తెలుగు మీడియా వర్గాల్లో అసంతృప్తి రేకెత్తిస్తోంది.

రాజమౌళి - తెలుగు మీడియా మధ్య దూరమా?
ఇది రాజమౌళి, స్థానిక మీడియా మధ్య దూరం పెరుగుతోందన్న చర్చ మళ్లీ తెరపైకి తెచ్చింది. "ఆర్ఆర్ఆర్" సమయంలో కూడా రాజమౌళి ఎక్కువగా హిందీ, తమిళ, అంతర్జాతీయ మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చి, తెలుగు మీడియాకు తక్కువ సమయం కేటాయించారు. ఇప్పుడు "గ్లోబ్ ట్రాటర్" ఈవెంట్లో కూడా అదే పద్ధతి కొనసాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంతమంది జర్నలిస్టులు సోషల్ మీడియాలో స్పందిస్తూ "రాజమౌళి సినిమాలను మొదటినుంచీ తెలుగు మీడియానే పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. కానీ, ఇప్పుడు మనల్ని పక్కన పెట్టడం కొంచెం నిరాశ కలిగిస్తోంది" అంటూ వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఈవెంట్ ప్లానింగ్
"గ్లోబ్ ట్రాటర్" ప్రాజెక్ట్ను రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో, రామోజీ ఫిల్మ్ సిటీలో అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో ప్రపంచ స్థాయి LED సెట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్తో కూడిన విజువల్ ప్రెజెంటేషన్ ఉండనుంది. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు, రాజమౌళితో పాటు ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్, ఇతర సినీ ప్రముఖులు హాజరవుతారని సమాచారం. అయితే హాట్స్టార్ ఎక్స్క్లూజివ్ రైట్స్ కారణంగా బయటి మీడియా కెమెరాలు, లైవ్ స్ట్రీమింగ్ పరికరాలు పూర్తిగా నిషేధించబడ్డాయి. ఈవెంట్కి ప్రవేశ పాస్ల కోసం ఇప్పటికే భారీ డిమాండ్ ఉంది. సుమారు ఒక లక్ష మంది అభిమానులు హాజరవుతారని అంచనా.
"వారణాసి" - SSMB29 టైటిల్గా ఫిక్స్?
ఇక సినిమా టైటిల్ విషయానికి వస్తే, రాజమౌళి ఈ ప్రాజెక్ట్కు "వారణాసి (Varanasi)" అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్, యాక్షన్-అడ్వెంచర్ సినిమాగా రూపొందుతోంది. సూపర్ స్టార్ పాత్ర ప్రపంచాన్ని చుట్టి వచ్చే గ్లోబల్ ఎక్స్ప్లోరర్ కాన్సెప్ట్లో ఉంటుందని టాక్. నవంబర్ 15న జరగబోయే "గ్లోబ్ ట్రాటర్ - వరల్డ్ లుక్ రివీల్ ఈవెంట్" సూపర్ స్టార్ అభిమానులకు పండుగే కానీ, తెలుగు మీడియా ఎక్స్క్లూజన్ మాత్రం కొత్త చర్చలకు దారితీస్తోంది.


Click it and Unblock the Notifications











