SSMB 29 : రాజమౌళికి షాక్ .. పాస్పోర్ట్ కొట్టేసిన మహేశ్, ఫారిన్కి జంప్!
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఎస్ఎస్ఎంబీ 29. సూపర్స్టార్ మహేశ్ బాబును ఆయన తొలిసారి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాపై టాలీవుడ్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు హాలీవుడ్ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్తో తెలుగు నుంచి తొలి పాన్ వరల్డ్ సినిమాగా ఎస్ఎస్ఎంబీ 29ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. షూటింగ్ను వేగంగా పరుగులు పెట్టిస్తున్నారు జక్కన్న. తాజాగా రాజమౌళికి షాకిచ్చారు మహేశ్ బాబు . ఈ వివరాల్లోకి వెళితే..
సెట్స్ మీదకి వెళ్లడం కంటే ముందు నుంచే ఈ సినిమాలో మహేశ్ సరసన హీరోయిన్ ఎవరు? విలన్ ఎవరు? నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరంటూ పెద్ద డిస్కషన్ నడిచింది. ఈ క్రమంలో తొలుత గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు కన్ఫర్మ్ అయ్యింది. ఎస్ఎస్ఎంబీ 29లో ప్రియాంక హీరోయిన్గా నటిస్తున్నారా? ఏదైనా కీ రోల్ పోషిస్తున్నారా? అన్నది తెలియరాలేదు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎంబీ 29 యూనిట్.. నెక్ట్స్ ఒడిషాకు షిప్ట్ అయ్యింది.

అక్కడి ఎయిర్పోర్ట్లో మహేశ్ బాబుతో పాటు మలమాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయన ఎస్ఎస్ఎంబీ 29లో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఒడిషా షెడ్యూల్ సందర్భంగా చిత్ర యూనిట్ ఎన్నో ఇబ్బందులు పడింది. ముఖ్యంగా కీలక సన్నివేశాలు ఆన్లైన్లో ప్రత్యక్షం కావడంతో రాజమౌళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమౌళి తన సెట్లో చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. బయటి వ్యక్తులను లోపలికి రానివ్వరు.. అలాగే నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫోన్ తీసుకురానివ్వరు. అలాంటిది ఇలా కీలక సన్నివేశాలు లీక్ కావడంతో రాజమౌళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయినప్పటికీ మహేశ్ బాబు జిమ్లో వర్కవుట్స్ చేస్తూ అద్దం ముందు తనను తాను చూసుకుంటున్న వీడియో వైరల్ అయ్యింది. అందులో మహేశ్ లుక్, గెటప్ జూలు విదిల్చిన సింహంలా ఉండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రాజమౌళికి పని రాక్షసుడన్న పేరున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి వారిని పిండేసిన జక్కన్న.. రాకుమారుడు లాంటి మహేశ్ను ఏం చేస్తాడోనని ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇక జక్కన్న గురించి చెప్పుకునే మరో విషయం.. ఆయన కాంపౌండ్లోకి అడుగుపెట్టిన నటీనటులు తన సినిమామ పూర్తయ్యే వరకు ఎక్కడికి వెళ్లకూడదు.
అందుకు తగినట్లుగానే ఎస్ఎస్ఎంబీ 29 సెట్స్ మీదకు వెళ్లినరోజున రాజమౌళి ఓ పోస్ట్ చేశారు. అందులో సింహాన్ని జైలులో బంధించి, తన చేతిలో పాస్పోర్ట్ పట్టుకుని నిల్చొన్నాడు. అంటే దీని అర్ధం మహేశ్ ఇక నా చేతుల్లో బందీ అయిపోయాడని ఫ్యాన్స్కు చెప్పారు జక్కన్న. స్వతహాగా మహేశ్ తన ఫ్యామిలీతో ఫారిన్కు వెళ్లడం అలవాటు. ఎస్ఎస్ఎంబీ 29 కారణంగా మహేశ్ షూటింగ్కు పరిమితమైపోయాడు. అయితే మహేశ్ .. రాజమౌళికే షాకిచ్చాడు. తన పాస్పోర్ట్ని కొట్టేసిన ప్రిన్స్ ఎయిర్పోర్టులో కనిపించాడు. అక్కడి విలేకరులకు తన పాస్పోర్ట్ చూపించడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరూ మహేశ్ బాబును ఆపలేరంటూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











