SSMB29: రాజమౌళి సర్ప్రైజ్... ఎస్ఎస్ఎంబీ 29లో పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ రిలీజ్
ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ మార్క్ మూవీ తర్వాత సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి టేకప్ చేస్తోన్న మూవీ ఎస్ఎస్ఎంబీ 29. మహేశ్ కెరీర్లోనే ఇది 29వ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్తో పాన్ వరల్డ్ మూవీగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలోనే కనివినీ ఎరుగని స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 1000 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఎస్ఎస్ఎంబీ 29ను తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఈ సినిమాపై టాలీవుడ్తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలోనే భారీ అంచనాలున్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఎస్ఎస్ఎంబీ 29లో భారీ స్టార్ క్యాస్టింగ్
ఎస్ఎస్ఎంబీ 29లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, మలయాళ సూపర్స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మిగిలిన నటీనటుల పేర్లు, ఇతర వివరాలు బయటకు రాకుండా జక్కన్న గోప్యంగా ఉంచుతున్నారు. ఈ సినిమాలో నానాపటేకర్, ఆర్ మాధవన్ తదితర స్టార్స్ నటించబోతున్నట్లుగా తొలుత గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇంత వరకు దీనిపై క్లారిటీ లేదు. అలాగే ఈ సినిమా కథ ఇదేనంటూ రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. వారణాసి నేపథ్యంలో ప్రపంచ యాత్రకుడి అన్వేషణ ఇతివృత్తంగా ఎస్ఎస్ఎంబీ 29ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

రామోజీ ఫిలింసిటీలో టైటిల్ లాంచ్ వేడుక
ఎస్ఎస్ఎంబీ 29కి సంబంధించి లోకేషన్ నుంచి పలు లీకులు జరగడంతో జక్కన్న ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అలాగే మహేశ్ మెడలో త్రిశూలం, ఎద్దు, డమరుకం, శివుని నామాలతో ఉన్న పోస్టర్ను రిలీజ్ చేసిన రాజమౌళి.. ఈ చిత్రం పేరును మాత్రం వెల్లడించలేదు. నవంబర్ 15న ఎస్ఎస్ఎంబీ 29 టైటిల్ను రీవిల్ చేస్తామని ఆయన ప్రకటించారు. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో గ్లోబ్ ట్రాట్టర్ పేరుతో భారీ ఈవెంట్ జరుగుతుందని తెలిపారు. అంతేకాదు.. ఈ ఈవెంట్కు విషయంలోనూ తన మార్కెటింగ్ స్ట్రాటజీ వాడుతున్నారు. నిర్మాతలకు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేలా ఇప్పటి నుంచే ప్లానింగ్తో వెళ్తున్నారు. దీనిలో భాగంగా గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్స్టార్కు విక్రయించి కొత్త ట్రెండ్ సెట్ చేశారు రాజమౌళి.
కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్
నవంబర్ 15న జరిగే గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్కు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష మంది అభిమానులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ చీఫ్ గెస్ట్గా హాజరవుతారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే అంతకంటే ముందే ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇస్తానని నవంబర్ 7వ తేదీన షాకింగ్ ట్వీట్ చేశారు రాజమౌళి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అడ్వాన్స్డ్ వీల్చైర్లో కూర్చొని ఆక్టోపస్ మాదిరిగా ఉన్న రోబో చేతులతో భారీ ఫైట్ చేస్తున్నట్లుగా ఉంది.
అంచనాలను పెంచేసిన జక్కన్న
ఎస్ఎస్ఎంబీ 29లో పృథ్వీరాజ్ సుకుమారన్.. కుంభ అనే పాత్రను పోషిస్తున్నట్లు రాజమౌళి వెల్లడిస్తూ ట్వీట్ చేశారు. ఫస్ట్ షాట్ ముగిసిన తర్వాత పృథ్వీ దగ్గరికి వెళ్లి ఆయనతో ఒక మాట చెప్పాను. నాకు తెలిసిన వారిలో అద్భుతమైన నటులలో నువ్వు కూడా ఒకరని పృథ్వీతో చెప్పా. ఈ క్రూరమైన, పవర్ఫుల్ విలన్ కుంభను పరిచయం చేస్తున్నాను. ఈ పాత్రను సృష్టించినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. కుర్చీలో ఒదిగిపోయినందుకు పృథ్వీకి ధన్యవాదాలని రాజమౌళి ట్వీట్లో తెలిపారు. దాంతో ఈ చిత్రంలో మహేశ్ బాబు పాత్ర ఎలా ఉంటుందా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి సింగిల్ పోస్టర్తో ఎస్ఎస్ఎంబీ 29పై అంచనాలను మరింత పెంచేశారు రాజమౌళి.


Click it and Unblock the Notifications











