SSMB28: మహేశ్ లేకుండానే మొదలైన సినిమా: అతడి బదులు ఎవరు హాజరయ్యారంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా బడా ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటూ వెళ్లే హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. ఆ మధ్య కొన్ని భారీ డిజాస్టర్లను చవి చూసిన అతడు.. 'భరత్ అనే నేను' నుంచి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడని ఈ స్టార్ హీరో.. వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే తన ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుసగా లైన్లో పెట్టుకుంటున్నాడు. ఇలా ప్రస్తుతం అతడు 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
పరశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రమే 'సర్కారు వారి పాట'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఇంకా హీరోతో చేయాల్సిన పార్ట్ బ్యాలెన్స్ ఉంది. త్వరలోనే దీన్ని కూడా పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకున్నాడతను. ఇక, మహేశ్ బాబు తన 28వ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. 'సర్కారు వారి పాట' ఆలస్యం అవుతోన్న కారణంగానే దీన్ని ఇంత కాలం మొదలు పెట్టలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాను ఈరోజు మొదలు పెట్టేశారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రకటించిన సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి 3వ తేదిన జరగబోతున్నాయని కొద్ది రోజుల క్రితమే ఓ న్యూస్ లీకైంది. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ సినిమాను కొంత మంది సభ్యుల నడుమ నిరాడంబరంగా మొదలు పెట్టారు. హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమం ఉదయం 9 - 10 గంటల మధ్యలో జరిగింది. కోవిడ్ జాగ్రత్తల్లో భాగంగా దీనికి కొంత మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మీడియా ప్రతినిధులకు కూడా పరిమితులతో కూడిన అనుమతిని ఇచ్చారు.

ఎంతో సందడిగా సాగిన ఈ సినిమా పూజా కార్యక్రమాలకు చిత్ర హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు హాజరు కాలేదు. ఆయన స్థానంలో భార్య నమ్రత శిరోద్కర్ దీనికి వచ్చారు. ఆమెతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ, సూర్య దేవర నాగ వంశీ, హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఇక, ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, SSMB28FirstClap అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రానికి 'పార్థు', 'అతడే పార్థు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. దీనికి ఎడిటర్గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్గా ఏఎస్ ప్రకాశ్, కెమెరామెన్గా మథి, మ్యూజిక్ డైరెక్టర్గా ఎస్ థమన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఇందులో మరో హీరోయిన్ కూడా నటిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, మోహన్ బాబు కీలక పాత్రను చేస్తున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











